ఆజాదీ కా అమృత్ మహోత్సవాల సందర్భంగా దేశంలో ఇంటింటా జాతీయ జండా ఎగురుతున్నది. తెలంగాణలో మాత్రం జండాతో పాటు పల్లె పల్లెకు, ఇంటింటికీ ఆసరా పథకం అందిస్తున్నది కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకు ఆసరా పథకం ద్వారా 36 లక్షల మంది లబ్ధి పొందగా, ఇప్పుడు మరో 10 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది.
తెలంగాణ ఏర్పడ్డాక ఉద్యమ ఫలాలు పింఛన్ల రూపంలో ఇంటింటికీ అందుతున్నాయి. ఒక్క వృద్ధులే కాదు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత, చేనేత, బీడీ కార్మికులు, కళాకారులు, హెచ్ఐవీ, ఫైలేరియా రోగులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2014, నవంబర్ 8న మహబూబ్నగర్ జిల్లాలోని కొత్తూరు గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఆసరా’ పథకాన్ని ప్రారంభించారు. దీంతో బీడీ కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మంది వరకు బీడీ తయారీతో ఉపాధి పొందగా వీరిలో ఎక్కువమంది మహిళలే ఉన్నారు. ఈ బీడీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలని, వీరిని ఆసరా పథకం కింద చేర్చి రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 4,07,374 మందికి పింఛన్లు అందిస్తున్నది ప్రభుత్వం. దేశంలోనే బీడీ కార్మికులకు ఆసరా పింఛను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ.
రాష్ట్ర ప్రభుత్వం అటు చెట్టు గీసే గీతన్నకు, ఇటు బట్ట నేసే నేతన్నకు పెద్దపీట వేసింది. యాభై ఏండ్లు నిండిన ప్రతి నేత, గీత కార్మికుడిని ఆసరా పథకంలో చేర్చి పింఛన్ మంజూరు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 36,872 మంది చేనేత కార్మికులు, 62,164 మంది గీత కార్మికులు 3,0487 మంది కళాకారులు నెలనెలా టంచనుగా ఆసరా పింఛన్ అందుకొని నిబ్బరంగా, నిర్భయంగా జీవిస్తున్నారు. విధి వంచిత వితంతువులు, ఒంటరి మహిళలకు పెద్ద ఎత్తున ఈ ఆసరా పింఛన్ అండగా నిలుస్తున్నది. నెలనెలా పింఛన్ అందిస్తూ ఒంటరి మహిళల్లో ఆత్మగౌరవాన్ని నింపి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడేలా బతుకు మీద ఆశను పెంచారు ముఖ్య మంత్రి కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన 1,33,936 మంది ఒంటరి మహిళలకు, 14,33, 837 మంది వితంతువులకు పింఛన్ అందిస్తూ కొత్త జీవితాన్నిస్తున్నారు.
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో చాలామంది రోగాల బారినపడి బాధపడుతున్నారు. వీరిలో దీర్ఘకాలిక వ్యాధులైన ఫైలేరియా, ఎయిడ్స్ రోగులే ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లోనైతే వీరి బతుకులు మరీ దుర్భరం. కనీసం కూలీకి కూడా పిలువరు. ఏ ఆసరా లేక దేవుడి మీద భారమేసి బరువుగా బతుకీడుస్తున్న వీరికి తానే దేవుడై ఆసరాతో వారి బతుకుల్లో వెలుగు నింపాడు కేసీఆర్. రాష్ట్రవ్యాప్తంగా 32,718 హెచ్ఐవీ రోగులు 14,907 ఫైలేరియా రోగులకు నెలనెలా పింఛను ఇస్తూ ధైర్యాన్ని నింపి బతుకుదారిని చూపాడు.
పండుటాకు రాలిపోతుంటే పచ్చటాకు పకపక నవ్వుతుందట. కొన్నాళ్లకు ఆ పచ్చటాకూ పండుటాకులా మారాల్సిందే కదా. మనిషికి వృద్ధాప్యం శాపం కాకూడదు. వారి అనుభవాలే రాబోయే తరానికి జీవిత పాఠాలు. కానీ వేగవంతమైన ఈ జీవితంలో పిల్లలు తల్లిదండ్రులను చూసుకోవడం లేదు. తమకు వృద్ధాప్యం శాపంలా మారిందనుకున్న వృద్ధులకు కేసీఆర్ పెద్దకొడుకులా ముందుండి వారు ఆత్మగౌరవంతో ముందుకునడిచేలా పింఛన్తో ఆసరా ఇస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 12,27, 824 మంది వృద్ధులు పింఛన్ అందుకోవడం అభినందనీయం.
2014 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పింఛన్లను 200 నుంచి 1000, వికలాంగులకు రూ.500 నుంచి రూ.1500లకు పెంచి 2016-17 బడ్జెట్లో ఆసరా పింఛన్లకు 4,693 కోట్ల 2017-18 బడ్జెట్లో 5,330 కోట్లు కేటాయించారు. రెండవ సారి 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధులు, వితంతువుల పింఛన్లను 1,000 నుంచి 2,016, వికలాంగులకు రూ.1,500 నుంచి 3,016లకు పెంచారు. ఈ పథకం కోసం 2019-20లో 9,402 కోట్లు, 2020-21 బడ్జెట్లో 11,758 కోట్లు కేటాయించారు. 2020, మార్చి 8 నాడు రాష్ట్ర బడ్జెట్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే పింఛన్ అర్హత వయసును 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గించడంతో ఈ పథకంలో లబ్ధిదారుల సంఖ్య దాదాపు 46 లక్షలకు చేరింది.
46 లక్షల ఇళ్ళల్లో దీపం పెట్టి ‘హర్ ఘర్ తిరంగా’తో పాటు ఘర్ ఘర్కు పింఛన్ అందిస్తున్నది. ఒక్క ఆసరా పథకమే కాదు, నేతన్నకు బీమా, గొర్రెల పంపిణీ, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, కంటి వెలుగు, అమ్మఒడి, కేసీఆర్ కిట్, ఆరోగ్యలక్ష్మి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు, చేనేత లక్ష్మీ… ఇలా ఏదో ఒక పథక రూపంలో ఇంటింటి గడపను తడుతూ ఇంట్లో దీపం పెట్టి ‘హర్ ఘర్ తిరంగా’తో పాటు ‘ఘర్ ఘర్కు సంక్షే మ ఫలాల’ను పంచుతున్న తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం.
-పెద్దింటి అశోక్కుమార్
94416 72428