ఒక మనిషి భావ సంస్కారం ఏమిటనేది అతని భాషతోనే తెలుస్తుంది. వ్యక్తిత్వం అతని ప్రవర్తన వల్ల తెలుస్తుంది. ముఖ్యంగా వేల మందికి ఆదర్శంగా ఉండి, వారిని సరైన మార్గంలో నడిపించేవారు తమ భాష, ప్రవర్తన గురించి ఇంకా శ్రద్ధ తీసుకోవాలి. ఎదుటివారు చులకన చేసేటట్టు ఉండకూడదు. ప్రజాకవి కాళోజీ ఎవరింటికైనా వెళ్లినప్పుడు ‘మా పని మనిషి’ అని పరిచయం చేస్తే, ‘మరి మీరు పనికిరాని మనిషా’ అని అనేవారు. అదీ సంస్కారం.
Telangana | తెలంగాణలో ప్రస్తుతం పాలన సాగిస్తున్న కాంగ్రెస్ నాయకుల తీరుతో సంస్కారం, భాష, ప్రవర్తన, మాటతీరు తదితర అంశాలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కువగా చర్చనీయాంశమవుతున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందు నుంచే అనధికారిక ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి అన్నీ తానై నడిపించారు. ఇక పదవీ బాధ్యతలు చేపట్టాక చెప్పాల్సిన పనేలేదు. ఇతర నేతలకు క్రెడిట్ దక్కకూడదనే ఉద్దేశంతో ఆరు గ్యారెంటీలకు సంబంధించి ఏ హామీని, ఎప్పుడు అమలు చేస్తారనే వివరాలను స్వయంగా ఆయనే ప్రకటించారు. ఎన్నికలకు ముందే తేదీలతో సహా ప్రకటించి, డిసెంబర్ 9 నుంచి ఇస్తామన్న సంక్షేమ పథకాలను అమలు చేయడం సాధ్యం కాదని తెలుసుకొని మొదటగా అసహనానికి గురైంది ఆయనే. మాజీ ముఖ్యమంత్రిని, వారి కుటుంబ సభ్యులను, తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న రైతులను అసభ్య పదజాలంతో దూషించటం మొదలుపెట్టారు. తన స్థాయిని మరిచి అభ్యంతరకర రీతిలో మాట్లాడుతున్న రేవంత్రెడ్డి తీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుండటాన్ని గ్రహించిన మంత్రులు ఆయనతో స్వరం కలిపారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలే కావడంతో సీఎంపై వ్యతిరేకత రావడం పార్టీకి మంచిది కాదని, ముఖ్యమంత్రిని ప్రజలు తిట్టకూడదని భావించిన పలువురు సీనియర్ మంత్రులు ప్రజలను దూషించడం మొదలుపెట్టారు. రైతుబంధు సాయం అందలేదని చెప్పినవారిని ‘చెప్పుతో కొడతాం’, ‘రోడ్డు మీద ఉరికిస్తాం’ అంటూ దుర్భాషలాడటం ప్రారంభించారు. అధికారిక సమావేశాలకు హాజరయ్యే విపక్ష నాయకులను అవమానించటం, అసహనంతో సొంత పార్టీ కార్యకర్తలనే కొట్టడం వంటి తెలివి తక్కువ, అహంకారపూరిత పనులు చేస్తూ ముఖ్యమంత్రిని మించిపోయారు. మెరుగైన పాలన ఆశించి, అభిమానంతో ఓటేసిన తెలంగాణ ప్రజలు వారికి సన్నాసుల్లాగా, ఏమీ చేతకాని వాళ్లలాగా కనిపించటం చాలా విచిత్రంగా ఉన్నది.
ఇక రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలా ఉంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల వైఖరి, ప్రవర్తన ఇంకా విచిత్రంగా ఉన్నది. ఇరు పార్టీలకూ అధికారదాహమే తప్ప, ఏ రకమైన సిద్ధాంతాలు లేవన్నది స్పష్టమైపోయింది. అందుకు కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. తెలంగాణకు ప్రతీకగా నిలిచే స్థానిక పార్టీ బీఆర్ఎస్ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతాయి. ఏపీలో బీజేపీ అధికార వైఎస్ఆర్సీపీని కొన్నిసార్లు దువ్వుతుంది. మళ్లీ అవసరం పడుతుందేమోనని టీడీపీని కూడా దువ్వుతుంది. అంతేకాదు, తెలంగాణలో బీఆర్ఎస్ను ఎదుర్కోవడానికి మోదీని బండబూతులు తిట్టిన చంద్రబాబును స్కాంల నుంచి రక్షించడానికి కూడా బీజేపీ వెనుకాడదు. ఏపీలో టీడీపీతో కలిసి పనిచేస్తున్న జనసేన తెలంగాణలో బీజేపీతో కలుస్తుంది. ఇక విజయశాంతి, జయసుధ లాంటివాళ్లు ఏ రోజు, ఏ పార్టీలో ఉంటారో తెలుసుకోవాలంటే ఆ రోజు పేపర్ చూడాల్సిందే!
