ఏ ప్రజాస్వామ్య దేశానికైనా ఎన్నికలే కీలకం. ఓటరు తీర్పు ఆధారంగానే ప్రభుత్వాలు కొలువుదీరి, అధికారాన్ని చెలాయిస్తాయి. దీనికి మన దేశం కూడా అతీతం కాదు. అయితే, మన దేశంలో ఇప్పటివరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికలు కుల, మత, వర్గ, ప్రాంతీయ, భాషల వంటి ప్రభావంతో జరిగాయి. భవిష్యత్తులోనూ వీటి ప్రభావం ఉంటుంది.
2014 నుంచి పై అంశాలతో పాటు దేశభక్తి, మతం పేరుతో ఓట్లు దండుకునే కార్యక్రమం ఎక్కువైంది. నిరక్షరాస్యత, పేదరికం వల్ల ఆయా అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ, ఆ ప్రభావానికి లోనై ఆయా పార్టీలకు ఓట్లు వేస్తూ, గద్దెనెక్కించడానికే సహాయ పడుతున్నారు. అదే సమయంలో మేధావులు, అక్షరాస్యులు, నగర, పట్టణవాసులు ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోకపోవడం (ఓటు వేయకుండా దూరంగా ఉండ టం) పరిపాటిగా మారింది. ఇకనైనా దేశ పౌరులందరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలవాలి. నీతిగా, నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకోవడం సమంజసం. తమకు, భవిష్యత్తరాల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పనిచేసే పార్టీలకు అండగా నిలవాలి. రాజ్యాంగ ఆశయాలకు అనుగుణంగా పనిచేసే పార్టీల వెంటే నడవాలి.
ఇదిలా ఉంటే.. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకమైనవి. భారత భవిష్యత్ను నిర్దేశించే ఎన్నికలు ఇవి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్ అత్యధిక యువత కలిగిన దేశం కూడా. 2024 ఎన్నికల్లో అదనంగా 5 శాతం యువ ఓటర్లు కలవబోతున్నారు. ఈ యువ ఓటర్లే కీలకం అని అన్ని రాజకీయ పార్టీలు గ్రహించాలి. కాబట్టి యువత ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకొని, అన్ని రాజకీయపార్టీలు తమ మ్యానిఫెస్టోను సిద్ధం చేసుకోవాలి. ఇప్పటికే దేశంలో నిరుద్యోగం రోజురోజుకు పెరుగుతున్నది. ధరలు మండిపోతున్నాయి. ప్రైవేటీకరణ, ద్రవ్యోల్బణం, ఆర్థికమాంద్యం, లే ఔట్లు దేశం అంతా విస్తరించి ఉన్న ప్రస్తుత తరుణంలో రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోను యువతకు విద్య, నైపుణ్యాలు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేవిధంగా ఉండాలి. అదే సమయంలో కొత్త పింఛన్ విధానం రద్దుచేసే విధంగా ప్రణాళికలు ప్రకటించాలి. రైతులకు, వ్యవసాయానికి భరోసా కల్పించాలి. పారిశ్రామిక అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి. ప్రజల మధ్య చిచ్చుపెట్టే కుల, మత ప్రాంతీయ భాష, లింగ ఆధారంగా ఓట్లు దండుకునే పథకాలకు స్వస్తి పలకాలి. కర్ణాటక ఎన్నికల క్యాంపెయిన్లో ప్రధాన జాతీయపార్టీలు, ముఖ్యంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న పాలకులు ఎంత దిగజారి మతపరమైన అంశాలను తలకెత్తుకొని ప్రచారం చేశారో మనందరం చూశాం.
ఓ పక్క మణిపూర్లో అంతర్గత హింసలో కొంతమంది ప్రజలు మరణించినా, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసమైనా, సుమారు 1300 మంది నిరాశ్రయులైనా, ఏమీ పట్టనట్టు కేంద్ర ప్రధాన పాలకులు అంతా ఒక రాష్ట్రం (కర్ణాటక)లో ఓట్లు దండుకునే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. చివరికి ‘ది కేరళ స్టోరీ’, గతంలో ‘కశ్మీర్ ఫైల్స్’ వంటి సినిమాలతో భావోద్వేగాలకు గురిచేస్తూ ఓట్లు దండుకునే కార్యక్రమం జరుగుతున్నది. దేశాన్ని మతం మత్తులో ఊగిపోయేవిధంగా చేస్తూ గద్దెనెక్కుతున్నారు.
మన దేశం లౌకిక రాజ్యం అని, భిన్నత్వంలో ఏకత్వం అనే విషయాన్ని మరిచిపోయారు. పౌ ర సమాజం ఇక్కడే, ఇటువంటి సందర్భంలో అప్రమత్తంగా ఉండాలి. వాస్తవాలను విశ్లేషణ చేయాలి. మంచి వివేకంతో భవిష్యత్తు భారత్ను నిర్మించాలి. ఈ ప్రక్రియలో చదువుకున్న యువ త కీలక పాత్ర పోషించాలి. నూతన యువ ఓటర్లే భవ్య భారతికి దిశానిర్దేశం చేయాలి. పెద్ద ఆర్థికవ్యవస్థగా భారత్ నిలవాలన్నా, రాజ్యాంగ ఆశయాలు సాధించాలన్నా పౌరులందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. యువ ఓట ర్లే కీలక పాత్ర పోషించాలి.
-ఐ.ప్రసాదరావు
63056 82733