తెలంగాణలో ప్రస్తుతం ఆసక్తికర రాజకీయం నడుస్తున్నది. అధికార సంస్థలను దుర్వినియోగం చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతూ ‘రివెంజ్ పాలిటిక్స్’కు పాల్పడుతున్నది. ఇవి ఇప్పటికే దేశవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. తాజాగా తెలంగాణకూ చేరుకున్నాయి. కానీ, ఆ రివెంజ్ రాజకీయాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘రివర్స్ పంచ్’ ఇచ్చారు. బీజేపీని ఎదుర్కోవాలంటే ఎదురుతిరగడం ఒక్కటే మార్గమని సీఎం కేసీఆర్ నిరూపించారు. తత్ఫలితంగా బీజేపీ కుడితిలో పడ్డ ఎలుక వలె విలవిలలాడుతున్నది.
ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడమే బీజేపీ లక్ష్యం. అందుకోసం కేంద్రంలో ఉన్న అధికార యంత్రాంగా న్ని శాయశక్తులా వినియోగించుకుంటున్నది. వారిద్వారా ప్రత్యర్థులను ఈడీ, ఐటీ, ఎన్ఐఏ, సీబీఐ దాడుల పేర భయభ్రాంతులకు గురిచేస్తున్నది. బీజేపీ చేస్తున్న ఈ తతంగం వెనుక తమ పార్టీలో ప్రత్యర్థులను చేర్చుకోవడమే. వారు వినకుంటే జైలుకు పంపడమే బీజేపీ అస్త్రం. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 115 మందికి పైగా ప్రతిపక్ష నాయకులపై సీబీఐ కేసులు నమోదు చేసింది. 120 మందికి పైగా ఈడీ కేసులు పెట్టి దర్యాప్తు చేస్తున్నది. ఇందులోనూ 115 మంది ప్రతిపక్ష నేతలే. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ‘ఆప్’ కీలక నాయకులు సత్యేంద్ర జైన్, మనీశ్ సిసోడియా, జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్, శివసేన కీలక నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సోదరుడు అగ్రసేన్ గెహ్లాట్ వంటి నేతలను తీవ్రమైన ఇబ్బందులకు గురిచేసింది. కర్ణాటకలో కాంగ్రెస్ జేడీయూ కీలక నేతల ఇండ్లపై ఐటీ దాడులు నిర్వహించింది. మరోవైపు బీజేపీ విధానాలను తీవ్రంగా విమర్శించే దాదాపు 20 మంది మేధావులు, ప్రొఫెసర్లు, పౌరహక్కుల నేతలను ఎన్ఐఏ అరెస్టు చేసి జైళ్లకు పంపించింది. ఇంకా వ్యవసాయ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన రైతుసంఘాల నేతలకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటూ ఎన్ఐఏ చేత టార్గెట్ చేయించింది. అయితే వేధించడమే తప్ప ఈడీ నమోదు చేస్తున్న కేసుల్లో ముద్దాయిలకు శిక్ష పడటం మూడు శాతం కన్నా తక్కువగా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. కేంద్రం ప్రతీకార రాజకీయాలను ప్రోత్సహిస్తున్నదని ఛత్తీస్గఢ్, జార్ఖండ్, కేరళ, మిజోరం, పంజాబ్, రాజస్థాన్, బెంగాల్, మేఘాలయ, తెలంగాణ రాష్ర్టాలు ఇప్పటికే సీబీఐకి సాధారణ అనుమతిని రద్దుచేశాయి.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, టీఎంసీ నేత సువేందు అధికారి, టీడీపీకి చెందిన సుజనాచౌదరి, సీఎం రమేశ్ వంటి ఎందరో నేతలు గతంలో సీబీఐ, ఐటీ, ఎన్ఐఏ వంటి కేసులతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. కానీ, ఈ నాయకులంతా బీజేపీలో చేరగానే ఆ కేసులన్నీ మాయమవ్వడం విడ్డూరం.
