సిరిసిల్ల పేరు వినగానే నేతన్నలు గుర్తుకు వస్తారు. వాళ్ల ఆకలి కేకలు, వలసలు, పడుగు పేకల చప్పుళ్లు వినిపిస్తాయి. ఇంకా లోతుగా చూస్తే ఇక్కడి రైతాంగ పోరాటాలు, వామపక్ష ఉద్యమాలు, మానేరు లోయలో ఎగిరిన ఎర్రజెండాలు కనిపిస్తాయి. అయినా నాటి నుంచి అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉన్నది. నిన్న మొన్నటి వరకు ఇదొక డివిజన్ మాత్రమే. అయినా డివిజన్ స్థాయిలో ఉండవలసిన ఆఫీసులు కూడా లేవు. స్వాతంత్య్రం వచ్చాక ఇక్కడొక డిగ్రీ కాలేజీ ఏర్పడడానికి 38 ఏండ్లు పట్టింది. అదికూడా పూర్తి స్థాయిలో లేని ఒక ఆర్ట్స్కాలేజీ మాత్రమే. సిరిసిల్లకు ఎప్పుడు ప్రకటనలే తప్ప ఫలితాలు అందలేదు. ఇండ్ల పట్టాలో, ఇండో జర్మన్ కాల్వనో, ఒక సెస్, ఒక అర్బన్ బ్యాంక్, మొన్న మొన్న ఒక టెక్స్టైల్ పార్క్ తప్ప ఇంత వరకు సిరిసిల్ల పెద్దగా అభివృద్ధికి నోచుకున్నది లేదు. ఇదంతా గతం. ఇప్పుడు సిరిసిల్ల తలరాత మారింది.
రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రతిభగల నాయకుడిగా పేరు పొందిన యువనాయకుడు కేటీఆర్ అడుగు పెట్టాక సిరిసిల్ల రూపురేఖలే మారిపోయాయి. ఆయన సారథ్యంలో సిరిసిల్ల అంటే చెదిరిన చరిత్రకాదు. అభివృద్ధికొక నమూన. అందుకే సిరిసిల్ల చరిత్రలో ఆయన పేరు చెరగని ఒక సువర్ణాక్షరం. ఇప్పుడు సిరిసిల్ల గురించి చెప్పుకోవాలంటే కేటీఆర్కు ముందు కేటీఆర్కు తర్వాత ఆని చెప్పుకోవాలి.
2009 ఉద్యమ కాలంలో ఒక కిరణంలా వచ్చిన కేటీఆర్ నియోజక వర్గంలో నిండు సూర్యుడిలా విస్తరించారు. ప్రజలకేదో చేయా లనే చిత్తశుద్ధి అతడిని తిరుగులేని నాయకుడిని చేసింది. 80 ఏండ్లుగా జరుగని అభివృద్ధి తెల ంగాణ వచ్చిన 8 ఏండ్లలోనే జరిగింది. సిరిసిల్ల అభివృద్ధిలో కీలకమైన అంశం ఇది జిల్లా కావ డం. కేటీఆర్ లేకుండా సిరిసిల్ల జిల్లా వచ్చేది కాదన్నది అందరికీ తెలిసిన సత్యం. మొదటి దశలోనే అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా విడుదల చేయబడిన వివిధ గ్రాంటులకు అదనంగా రూ.92 కోట్ల 65 లక్షల ప్రత్యేక అభివృద్ధి నిధులను పట్టుబట్టి పట్టణానికి మంజూరు చేయించారు.
