‘కోరికలు లేకపోతే మనిషి సుఖంగా జీవించగలుగుతాడు’ అని ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మికవాదులు పలుకుతూ ఉంటారు. ‘మా కోరికలు అసలు తీరడం లేదు’ అని చాలామంది వాపోతుంటారు. అయితే విశ్వరచన రహస్యం ఎవరికీ తెలియదు. ‘నిత్యోనిత్యానాం చేతనశ్చేతనానాం/ ఏకో బహూనాం యో విదధాతి కామాన్’ అని కఠోపనిషత్ వాక్యం. ‘నిత్యులలో పరమనిత్యుడు, చైతన్యవంతులలో పరమ చైతన్యుడు అయిన దేవదేవుడు ప్రతీ జీవి హృదయంలో పరమాత్ముడి రూపంలో కొలువై ఉండి అందరి కోరికలూ తీరుస్తున్నాడు’ అని పై శ్లోకానికి అర్థం.
కోరికలు కోరేవారు లెక్కలేనంత మంది ఉంటారు. కానీ, వారందరి కోరికలు ఉన్నవి ఉన్నట్లుగా, అనుకున్నది అనుకున్నట్లుగా తీర్చేది ఒక్క భగవంతుడు మాత్రమే! భక్తుల కోరికలు భగవానుడు పరమాత్ముని రూపంలో నెరవేరుస్తున్నాడని చెప్తూ ‘ఏకో బహూనాం యో విదధాతి కామాన్- ఒక్కడే ఎల్లరి కోరికలను తీరుస్తున్నాడు’ అని ఉపనిషత్ పలికింది. ‘ఒక్కడే అందరి కోరికలను తీరుస్తున్నాడు’ అన్నది స్పష్టమైన వాక్యం.
అంటే, మనిషి దుఃఖాన్ని పరిష్కరించే ఏర్పాటు ఈ జగత్తులో లేదు కానీ, మనిషికి ఉండే తీవ్రమైన అభిలాషను తీర్చే ఏర్పాటు మాత్రం ఉంది. మనిషి స్థిర నిశ్చయుడై ఉంటే, అది నెరవేరుతుందో లేదో అనే సంశయం లేకుండా ఉంటే అతని పాత్ర పూర్తయినట్లే! మిగతాదంతా జగత్ రచనలో ఉన్న ఏర్పాటుతో నెరవేరుతుంది. ‘రుక్మిణీ కల్యాణం’లో ఆమె పంపిన సందేశాన్ని గమనిస్తే ఈ విషయం చక్కగా తెలుస్తుంది. నిజానికి రుక్మిణీదేవి తన ప్రియుడైన శ్రీకృష్ణుడికి పంపిన సందేశం మనందరికీ అద్భుతమైన విషయాన్ని తెలియజేస్తుంది.
రుక్మిణీదేవి విదర్భరాజ తనయ. శ్రీకృష్ణుడు ద్వారకాధీశుడు. ఆమె కృష్ణుడిని చూడలేదు, కానీ అతని మహిమల గురించి విన్నది. అందుకే నల్లనయ్యే తన పతి అని భావించింది. కానీ, ఆమె మనోభావాలకు విరుద్ధంగా శిశుపాలుడితో వివాహం నిశ్చయమవుతుంది. కల్యాణానికి అన్ని ఏర్పాట్లూ జరిగిపోతాయి. రెండు రోజులు అయితే పెండ్లివాళ్లు తరలివస్తారు. అయినా రుక్మిణి ధైర్యాన్ని కోల్పోకుండా శ్రీకృష్ణుడికి ఒక బ్రాహ్మణుడి ద్వారా తన సందేశం పంపుతుంది. ‘ఓ అచ్యుతా! ప్రభూ! నిన్నే నేను పతిగా ఎంచుకున్నాను. నీకే ఆత్మ సమర్పణ చేశాను. అందుకే, వెంటనే వచ్చి నన్ను భార్యగా స్వీకరించవలసింది. నేను పుణ్యకార్యాలు, వ్రతాలు, దానధర్మాలు చేసినదాననే అయితే, నీవే నా పాణిగ్రహణం చేసెదవు గాక! ఒకవేళ ఏదైనా కారణం వల్ల నేను నీ అనుగ్రహాన్ని పొందలేకపోతే తీవ్రమైన తపస్సు ద్వారా శరీరాన్ని కృశింపజేసి ప్రాణాలు విడుస్తాను. తర్వాత వందలాది జన్మల ప్రయత్నం ద్వారా నిన్నే పతిగా పొందుతాను’ అని రుక్మిణీదేవి తన మనసులోని కోరికను కచ్చితంగా, స్పష్టంగా కృష్ణుడికి తెలియజేసింది. అంతేగాక, వంద జన్మలైనా సరే ప్రయత్నించి కృష్ణుడిని పతిగా పొందుతానని ఆమె పలికింది. తర్వాత కథ అందరికీ తెలిసిందే! శ్రీకృష్ణుడు కుండినపురానికి వచ్చి రాజులందరూ వీక్షిస్తుండగానే రుక్మిణిని అపహరించి తీసుకొని వెళ్లి, ద్వారకలో వివాహం చేసుకున్నాడు.
హృదయంలో లక్ష్యం, అభిలాష ఎంత స్పష్టంగా ఉండాలో, దాన్నే పొందాలని ఎంతగా పట్టుదలగా ఉండాలో రుక్మిణీదేవి సందేశం ద్వారా స్పష్టంగా తెలుస్తున్నది. అంత తీవ్రమైన అభిలాష ఇచ్ఛాశక్తి రూపంలో అభీష్టాన్ని నెరవేరుస్తుంది. దేవదేవుడైన శ్రీకృష్ణుడి ద్వారా పరమాత్ముని రూపంలో ఇది నెరవేరుతుందనే రహస్యం తెలిసినవారికి ఈ జగత్తులో చింతలే ఉండవు. సమస్త అభిలాషలూ నెరవేరి అంతా ఆనందమయం అవుతుంది.
– డా॥ వైష్ణవాంఘ్రి
సేవక దాస్
98219 14642