కాంగ్రెస్ పార్టీలో ఉదయపూర్ డిక్లరేషన్కు కాలం చెల్లింది. తాజాగా మల్కాజ్గిరి డిక్లరేషన్ అమలు జరుగుతోంది. తాజా డిక్లరేషన్ ప్రకారం ఫ్యామిలీ ప్యాక్ కింద తండ్రి-కొడుకు టికెట్ పొందే వెసులుబాటు లభించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ రాజకీయ వారసుల టికెట్ల కోసం దరఖాస్త్తు చేసుకున్నారు. అయితే ఎలక్షన్ స్క్రీనింగ్ కమిటీ మాత్రం ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక నాయకుడికి ఒకటే టికెట్ ఇస్తామని మిగతా వాటిని తిరస్కరించారు. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకటే టికెట్ ఇస్తారన్న విషయం తమకు కూడా తెలుసు కానీ మల్కాజ్గిరి డిక్లరేషన్ ప్రకారం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడికి టికెట్ ఇచ్చారు కదా? తమ పరివారానికి కూడా మల్కాజ్గిరి డిక్లరేషన్ ప్రకారం టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
బీజేపీ అసంతృప్తి నాయకుల బుజ్జగింపునకు పార్టీ బైలాలో లేని, కొత్త కొత్త పోస్టులను సృష్టించి కట్టబెట్టింది. ఈ కమిటీలను వేయడానికి కసరత్తు బాగానే చేసినట్టుందని పార్టీ నేతలు కితాబు ఇస్తున్నారు. విజయశాంతికి పోరాట కమిటీ చైర్మన్ పదవి ఇవ్వడం సముచిత నిర్ణయమని అంటున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా పార్టీకి వ్యతిరేకంగా విజయశాంతి గళం విప్పుతున్నారు. అయితే పదవులు పొందిన నేతలు ఎవరు కూడా సంతృప్తి చెందడం లేదు. దమ్మిడి ఆమ్దాని లేని ఈ పోస్టుల కంటే ‘ఎమ్మెల్యేలకు ఎర’ కమి టీ ఇచ్చి ఉంటే అంతో ఇంతో గిట్టుబాటు అయ్యేదని అంటున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డిని ‘పెద్దలు జానారెడ్డి’ అంటూ అందరూ గౌరవంగా సంబోధించేవారు. పార్టీలో ఇటీవల ఆయనకు పలుకుబడి తగ్గడంతో తన రాజకీయ వారసులుగా కుమారుల్ని రంగంలోకి దింపారు. అయితే ‘పెద్దలు జానారెడ్డి’ అనే బిరుదును కూడా లాగేసుకోవడం పట్ల ఆయన అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు తన ప్రసంగంలో ‘పెద్దలు రేవంత్రెడ్డి’ అని సంబోధిస్తున్నారు. పార్టీకి కొత్త అయినంత మాత్రాన జానారెడ్డికి ఉన్న బిరుదును రేవంత్రెడ్డికి తగిలించడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
కన్నతల్లికి తిండి పెట్టనోడు పినతల్లికి బంగారు గాజులు చేయిస్తానని అన్నాడంట ఒకడు. ఆ ఒకడో ఎందుకు తమ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉందని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు వాపోయారు. తమ రాష్ట్రంలో ప్రకటించిన ఐదు గ్యారంటీలకే దిక్కు లేదు…తెలంగాణలో ఆరు గ్యారంటీ పథకాలు ఎక్కడి నుంచి ఇస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే షడాక్షరి ఉన్నది ఉన్నట్టు కుండబద్ధలు కొట్టినట్టు ప్రశ్నించడం హాట్ టాఫిక్గా మారింది. ప్రత్యర్థులకు బలమైన అస్ర్తాన్ని అందించినట్టయింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.