మీడియాను గుప్పిట ఉంచుకోవడానికి బీజేపీ ఆ సంస్థలపైనా సీబీఐ, ఈడీ, ఐటీలతోపాటు స్థానిక పోలీసులను ఉసిగొల్పుతున్నది. ఎన్డీటీవీని టార్గెట్ చేసి ఆ సంస్థ యజమానులపై కేసులు నమోదు చేసింది. బీజేపీకి వ్యతిరేకంగా కథనాలు రాసినందుకు ‘ది వైర్’ న్యూస్ వెబ్సైట్ సంపాదకులు కె.వేణు, జాహ్నవి, వ్యవస్థాపకుడైన సిద్ధార్థ వరదరాజన్ ఇండ్లల్లో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులచే సోదాలు నిర్వహించింది. అంతేకాకుండా డిజిటల్ మీడియాను తన నియంత్రణలో ఉంచుకునేందుకు బిల్లులను తీసుకువస్తున్నది. అంతర్జాతీయంగా పత్రికా స్వేచ్ఛ సూచీని పరిశీలిస్తే 180 దేశాల్లో భారత స్థానం 150. 2021లో ఇది 142గా ఉన్నది. 2016లో 133గా ఉన్నది.
బీజేపీ చేయిస్తున్న ఈ దాడులను పలు రాష్ర్టాల్లోని ప్రభు త్వాలు అడ్డుకుంటున్నాయి. అయితే కాంగ్రెస్ మినహా ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు కావడం గమనార్హం. పశ్చిమబెంగాల్లో బీజేపీకి ఎదురుతిరిగిన మమతా బెనర్జీ విజయం సాధించారనే చెప్పవచ్చు. ఇప్పుడు బీజేపీపై టీఆర్ఎస్ కూడా తిరగబడుతున్నది. టీఆర్ఎస్ మంత్రులు, కీలక నేతలే లక్ష్యంగా కేంద్రం ఈడీ, ఐటీ దాడులను ప్రయోగిస్తున్నది. బీజేపీ దాడులకు పోటీగా, తెలంగాణ ప్రభుత్వం ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని ముందుకుతీసుకువచ్చింది. సిట్ ఏర్పాటుచేసి బీజే పీ నాయకులు, సన్నిహితులకు నోటీసులు జారీచేస్తున్నది. బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ వంటివారికి సిట్ అధికార బృందం నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా ఆర్ఎస్ఎస్ కీలకనేతలను సైతం విచారించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీని కి పోటీగా బీజేపీ సెంట్రల్ జీఎస్టీని టీఆర్ఎస్ నాయకులపై ప్రయోగిస్తున్నది. అయితే కేంద్రంతో పోరాడాలంటే చాలా ధైర్యం కావాలి. ఆ ధైర్యాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిస్తున్నారు.
ఛత్తీస్గఢ్, రాజస్థాన్ వంటి రాష్ర్టాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. అయితే కేసీఆర్ చూపిస్తున్నటువంటి ఈ ధైర్యాన్ని కాంగ్రెస్ నేతలు చూపించలేకపోతున్నది. రాష్ట్ర అధికార వ్యవస్థలన్నీ వారి చేతుల్లోనే ఉన్నా.. సరైన మార్గం లో వినియోగించుకోలేకపోతున్నది. దీన్ని అలుసుగా తీసుకొ ని కేంద్ర సంస్థలన్నీ కాంగ్రెస్ నాయకులను టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నాయి. అయితే బీజేపీ నేతలను టార్గెట్ చేస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోననే భయం కాం గ్రెస్లో ఉండవచ్చు. లేక వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని అధిష్ఠానం సూచనలు చేసి ఉండి ఉండవచ్చు. ఏదైతేనేమి ప్రస్తుత ఆర్ఎస్ఎస్-బీజేపీని ఎదుర్కోవాలంటే ‘పన్నుకు పన్ను.. కన్నుకు కన్ను’ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ అవలంబించాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రతిపక్షాలకు చెందిన నాయకులు బీజేపీలో చేరగానే పునీతులవుతున్నారు. ఇక్కడ కేసీఆర్ చెప్పిన ‘వాషింగ్ పౌడర్ నిర్మా’ హాస్యం గుర్తుకువస్తున్నది. పార్టీ మారిన నాయకులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలు ఎలాంటి దాడులు చేయడం లేదు. మధ్యప్రదేశ్కు చెందిన జ్యోతిరాధిత్య సింధియాపై భూ ఆక్రమణ కేసులున్నాయి. ఆయన బీజేపీలో చేరగానే ఆ కేసు కనుమరుగవ్వడం కొసమెరుపు.
(వ్యాసకర్త: సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్)
ఫిరోజ్ఖాన్
9640466464