పరివార్ పాలిటిక్స్పై పదే పదే మాట్లాడటం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఒక అబద్ధాల ఆటవిడుపు. ఆగష్టు 15న ఏర్రకోట నుంచి జాతినుద్దేశించి ప్రసంగించినా, తన కార్యకర్తల సంకల్ప సమావేశాల్లో మాట్లాడిన, భారత ప్రజల అత్యంత గౌరవ ఆలయం పార్లమెంటులో మాట్లాడినా మోదీ పరివార్ పాలిటిక్స్, కుటుంబ పాలనపై కథలుగా చెప్పి ప్రజలను మోసం చేయడంలో భేతాళుడినే మించిపోయిండనటంలో సందేహం లేదు.
పరివార్ పాలిటిక్స్పై పదేండ్లుగా చెప్తూ.. దేశాభివృద్ధి గురించి ప్రజలు ఆలోచించకుండా చేయడంలో నరేంద్రమోదీ విజయవంతమయ్యాడనేది విశ్లేషకుల మాట. మరీ నిజంగా కుటుంబ పాలన, పరివార్ పాలిటిక్స్ పై ప్రధానికి చిత్తశుద్ధి ఉన్నదా? వాళ్ల పార్టీ బీజేపీలో వారసులకు అవకాశాలు ఇవ్వలేదా? అనే అంశాలపై అనే క ప్రశ్నలు ఉన్నాయి. వాటికి ఆధారపూరితమైన సాక్ష్యాలూ ఉన్నాయి.
వారసులకు రాజకీయ పదవులపై ప్రధాని పలుమార్లు చెప్పే మాటలు, నీతి సూత్రాలు అన్నీ అబద్ధాలేనని స్పష్టమవుతున్నది. అనేక రాష్ర్టాల్లో బీజేపీలో వారసులకే టికెట్లు ఇస్తున్నారు కదా? మోదీ సొంత మంత్రివర్గంలో రాజకీయ వారసులకు కూడా అవకాశాలు కల్పించారనేది బహిరంగమేకదా? ఇవన్నీ చెప్పకుండా కుటుంబ పాలన నే అభివృద్ధికి అడ్డమని చెప్పడం ఏ రాజనీతికి నిదర్శనం? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అదే పార్టీకి చెంది న రక్షణశాఖమంత్రి రాజ్నాథ్సింగ్ కొడుకు పంక జ్ సింగ్ బీజేపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. యూపీ మాజీ సీఎం కళ్యాణ్ సింగ్ వారసుడు రాజ్వీర్ సింగ్ ఎంపీ కాదా? రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీలను రాజకీయ వారసులుగా విమర్శిస్తారు కదా? మేనకాగాంధీ, వరుణ్ గాంధీలకు టికెట్లు ఇచ్చింది బీజేపీనే కదా? లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ కొడుకు ప్రతీక్ భూషణ్ బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నది వాస్తవమే కదా! దీనిమీద మోదీ ఎందుకు మాట్లాడరు? హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం ప్రేమ్కుమార్ ధుమాల్ కొడుకు అనురాగ్ ఠాకూర్ కేంద్రమంత్రిగా కొనసాగుతున్నాడు. అనురాగ్ ఠాకూర్ బీజేపీ వారసత్వ రాజకీయాలతోనే కేంద్రమంత్రి అయ్యాడనేది ప్రధానికి తెలియని విషయమా? ఒడిశాకు చెందిన దేవేంద్ర ప్రధాన్ వాజ్పేయ్ ప్రభుత్వంలో మంత్రి. ఆయన కుమారుడే ధర్మేం ద్ర ప్రధాన్, ఆయనే ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయనకు రాజ్యసభ సీటు ఇచ్చి కేంద్రమంత్రి పదవి ఇచ్చిం ది ఏవరు? ధర్మేంద్ర ప్రధాన్ పాలిటిక్స్లో ఎదిగింది వారసుడిగా కాదా? అనేది బీజేపీ ప్రశ్నించుకోవాలి.
బీహార్లో లాలూ ప్రసాద్ కుటుంబం మాత్ర మే వారసత్వ రాజకీయాలు చేస్తున్నట్టు ఎప్పుడూ ప్రధాని చెప్తుంటారు. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎవరు? ఆయన తండ్రి ఠాగూర్ ప్రసాద్ జనసంఘ్ ఫౌండర్ మెంబర్స్లో ఒకరు అనేది వాస్తవం కాదా? ఆ మూలాల వల్లనే రవిశంకర్ ప్రసాద్ కేంద్రమంత్రి అయ్యిండన్న విషయం ప్రజలకు తెలువకుండా ఎన్ని రోజులు మోసం చేస్తారు.