ఇన్నాళ్లు సిరిసిల్ల ఒక శిథిల నగరమే. ఇరుకైన సందులు, ఇండ్ల ముందు పందులు, మోరీల నిండా వరద, మోకాలిమంటి బురద. కానీ ఇప్పుడు మొహం కడుక్కొని అభివృద్ధిని బొట్టుగా పెట్టుకున్న ఒక సుందర నగరం. సిరిసిల్ల ఇప్పుడు 100 కోట్ల ఖర్చుతో విశాలమయిన రహదారులతో విరాజిల్లుతున్నది. పాడుబడ్డ కుంటలా మిగిలిన కొత్త చెరువు 35 కోట్ల ఖర్చుతో మినీ ట్యాంకు బండుగా మిలమిలా మెరుస్తున్నది. ఇప్పుడు సిరిసిల్ల ఏకంగా రూ.310 కోట్లతో డబుల్ లైన్ రోడ్లు, గ్రామీణ రహదారులు, కలెక్టరేట్, ఎమ్మెల్యే భవనం, రింగు రోడ్లతో అభివృద్ధికి నమూనాగా నిలబడింది.
తలాపున మానేరు పారుతున్నా, ఎగువన మానేరు ప్రాజెక్టు ఉన్నా సిరిసిల్లకు మంచినీటి గోస తప్పలేదు. ఎత్తిపోతలతో సిరిసిల్లకు తాగునీరు ఇస్తామన్న నినాదం ఇప్పటిది కాదు. సిరిసిల్లలో డైయింగ్ పరిశ్రమలున్నాయి. రంగు నీళ్లు మోర్లల్లో కలుస్తాయి. కొన్నిసార్లు ఆ రంగు నీళ్లు నల్లాల ద్వారా ఇండ్లలోకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారింది. మంచినీళ్లు ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో 1132 కోట్ల వ్యయంతో మిషన్ భగీరథ పథకంతో సిరిసిల్లలో ఇంటింటికీ తాగునీరు అందుతున్నది.
అన్ని రంగాలతో పాటు విద్యారంగంలో కూడా సిరిసిల్ల వెనుకబడి ఉండేది. కమ్యూనిస్టులు కంచుకోటగా మార్చుకున్నా, కార్మిక నేతలు పోరాటాలు చేసినా, రైతాంగ ఉద్యమా లు పురుడు పోసుకున్నా ఎవరు విద్య మీద శ్రద్ధపెట్టలేదు. ఇక్కడ పూర్తిస్థాయిలో ఒక డిగ్రీ కాలేజీ లేకపోవడమే అందుకు సాక్ష్యం. కానీ ఇప్పుడు విద్యవిషయంలో కూడా సిరిసిల్ల దశ మారింది. రూ.120 కోట్లతో వివిధ స్థాయిల్లో విద్యాలయాల ఏర్పాటయ్యాయి. వివిధ గురుకుల పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటయ్యాయి. సాంకేతిక విద్యలో భాగంగా సర్దాపూర్లో 10 కోట్ల వ్యయంతో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, జిల్లెల్ల శివారులో అగ్రికల్చర్ యూనివర్సిటీ, నర్సింగ్ కాలేజీ ఏర్పాటయ్యాయి. కలలో కూడా ఊహించని మెడికల్ కాలేజీ సిరిసిల్లకు రాబోతున్నది. అంతేకాదు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడి దేశంలోనే రెండవదిగా పేరొందిన డ్రైవింగ్ శిక్షణా పరిశోధనా సంస్థ 16 కోట్ల ఖర్చుతో తంగళ్లపల్లి మం డలం మండెపెల్లిలో నిర్మితమైంది.
వైద్యరంగంలో కూడా ఇన్నాళ్లు సిరిసిల్లకు అరకొర వసతులే. పాము కాటుకు కామారెడ్డి కి, కుక్కకాటుకు కరీంనగర్కు వెళ్లాల్సిన దుస్థి తి. కానీ ఇప్పుడు సిరిసిల్ల ఏరియా దవాఖాన 4 కోట్ల 25 లక్షల నిధులతో 100 పడకలతో ఏ గ్రేడ్ ఆసుపత్రిగా మారి కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తున్నది. ఇంతకు ముందు నెలకు ముప్ప యి ప్రసవాలు మాత్రమే జరిగేవి. ఇప్పుడు మూడు వందల ప్రసవాలు జరుగుతున్నవి. ఇంతకు ముందు బ్లడ్ స్టోరేజీగా ఉన్న ఆసుపత్రి ఇప్పుడు బ్లడ్ బ్యాంకుగా మారింది. ఇంతకు ముందు డయాలసిస్ సేవలే లేవు. ఇప్పుడు పది యూనిట్లతో వంద మంది రోగు లు చికిత్స పొందుతున్నారు. వివిధ విభాగాల్లో రోజుకు సరాసరి 400 మంది ఆవుట్ పేషంట్లు చికిత్స పొందుతున్నారు.