రెండు జాతీయ పార్టీల నాయకులాడే రాజకీయ నాటకాలను ప్రజలు ఆపలేరు. వారికి ఉన్న ఒకే ఒక్క అవకాశం ఎన్నికల్లో సరైన పార్టీని ఎన్నుకోవడమే. గత అనుభవాలు, పార్టీల వైఖరి, ఆ పార్టీల పాలనాస్థాయి, వారు తమ రాష్ట్రం పట్ల వ్యవహరిస్తున్న తీరు.. ఇవన్నీ బేరీజు వేసుకొని ప్రజలు తమ ఓటును వినియోగించుకోవాలి. ఇప్పటిలాగా ఎన్నికల తర్వాత బాధపడే పరిస్థితి తెచ్చుకోకూడదు.
తెలంగాణ శాసనసభ ఎన్నికలు ముగిశాయి. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. న్యాయపరంగా మనకు దక్కాల్సిన నిధుల కోసం కూడా కేంద్రంతో పోరాడాల్సి వస్తున్నది. అందుకోసం ఈ ప్రాంతం మీద అభిమానం, ఈ ప్రాంతం పట్ల నిబద్ధత ఉన్న సభ్యులు తప్పనిసరిగా పార్లమెంట్లో ఉండాలి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తెలంగాణపై అంతులేని వివక్ష చూపిస్తున్నది. దాన్ని ధైర్యంగా ఎదుర్కొంటూ పదేండ్ల పాటు కేసీఆర్ రాష్ర్టాన్ని కాపాడారు. అంతేకాకుండా నిధులు సమకూర్చుకొని అన్ని రంగాలను అభివృద్ధి చేశారు. తెలంగాణ రాష్ర్టాన్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. కానీ, కాంగ్రెస్ నాయకుల అసత్యాలను నమ్మిన ప్రజలు, వారిచ్చిన బూటకపు వాగ్దానాల భ్రమలో పడి ఆ పార్టీని ఎన్నుకున్నారు. నమ్మిన ప్రజలను ముంచడంలో సిద్ధహస్తులైన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీద అరుపులు అరుస్తున్నారు. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేందుకు దారులు వెదుకుతున్నారు.
ఒక్క విషయం ఆలోచిద్దాం! 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు రాష్ట్ర ఖజానా నిండా ధనం మూలుగుతున్నదా? అభివృద్ధితో రాష్ట్రం వెలిగిపోతున్నదా? డిస్కంలను ఆంధ్రాలో పెట్టుకొని లోయర్ సీలేరు ప్రాజెక్టుతో సహా ఏడు మండలాలు ఆంధ్రా పాలకులు లాక్కున్నారు. అంతేకాకుండా వారేదో అంతకుముందు తెలంగాణలో బ్రహ్మాండమైన వసతులను కల్పించినట్టు ‘తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, నీళ్లుండవు’ అని బెదిరించారు.
కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే కాంగ్రెస్, టీడీపీ నాయకులు శాసనసభలోకి ఎండిపోయిన వరికంకులను తీసుకొచ్చి గందరగోళం సృష్టించారు. పాలనాకాలం 40 రోజులా? 50 రోజులా? అన్నది లెక్కకాదు, నాయకుని ప్రణాళికలు ఎలా ఉన్నాయి, పాలకుల ప్రవర్తనలో ఎంత నిబద్ధత ఉందనేదే లెక్క. వాస్తవానికి ప్రగతిభవన్ ముందు కాంగ్రెస్ కూలగొట్టిన కంచెలు ఆ పార్టీ నిర్మించినవే. అక్కడి భద్రతా సిబ్బంది రోజంతా ఎండలో నిలబడుతున్నారని, వారికోసం కేసీఆర్ ఒక షెడ్డు నిర్మించారు. ఆ కంచెలు వేసినవారు గొప్పా? కిందిస్థాయి ఉద్యోగులకు ఎండ తగలకుండా వసతి కల్పించినవారు గొప్పా? అటువంటి పనులే పాలకుడి పాలనా దక్షతకు నిదర్శనంగా నిలుస్తాయి.