బీహార్కు చెందిన యశ్వంత్ సిన్హా కొడుకు జయేష్ సిన్హా జార్ఖండ్ నుంచి ఎంపీగా గెలిచి, ప్రధాని అనుగ్రహంతోనే కేంద్రసహాయమంత్రిగా పనిచేశాడని ఒప్పుకోవాలి. మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా రాజకీయ వారసుడనేది అందరికీ తెలిసిందే. ఆయన తండ్రి ఎమ్మెల్సీగా పనిచేశారు. మరో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బీజేపీనే కదా. ఆయన తండ్రి దేవ్ ప్రకాష్ గోయల్ వాజ్పేయ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశాడని చరిత్ర నే చెబుతుంది. తల్లి చంద్రకాంత గోయల్ మూ డుసార్లు బీజేపీ ఎమ్మెల్యేగా పనిచేసింది కూడా. మరి పీయూష్ గోయల్ రాజకీయ వారసుడు కాదని ప్రధాని ఒప్పుకుంటాడా?
రాజస్థాన్లో రెండుసార్లు బీజేపీ నుంచి సీఎం గా పనిచేసిన వసుంధరా రాజే సింధియా స్వ యంగా గ్వాలియర్ రాజ కుటుంబానికి చెంది న రాజకీయ వారసురాలని లోకమంతా తెలుసుకదా? ఆమె కొడుకు దుష్యత్ సింగ్ నాలుగుసార్లు బీజేపీ ఎంపీగా ఉన్నాడు. అదే రాజ కుటుంబానికి చెందిన జ్యోతిరాదిత్య సింధియాను పార్టీలో చేర్చుకొని కేంద్రమంత్రి పదవి ఇచ్చింది కూడా మోదీ అన్న విషయం ఈ తరం వాళ్లకు తెలిసిందే కదా? గుజరాత్ అమిత్ షా కొడుకు జయ్ షా 34 ఏండ్ల వయసులో బీసీసీఐ సెక్రటరీ స్థాయికి ఎట్లా ఎదిగారనే విషయంపై మోదీనే సమాధానం చెప్పాలి. అదే జయ్ షా ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎలా అయ్యారు? దాని వెనుక వారసత్వ రాజకీయాలు లేవా? మోదీ ఆశీస్సులతో అమిత్ షా కేంద్ర హోంమంత్రి అయితే.. ఆయన వారసత్వానికి కొనసాగింపుగానే జయ్షా బీసీసీఐ సెక్రటరీ అయ్యిండని అందరికీ తెలిసిందే.
మొన్నటిదాకా కర్ణాటక సీఎంగా ఉన్న బసవరాజ్ బొమ్మై వాళ్ల నాన్న ఎస్ఆర్ బొమ్మై కర్ణాటక సీఎంగా, కేంద్రమంత్రిగా పనిచేశారు. బొమ్మై ప్రధాని దృష్టిలో రాజకీయ వారసుడు కాదంటే ఎలా? యడియూరప్ప ఇద్దరు కొడుకుల్లో ఒకరు ఎమ్మెల్యే, ఇంకో కొడుకు ఎంపీ. వాళ్లవి వారసత్వ రాజకీయాలు కావని ప్రధాని మోదీ నిరూపించగలరా? అరుణాచల్ప్రదేశ్ మొట్టమొదటి ప్రొటెం స్పీకర్ రిచ్చిన్ కారర్ రిజిజు కొడుకు కిరణ్ రిజిజు కేంద్రమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా రాజకీ య వారసుడు కాదా? ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఎవరు? ఎన్టీఆర్ కూతురు కాదా? ఇదీ వారసత్వ రాజకీయం కాదా? చివరకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డీ శ్రీనివాస్ కొడుకు కాదా.. ఇదీ వారసత్వం కాదా? ఇలా అనేక అంశాల్లో బీజేపీలో వారసత్వ రాజకీయాలు స్పష్టంగా కనిపిస్తాయి.
దేశంలోని కుటుంబ పాలన గురించి చెప్పే మోదీ తన పార్టీలో ఉన్న కుటుంబ పాలనపై మా త్రం మాట్లాడడు. తొమ్మిదేండ్లలో ప్రధాని నరేంద్రమోదీ కుటుంబ రాజకీయాలపై తన పార్టీలో చర్యలు ఏమైనా తీసుకున్నారా ప్రజలకు సమాధానం చెప్పాలి. బీజేపీ ప్రధాన ప్రచార అస్ర్తాలు అవే అయినప్పుడు తన సొంత పార్టీలో కుటుంబ పాలన, వారసత్వ రాజకీయాలు, వారసులపై ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటే..ప్రజలు కూ డా హర్షిస్తారు. అట్లా కాకుండా రాజకీయాల కోసం తియ్యగా అబద్ధాలు చెప్పడం, యతిప్రాసల కోసం పరివార్ పాలిటిక్స్ గురించి అనర్గళంగా మాట్లాడటాన్ని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.