నేతన్నలకు అండగా కేటీఆర్ కృషి మరువలేనిది. 30,262 మర మగ్గాలకు జియోట్యాగింగ్, 904 మందికి 3 కోట్ల 80 లక్షల బ్యాం కు అప్పులు మాఫీ, టెక్స్టైల్ పార్కులో 9 కోట్ల 19 లక్షల విద్యుత్ రాయితీ, 30 కోట్ల ఖర్చుతో పురాతన మరమగ్గాలను ఆధునీకరించి 9కోట్ల 14 లక్షల కొత్త ఋణాలతో వారి జీవితాల్లో వెలుగును నింపారు. సిరిసిల్ల పెద్దూ రు శివారులో 60 ఎకరాల్లో 174కోట్లతో అపెరల్ పార్కు నిర్మాణంలో ఉన్నది. నేత కార్మికులకు నిరంతర ఉపాధి కల్పన కోసం ఆర్విఎం ద్వారా స్కూలు పిల్లల యూనిఫారం, ఆరోగ్యశాఖ ద్వారా కేసీఆర్ కిట్లలోని వస్ర్తాలు, సాం స్కృతిక శాఖ ద్వారా బతుకమ్మ చీరెలు, రంజాన్ క్రిస్మస్ కానుకల కోసం ప్రతిఏటా 300 కోట్ల ఆర్డర్లను సిరిసిల్లకే ఇప్పిస్తున్నారు. కార్మికులను యజమానులుగా మార్చే లక్ష్యం తో 88 ఎకరాల్లో 387.62 కోట్లతో వీవింగ్ పార్క్ ఏర్పాటవుతున్నది. నేతన్నలకు నేత బంధు పథకం, 50 ఏండ్లకే పింఛన్ పథకాలు వారి జీవితాలలో వెలుగులు నింపాయి.
వ్యవసాయంలో కూడా సిరిసిల్ల గణనీయం గా ఆభివృద్ధి చెందింది. 9 మండలాలకు ఒక వ్యవసాయ డివిజన్గా ఉండి కేవలం 57,328 ఎకరాలు మాత్రమే సాగునీరందేది. ఇప్పుడు 2 వ్యవసాయ డివిజన్లతో 57 క్లస్టర్లతో మిడ్ మానేరు జలాలు అంది1,77,370 ఎకరాల సాగుభూమితో నేలకు పచ్చరంగేసుకున్నది. రికార్డు స్థాయిలో 6.5 మీటర్ల భూగర్భ జలా లు పెరిగి కలెక్టర్లకే ఒక పాఠ్యాంశంగా మారింది. 29 కోట్లతో 14,808 మందికి వ్యవసాయ పనిముట్లు అందించారు. కొండను ఆద్దంలో చూపినట్టు ఇది సిరిసిల్ల అభివృద్ధిలో కొంత మాత్రమే. ఇళ్లు మనదే అయినా వడ్డించేవాళ్లు మనవాళ్లు కావాలి. సిరిసిల్లకు ఇప్పుడు వండి వడ్డించే మన నాయకుడున్నాడు. ఆయనను కడుపులో పెట్టుకొని కాపాడుకోవడంతో పాటు అభివృద్ధిని గుర్తుపెట్టుకోవడం కూడా మనం చేయాల్సిన పని.
– పెద్దింటి అశోక్ కుమార్
(వ్యాసకర్త : ప్రముఖ రచయిత)