తెలంగాణ కోకిల గానం ఆగింది. కాళేశ్వరం పాట మూగబోయింది. ఎంతో భవిష్యత్తు ఉన్న చెట్టంత బిడ్డమీద కాల శివుని కరుణ మాయమైంది. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడు రక్త బంధాలను దూరం చేస్తూ మన ఉద్యమ పేగుబంధాన్ని అకాలంగా, అకారణంగా తెంచి వేసిండు. సాయిచంద్ మరి లేడంటే నమ్మబుద్ధి కావట్లేదు.
తెలంగాణ మట్టి బిడ్డడు, ప్రజా గాయకుడు, కవి, వాగ్గే య కారుడు,రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ఆకస్మిక మరణం మనందరి నీ తీవ్రంగా కలచివేస్తున్నది. తెలంగాణ ఉద్యమంలో తమ్ముడు సా యిచంద్ పాట గొప్ప ప్రేరణ. రాష్ట్ర సాధన దిశ గా ప్రజలను ఉర్రూతలూగించిన గాత్రమది. నివురుగప్పిన ఉద్యమంలోంచి నిప్పుకణికల మిణుగురులను తన పాట ద్వారా వెదజల్లిన ఉద్యమ జ్వలిత గానం సాయి. ఉద్యమ శతృవును మట్టి కరిపిస్తూ, ఉద్యమ శక్తులకు పాటల తూటాలను అందించిన ఉడుకు నెత్తుటి సాంస్కృతిక సైనికుడు సాయి.
నాటి తెలంగాణ ఉద్యమంలో పాటతో ఉర్రూతలూపిన చైతన్య స్ఫూర్తిని, స్వయంపాలనలో కూడా కొనసాగించిన ప్రజా ఆకాంక్షల దీప్తి సాయి. ప్రగతి పాటల మాంత్రికుడు సాయి. ఏమాత్రం పదును తగ్గని ఉద్యమ భావోద్వేగం. అదే సోయి. అదే తాత్వికత జ్జానంతో సాగుతున్న పాట. నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్ పోరాటాన్ని నేటి పాలకుడుగా వారి ప్రగతి పోరాటాన్ని సామాన్యుల చెంతకు చేర్చిన ద్రష్ట సాయిచంద్.
సాయిచంద్ ఆట పాట లేకుండా ముఖ్యమంత్రి సభ లేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నిగంటలయినా అలసిపోకుండా తన గాన ప్రవాహంతో జనసందోహాన్ని మంత్రముగ్ధులను చేస్తూ ముందుకు సాగేది సాయి పాట. పాటలోని ప్రాసంగికతను దాని పరమార్థాన్ని అర్థం చేయిస్తూ సాగే గాత్ర కచేరి సాయిచంద్ ధూం ధాం. సీఎం కేసీఆర్ ఎందుకు గొప్పోడో, వారి పాలన ఎందుకు గొప్పదో, దానిలోని లోతు ఏందో ప్రజలకు వివరిస్తూ తన మాట పాట సాగుతుంటే… సభలో ఆ కొస నుంచీ ఈ కొస దాకా చప్పట్లతో మారుమోగేది. ఎంత పెద్ద సభయినా.. ఎన్ని లక్షల మందినైనా తన పాటకు ప్రజలను ట్యూన్ చేసిన ఘనత సాయిచంద్ కే దక్కుతుంది. ప్రసంగంతో కూడిన పాట..పాటతో కూడిన ప్రసంగం జుగల్బందీగా సాగేది.
రాష్ట్ర సాధన కోసం తన తోటి యువకుల తనువులను నిర్దాక్షిణ్యంగా తీసుకెళుతున్న ‘రాతి బొమ్మల్లోన కొలువైన’ కాల శివున్ని తన నిందాస్తుతితో నిలదీసిన కంచెర్ల రామదాసు మన సాయి. నాటి ఉద్యమ సారథి కేసీఆర్ హృదయా న్ని పాట ద్వారా ఆవిష్కరించిన సాయిచంద్, స్వయం పాలనకు గొంతుకయ్యిండు. ‘ఎవ్వరూ కానీ ముదిమి వయస్సులో పెద్దకొడుకై ఎటుగాని బతుకులకు ఆసరానందిస్తున్న కేసీఆర్ మనసుగల్ల సర్కారు మల్ల మల్ల రావాలనే’ ఆసరా జన హృదయ గానం సాయి. నాటి పాలనలో దగా పడ్డ రైతు బతుకులకు అందిన కేసీఆర్ రైతుబంధువును, కేసీఆర్ కలల పంట కాళేశ్వరాన్ని తన గాత్రం ద్వారా ప్రజల గుండెల్లో నిలిపిన అన్నమయ్య సాయిచంద్.
పాటంటే ప్రశ్నించే తూటానే కాదు ప్రవహించే ప్రగతి సెలయేరు అనే కొత్త అర్థాన్ని తెలంగాణ సమాజం ముందుంచిన గొప్ప గాన కోకిల సాయి. ఆరు దశాబ్దాల తండ్లాట త్యాగాల తర్వాత సాధించుకున్న తెలంగాణను నిలబెట్టుకోవాలంటే ఎంత కష్టం ఉన్నదో అంత కష్టాన్ని తన పాటల ద్వారా వినిపించిండు.
తాము కలలుగన్న అభివృద్ధి తమ కండ్లముందే కదలాడుతూ, తమ అనుభవంలోకి వస్తుంటే.. మాటల్లో చెప్పలేని ప్రజా భావోద్వేగాన్ని ఆనందాన్ని తన పాట ద్వారా తిరిగి ప్రజలకే వినిపించిన ప్రజా గాయకుడు సాయిచంద్. ప్రజా జీవితాలను గుణాత్మకంగా మారుస్తున్న కేసీఆర్ పాలనను తనదైన శైలిలో కైగట్టి అద్భుతమైన తన గాత్రంతో ఆలాపిస్తూ ప్రజలకు అభివృద్ధి గీతాలాపన చేసిన ప్రగతి పాటగాడు సాయిచంద్. బహుశా దేశ చరిత్రలో ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన ఒక గాయకుడు అదే స్ఫూర్తిని రగిలించే దిశగా ప్రజా పాలన గురించి పాట పాడి ప్రజల మనసులను గెలవడం ముందెన్నడూ లేదు.
సాయిచంద్ మరణం తెలంగాణ సమాజానికి కోలుకోలేని నష్టం. ప్రజా గాయకుడిగా, ప్రగతి గాయకుడిగా తెలంగాణ చరిత్రలో స్థిరస్థాయిగా వేద సాయిచంద్ పేరు నిలిచిపోనున్నది.
(అశ్రు నయనాలతో.. సాయిచంద్కు నివాళులు )