ఇక గత తొమ్మిదేండ్లలో పుట్టబోయే బిడ్డ దగ్గర్నుంచి చనిపోయిన వారి దాకా అందరికీ ఉపయోగపడేలా కేసీఆర్ కల్పించిన వసతులు మన కండ్లముందే ఉన్నాయి. అందుకే, తమ నాయకుడు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు తమనే మళ్లీ ఎన్నుకుంటారని బీఆర్ఎస్ నేతలు భ్రమపడ్డారు. నిజానికి తమ పార్టీకే ఓటు వేయాలని కేసీఆర్ ఎప్పుడూ చెప్పరు. ప్రతి ఓటరు ఆలోచనాస్థాయి పెరగాలని, ప్రజాస్వామ్యం గెలవాలని ఆయన ఆశిస్తారు. పనిని చూసి, అభివృద్ధిని గమనించి, పార్టీల విధానాలను విశ్లేషించుకొని తెలివిగా ఓట్లేస్తేనే ప్రజలు గెలుస్తారని ఆయన పదేపదే చెప్తుంటారు. కానీ, జరిగిపోయినదాన్ని ఎవరూ మార్చలేరు. గడిచిపోయిన కాలం తిరిగిరాదు. అది నేర్పే అనుభవాలే మన భవిష్యత్తు బాగుండటానికి బాటలు వేస్తాయి.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలు. తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ చూపిస్తున్న ద్వేషం, ప్రజల పట్ల చూపుతున్న వివక్ష అందరికీ తెలిసిందే. అంతేకాకుండా దేశ సంపదను గుజరాతీ వ్యాపారులకు మోదీ ప్రభుత్వం ఎలా దోచిపెడుతున్నదో గమనిస్తూనే ఉన్నాం. ఇతర మతాలను ద్వేషించే ఆ పార్టీకి, తెలంగాణ సహజ సంస్కారానికి పొసగదు. మనుషులంతా ఒక్కటేనన్న సనాతన ధర్మం పాటించే తెలంగాణ విశాల హృదయానికి మత మౌఢ్యం, కుల పిచ్చి అర్థం కావు. అందుకే బీజేపీకి ఓటేస్తే తెలంగాణ సంస్కృతి విచ్ఛిన్నమవుతుంది.
ఇక సోనియమ్మ రాష్ట్రం ఇచ్చిందని చెప్తూ పబ్బం గడుపుకొనే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో ఏనాడూ పాల్గొనలేదు. అందుకే ఇక్కడి ప్రజల బాధలు వారికి అర్థం కావు. అందుకే సొంత రాష్ట్ర ప్రజలనే వారు చెప్పులతో కొట్టగలరు, చంపి బొంద పెట్టగలరు. 44 ఏండ్లు ఈ ప్రాంతాన్ని పాలించి నిధులను అడ్డంగా దోచుకున్న ఆ పార్టీ వల్ల తెలంగాణకు నష్టమే కానీ, ఎటువంటి లాభం లేదు. ఇప్పుడు కూడా తెలంగాణ ఆదాయమంతా కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నది.
వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణ ప్రజలను మళ్లీ మభ్యపెట్టడానికి కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు రంగంలోకి దిగారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు ఏం చేస్తారంటే.. ఒకటి, రెండు సంక్షేమ పథకాలను అమలు చేసి, ఓట్లు దండుకోవడానికి ప్రయత్నిస్తారు. అది చూసి ఈసారి ప్రజలు మళ్లీ వారి భ్రమలో పడితే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఒక్క సంక్షేమ పథకం కూడా అందదు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. మరోసారి మోసపోకుండా ఇంటి పార్టీ అయిన బీఆర్ఎస్ను గెలిపించుకోవాలి. లేకపోతే, గత రెండు నెలలుగా అనుభవిస్తున్న సంక్షోభమే, మరో ఐదేండ్లు అనుభవించాలి. తస్మాత్ జాగ్రత్త!
-కనకదుర్గ దంటు
89772 43484