పార్లమెంట్లో ఏదైనా విషయంపై మాట్లాడేముందు తగిన హోంవర్క్ చేయాలని రాహుల్గాంధీకి బీజేపీ సీనియర్ నేత, ఎంపీ రవిశంకర్ ప్రసాద్ సూచించారు. ఆ మాట రాహుల్గాంధీ ఒక్కరికే కాదు ప్రధాని మోదీకి కూడా వర్తిస్తుందనే విషయం మరిచిపోయినట్టున్నారు రవిశంకర్ ప్రసాద్. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ కాంగ్రెస్ హయాంలో అప్రజాస్వామిక చర్యలను ఎండగడుతూ, ఆంధ్రప్రదేశ్ సీఎం ఎన్టీఆర్ చికిత్స కోసం విదేశాలకు వెళ్తే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, అప్పుడు ఎన్టీఆర్ను గద్దె దింపి సీఎం పదవిలో కూర్చొబెట్టిన నాదెండ్ల భాస్కర్రావు ప్రస్తుతం బీజేపీలో ఉన్నారన్న విషయం పాపం ప్రధాని మోదీకి గుర్తు లేనట్టున్నది. అందుకే రవిశంకర్ ప్రసాద్ చెప్పినట్టు సభలో మాట్లాడటానికి ముందు ఎవరైనా హోంవర్క్ చేస్తే బాగుంటుంది!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేవలం ఉత్సవ విగ్రహమేనా? అవునంటున్నారు ఆ పార్టీ నేతలు. తాజాగా ‘బండి సంజయ్ ఎవడ్రా?’ అని మాజీ మంత్రి, బీజేపీ నేత బాబుమోహన్ చేసిన వ్యాఖ్యలు వైరలైన విషయం తెలిసిందే. ఆయన ఏ స్థితిలో ఉండి అలా మాట్లాడారో కానీ.. పార్టీలో బండి సంజయ్ స్థానానికి అద్దం పడుతుందని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ఎమ్మెల్యేలకు ఎర ఉదంతంలోనూ తాము జరిపే డీల్ బండికి తెలియదని, తమ ఆపరేషన్ అంతా ఢిల్లీ నుంచే జరుగుతున్నట్టు స్వాముల ముసుగులో ఉన్న పరివార్ నేతలు రామచంద్ర భారతి, సింహజీలు చెప్పారు. దీన్నిబట్టి అటు అధిష్టానం దృష్టిలో, ఇటు క్యాడర్ దృష్టిలో బండి పాత్ర నామమాత్రమేనన్నది ఈ ఉదంతాలు చెప్పకనే చెప్తున్నాయి.
రేవంత్రెడ్డి చేసేది పాదయాత్ర కాదని, అది సగం కారు యాత్ర, సగం బస్సు యా త్ర అని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యా ఖ్యానించారు. రేవంత్ జనం ఉన్నచోట పాదయాత్ర, జనం లేనిచోట కారు యాత్ర చేస్తున్నారని చురకలంటించారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసిన తర్వాత తాను రేవంత్లా సగం సగం యాత్ర కాకుండా రాష్ట్రవ్యాప్తంగా బైక్ యాత్ర చేపట్టబోతున్నట్టు వెంకట్రెడ్డి ప్రకటించారు. తన యాత్రలో కేసీఆర్ను విమర్శించడం కంటే… తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో అదే చెప్తానని.. ‘ప్రగతిభవన్ను కూల్చేస్తామ’ని రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా తిప్పికొట్టారు.
– వెల్జాల