వివాహమే జీవితాన మరపురాని మహోదయం అన్నాడు ఓ భావుకుడు. యుక్త వయస్కులు జీవితంలో స్థిరపడడానికి వివాహాన్ని మించిన సామాజిక ఏర్పాటు మరోటి లేదు. స్త్రీ, పురుషుల దాంపత్య జీవితానికి లైసెన్సు వంటి వివాహం ఇప్పుడు రకరకాల సమస్యల్లో కూరుకుపోతున్నది. ఓవైపు స్వలింగ సంబంధాలు, మరోవైపు సహజీవనాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. ఇది అనేక సమస్యలకు దారితీస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. అయితే ఇవన్నీ వైవాహిక జీవితానికి పరిమితమైన అంశాలు. పెండ్లీడుకొచ్చిన పిల్లల తల్లిదండ్రులను వేధిస్తున్న సమస్య వేరే ఉన్నది. ’జెన్ జీ’ పిల్లలు వివాహానికి పూర్వమే భౌతిక సంబంధాలు పెట్టుకోవడం క్రమంగా పెరుగుతున్నట్టు ఇటీవలి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.
పెండ్లిళ్లు ఆలస్యంగా కావడం, పైచదువులు చదవడం, ఇంటర్నెట్ విస్తృతి వంటివి ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. పెండ్లిలో ’నాతిచరామి’ అనిపిస్తారు. కానీ పెండ్లికి ముందు ’అతిచరామి’ అనుకోవడం మన సమాజంలో మామూలు విషయంగా ఇంకా మారలేదన్నది వాస్తవం. విభిన్న లైంగిక ధోరణులు, సహజీవన వ్యవస్థలను సాధారణీకరిస్తున్న ప్రస్తుత యుగంలో ఇద్దరు వయోజనుల మధ్య ఏ రకం సంబంధాన్ని అయినా తప్పుబట్టడం సాధ్యం కాదనేది తెలిసిందే.
వివాహ పూర్వ సంబంధాల తీరుతెన్నులు దేశమంతటా ఒకేతీరున లేవు. మధ్యభారతంలో అత్యధికంగా (మగ 24%, ఆడ 5% ) ఉంటే దక్షిణభారతంలో అతి తక్కువగా (మగ 11%, ఆడ 1.3% ) ఉండటం గమనార్హం. వయోవర్గం పెరుగుతున్న కొద్దీ ఈ సంబంధాలూ పెరుగుతుండటం మనకు కనిపిస్తున్నది. కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో ఈ అంకెలు మరీ ఎక్కువగా ఉండటం విశేషం. ఉదాహరణకు ఉత్తరాదిలోని ఓ యూనివర్సిటీలో 2020లో జరిపిన ఓ సర్వేలో 68.7 శాతం మంది విద్యార్థులు తెలిపారు. బీపీవోల్లో పనిచేసే వారిలో ఈ ధోరణి ఎక్కువగా ఉన్నట్టు చెన్నైలో జరిపిన ఓ సర్వేలో తేలింది.
ఈ గణాంకాల సంగతి అలా ఉంచితే ఇప్పటికీ మన జనాభాలో సగం మంది వివాహ పూర్వ సంబంధాలు మంచివి కావనే భావిస్తున్నారు. వారు దీనిని కళంకంగానే చూస్తున్నారు. అయితే ఈ తరహా అప్రతిష్ఠ సమస్య మగవారి కన్నా మహిళలనే ఎక్కువగా వేధిస్తుందనేది తెలిసిందే. యువతరం మాత్రం ఇలాంటి ఆలోచనకు దూరంగా పోతున్నారు. 34% అబ్బాయిలు, 29% అమ్మాయిలు పెండ్లికి ముందే దగ్గరవ్వడం తప్పేం కాదని భావిస్తున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది.
వివాహ పూర్వ సంబంధాల వంటి అంశాలపై సామాజిక కట్టుబాట్లే తప్ప చట్టపరమైన నియంత్రణ ఏదీ ఉండదు. వయోజనుల మధ్య పరస్పర అంగీకారంతో ఏర్పడే భౌతిక సంబంధాలు ఎంతమాత్రం నేరపూరితం కావని సుప్రీంకోర్టు గతంలో పలు సందర్భాల్లో చెప్పింది. అయితే తాజాగా ఓ విచారణ సందర్భంగా ఇందుకు భిన్నమైన తీరులో కొన్ని జాగ్రత్తలు చెప్పడం విశేషం. పెండ్లికి ముందు అబ్బాయి, అమ్మాయి ’పూర్తిగా అపరిచితులని’, భౌతిక సంబంధాలు ఏర్పరుచుకునే ముందు ఆచితూచి ముందడుగు వేయాలని సర్వోన్నత న్యాయస్థానం యువతకు హితవు చెప్పింది.
పరస్పర అంగీకారం ఉన్నంత వరకు, బలవంతం చెయ్యనంతవరకు కోర్టులు ఏమీ చేయలేవు. దానిని తప్పు అని కూడా అనలేం. వివాహ పూర్వ సంబంధాల్లో అనేక భావావేశ సమస్యలు ఉంటాయి. అవి భవిష్యత్తుపై తీవ్ర ప్రభావాలు చూపే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం సర్వదా శిరోధార్యమే. పెండ్లి చేసుకుంటామని మోసం చేసే అబ్బాయిలు ఉండవచ్చు. కానీ మోసానికి గురికావాలా వద్దా అనే విచక్షణ అమ్మాయికి ఉండాలి అనేది కోర్టు వ్యాఖ్యల సారాంశం.