ఉద్యోగం రాదనో, తాత్కాలిక ఉద్యోగాలు శాశ్వతం కావడం లేదనో, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవనో యువత అసహనానికి, అశాంతికి గురై ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరం. ఇక రాజకీయంగా చూస్తే- అలాంటి పరిణామాలకు ప్రభుత్వమే కారణమని నిందారోపణలొస్తుంటాయి. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటుచేసుకున్నది. బోడ సునీల్ ఆత్మహత్య, తదనంతరం ప్రతిపక్ష నాయకుల హంగామా తెలిసిందే. చావు ఎవరిదైనా బాధాకరమే. విద్యావంతుడైన యువకుడు అర్ధాంతరంగా బలవన్మరణానికి పాల్పడటం ఆ కుటుంబంలోనే కాదు, దానిగురించి తెలిసిన ప్రతి ఒక్కరి మదిలోనూ విషాదాన్నే నింపింది.
కరోనా కారణంగా మనదేశంలో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన 12 కోట్ల 20 లక్షల మందిలో ఎందరో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఉపాధినేర్పరచుకున్నారు. అంతకుముందు 4.8శాతం గ్రోత్ ఉన్న ఈ రంగం 12.1 శాతానికి ఎగబాకింది. ఈ ఏడాది చివరకు మనదేశంలో ఈ వ్యాపారం రూ.15,930 కోట్లు ఉండగలదనీ, 2025 నాటికి రూ.64,500 కోట్లు ఉంటుందని నిపుణుల అంచనా.
బతుకడానికి ప్రభుత్వ ఉద్యోగం ఒక్కటే మార్గమా? మరే దారీ లేదా? ఇప్పటిదాకా విద్యావంతులైన లక్షల మందిలో ఎందరికి ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి? ఉద్యోగాలు పొందలేనివారంతా తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారా? జీవనోపాధికి ప్రత్యామ్నాయ అవకాశాలు చూసుకుంటున్నారు. గౌరవంగా బతకడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ దేశంలో చూసినా జనాభాలో ఒక్కశాతం మందికే ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తున్నాయి. భారతదేశంగానీ, తెలంగాణ రాష్ట్రంగానీ అందుకు భిన్నంగా ఉండవు. మన రాష్ట్రంలో 25 లక్షలకు పైగా ఉన్నత విద్య పూర్తిచేసినవారు టీఎస్పీఎస్సీలో ఉద్యోగార్థమై తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వంలోని వివిధ శాఖలలో భర్తీ చేయవలసిన ఖాళీలు యాభై వేల నుంచి లక్ష లోపే ఉంటాయి.
ఏటా ఉన్నతవిద్యను పూర్తిచేస్తున్నవారి సంఖ్య రెండు లక్షలకు మించే ఉంటుంది. వీరిలో ఎందరికి ప్రభుత్వం ఉద్యోగాలనిస్తుంది? నా స్వగ్రామం పాలంపేటలో 60 మందికిపైగా గ్రాడ్యుయేట్స్ ఉంటే కేవలం ఒక్కరికి మాత్రమే కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. మిగిలినవారంతా కులవృత్తో, వ్యవసాయమో, ఉపాధి హామీ పనులో, ఇతరత్రా ఏదో ఒక పని కల్పించుకుని జీవనం సాగిస్తున్నారు.
నిరుద్యోగ యువత జీవనకాంక్షతో ఏదైనా సాధించవచ్చుననే విశ్వాసంతో ముందుకు సాగాలి తప్ప నిరాశానిస్పృహలకు లోనుకాకూడదు. ఏ పనిచేసినా తక్కువదేమీకాదని ఆత్మగౌరవంతో హుందాగా జీవించాలి. ఆలోచనతో అన్వేషిస్తే ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలెన్నో ఉన్నాయి. ప్రభుత్వపరంగా పలు పథకాలు, ప్రోత్సాహకాలను వినియోగించుకోవాలి. వివిధవర్గాల వారికి ప్రభుత్వ నిధులు, రాయితీలు లభిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలి బడ్జెట్లో ‘దళిత్ ఎంపవర్మెంట్’ కోసం సబ్ప్లాన్కు అదనంగా వెయ్యి కోట్లు కేటాయించింది. షెడ్యూల్డ్ జాతుల, విద్యావంతుల స్వయం ఉపాధి కోసం ‘టి ప్రైడ్’ వంటి పథకం అమల్లో ఉంది. ‘ట్రైకార్’ ద్వారా డ్రైవర్ ఎంపవర్మెంట్ స్కీం ఉంది. రూరల్ ట్రాన్స్పోర్ట్ ప్రోగ్రాం, సీఎంఎస్టీ ఎంట్రప్రెన్యూర్షిప్, గిరి వికాసం, జీసీసీ ద్వారా గిరిజన యువతకు పలు స్వయం ఉపాధి పథకాలు అమల్లో ఉన్నాయి. సబ్సిడీలు ఇవ్వడంతోపాటు బ్యాంకులతో లింకప్ చేస్తున్నారు. బ్యాంకులకు కొల్లాటరల్ స్యూరిటీ ఇవ్వలేనివారు, అధికారుల చుట్టూ తిరగలేనివారు, పెట్టుబడి రూపాయి కూడా లేనివారికోసం ప్రభుత్వేతర రంగాలలో స్వయం ఉపాధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్- 2019 డైరెక్ట్ సెల్లింగ్, ఇ- కామర్స్ రంగంలో సాగే వ్యాపారాలకు రక్షణలు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం 2016లోనే వీటికి సంబంధించిన గైడ్లైన్స్ జారీచేసింది.
