ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు మారుతుంటాయి. సైద్ధాంతిక నిబద్ధతను బట్టి దూరాలు పెరుగుతుంటాయి, తరుగుతుంటాయి. బీఎస్పీ నేతగా ఎదిగిన మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బీఆర్ఎస్లో చేరడం అలాంటిదే. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఆర్ఎస్పీకి పేదింటి పిల్లలను పెద్ద చదువుల వైపు అడుగులు వేయించిన మార్గదర్శకుడిగా పేరున్నది. నిబద్ధత గల అధికారిగా, అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతిని కోరుకునే ఆలోచనాపరునిగా ప్రవీణ్కు గుర్తింపు వచ్చింది. దళిత బహుజన సాధికారత దిశగా అడుగులు వేద్దామనే సదుద్దేశంతో ఆయన ఐపీఎస్కు రాజీనామా చేసి, రాష్ట్రంలో నిద్రాణంలో ఉన్న బీఎస్పీని బలోపేతం చేసే బృహత్కార్యాన్ని తలకెత్తుకున్నారు. ఆ కృషిలో కొంతమేర విజయం సాధించారు కూడా. ఎన్నికల బరిలోకి దిగుతూ పార్టీకి ప్రజల్లో మద్దతు కూడగట్టేందుకు నడుం బిగించారు. ఆయన వల్లే ఆ పార్టీకి అంతో ఇంతో గుర్తింపు వచ్చిందనేది వాస్తవం.
రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నారు ప్రవీణ్. దీనినొక ఉభయతారకమైన ఏర్పాటుగా భావించారంతా. రాజకీయ వర్గాల్లో ఈ పొత్తు ప్రముఖ చర్చాంశంగా ముందుకువచ్చింది. రెండు పార్టీల మధ్య సీట్ల కేటాయింపు ఖరారవుతున్నట్టు వార్తలు కూడా వెలువడ్డాయి. ఎన్నికల ఫలితాలపై ఈ పొత్తు ప్రభావం చాలానే ఉంటుందనే అంచనాల మధ్య అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొత్తులతోనే ఎక్కలేని ఎత్తులకు చేరుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ పొత్తును వ్యతిరేకించారనే వార్త అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తనకు రాజకీయపరమైన వ్యతిరేకత ఏదైనా ఉంటే పొత్తుకు ముందే ఆమె కాదని చెప్పి ఉండేవారు. అలా కాకుండా పొత్తు కుదిరిన తర్వాత వెనుకకు పోవడం వెనుక మతలబు ఏమిటో బయటికి చెప్పనప్పటికీ అది బహిరంగ రహస్యమే. ఆమెపై ఢిల్లీ స్థాయిలో ఒత్తిడి తేగలవారెవరో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు.
బీఆర్ఎస్తో పొత్తు విషయంలో వెనుకకు తగ్గడం ఆత్మహత్యాసదృశమని భావించిన ఆర్ఎస్పీ మిత్ర ధర్మానికి కట్టుబడి బీఆర్ఎస్లో చేరాలని తీర్మానించుకోవడం విశేషం. ఆయనతో పాటుగా దాదాపు యావత్తు బీఎస్పీ అనుచర, నాయక బలగం గులాబీ కండువా కప్పుకోవడం నేటి రాజకీయాల్లో కొత్త కదలిక. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రవీణ్ను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా కీలక బాధ్యతలు అప్పగిస్తానని చెప్పడం విశేషం. పొత్తును దెబ్బతీసేందుకు తెరవెనుక శక్తులు చేసిన కుట్రలు వీగిపోయాయి. వారి రహస్య ఎజెండాకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్ఎస్పీ రాకతో బీఆర్ఎస్ దళిత, బహుజన అనుకూల విధానాలకు కొండంత బలం చేకూరుతుందని చెప్పవచ్చు. తమ రాజకీయ ఎదుగుదలకు మోకాలడ్డిన శక్తులకు వచ్చే ఎన్నికల్లో దళిత, బహుజనవర్గాలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నాయి.