నిపుణుల అంచనాల ప్రకారం- 2025 నాటికి భారతదేశంలో కోటీ ఎనభై లక్షల మందికి డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా స్వయం ఉపాధి లభిస్తుంది. 12 శాతానికి మించి గ్రోత్రేట్తో ఈ రంగం పురోగమిస్తున్నది. ఈ పేరుతో వ్యాపారం నడుపుతున్న కంపెనీలు 450కి పైనే ఉన్నా ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ (ఐడిఎస్ఏ) సభ్య కంపెనీలు కేవలం 21 మాత్రమే. ఇవి మాత్రమే భారత ప్రభుత్వం జారీచేసిన గైడ్లైన్స్ను పాటిస్తున్నాయి. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా లక్షల మంది రూపాయి పెట్టుబడి పెట్టకుండా వినియోగదారులకు నాణ్యత గల ఉత్పత్తులను, నిత్యావసర వస్తువులను ఆన్లైన్ ద్వారా అందిస్తు ప్రతి నెలా వేల, లక్షల రూపాయలను చట్టబద్ధంగా ఆర్జిస్తున్నారు. కరోనా కారణంగా మనదేశంలో ఉద్యోగాలు, ఉపాధి కోల్పోయిన 12 కోట్ల 20 లక్షల మందిలో ఎందరో డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఉపాధినేర్పరచుకున్నారు. అంతకుముందు 4.8శాతం గ్రోత్ ఉన్న ఈ రంగం 12.1 శాతానికి ఎగబాకింది. ఈ ఏడాది చివరకు మనదేశంలో ఈ వ్యాపారం రూ.15,930 కోట్లు ఉండగలదనీ, 2025 నాటికి రూ.64,500 కోట్లు ఉంటుందని నిపుణుల అంచనా. మన దేశ జనాభాలో నాలుగో వంతుకన్న తక్కువే ఉన్న అమెరికాలో డైరెక్ట్ సెల్లింగ్ వ్యాపారం టర్నోవర్ 2019లో 2.60 లక్షల కోట్ల రూపాయలు కాగా అదే ఏడాది చైనాలో 1.76 లక్షల కోట్లు, జపాన్లో 1.15 లక్షల కోట్లుంది.
‘21వ శతాబ్దంలో అన్ని వ్యాపారాల కన్న అత్యంత వేగంగా విస్తరించే అవకాశం ఉన్న వ్యాపారం డైరెక్ట్ సెల్లింగ్’ అని పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అన్నారు. 138 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో డైరెక్టు సెల్లింగ్ రంగం రాబోయే పదేండ్లలో లక్షల కోట్ల వ్యాపారాన్ని సాగిస్తూ కోట్ల మంది నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించబోతున్నది. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్), ఫుడ్ సప్లిమెంట్స్, కాస్మెటిక్స్ తదితర వస్తువులను వినియోగదారులకు అందిస్తున్నారు. మన దేశంలో ఎఫ్ఎంసీజీ మార్కెట్ సైజ్ 2017లో 840 బిలియన్ డాలర్లుండగా 2020 నాటికే 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేశారు. కరోనా వల్ల ఫుడ్ సప్లిమెంట్స్కు కూడా గిరాకీ బాగా పెరిగింది. 20 శాతం గ్రోత్ రేట్తో ఈ రంగం పురోగమిస్తున్నది. నిరుద్యోగ యువతీయువకులు చదువురానివారైనా కొంచెం శిక్షణ తీసుకుంటే డైరెక్ట్ సెల్లింగ్ రంగం వారికి మంచి భవిష్యత్తునిస్తుంది. ఈ రంగంలో 70 శాతం మహిళలే ఉన్నారు. ఇ లా మరెన్నో రకాల రంగాల్లో యువత తమ అభిరుచి, ఆసక్తిని బట్టి కృషిచేసి రాణించవచ్చు. ప్రత్నామ్నాయాలకు కొదవుండదు.
వి.ప్రకాశ్
(వ్యాసకర్త: చైర్మన్, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ)
ఇవి కూడా చదవండి..