‘నమస్తే తెలంగాణ’ అక్షరయాత్రకు నేటితో పుష్కరకాలం పూర్తయింది. పన్నెండేండ్లు పూర్తిచేసుకొని నేడు 13వ సాలులోకి అడుగుపెడుతున్నది. తెలంగాణ గడ్డ స్వీయ రాజకీయ అస్తిత్వం, స్వీయ, ప్రాంతీయ ప్రయోజనాల కోసం నాలుగు కోట్ల మంది తెలంగాణ ఆకాంక్షల ప్రతీకగా ‘నమస్తే తెలంగాణ’ ఆవిర్భవించింది. పోరాటానికి నిలువెత్తు పతాక తెలంగాణ అయితే ‘నమస్తే తెలంగాణ’ దానికి ప్రతీక. ధిక్కార వారసత్వానికి ప్రతిబింబం. తెలంగాణ గడ్డ మీద ఉంటూ ఈ గడ్డకు వ్యతిరేకంగా ఇతర ప్రాంతాల కోసం, ఆ ప్రాంతాల భావజాలాలను పెంచి పోషించే మీడియా సంస్థల ఆకతాయి చేష్టలకు అడ్డంగా నిలబడి, నిలువరించింది. తెలంగాణ గడ్డ మీద పురుడుపోసుకున్న ‘నమస్తే తెలంగాణ’ తన ప్రయాణాన్ని తెలంగాణ భూమిపుత్రుల ఆకాంక్షలను నెరవేర్చటానికి అకుంఠిత దీక్షతో అజేయంగా ముందుకు సాగుతున్నది.
పత్రికారంగ చరిత్రలోనే ‘నమస్తే తెలంగాణ’ ఆవిర్భావం అపురూపం, అసాధారణం. తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న కుటుంబసభ్యులు, తెలంగాణ ధిక్కార బావుటాను ఎగురవేసిన అతిసామాన్య ఉద్యమకారుల చేతి నుంచి చేతనమై ‘నమస్తే తెలంగాణ’ ఆవిష్కృతమైంది. మలి తెలంగాణ ఉద్యమ తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ చేతుల మీదుగా మెయిన్ ఎడిషన్, అమరుడు పోలీసు కిష్టయ్య సతీమణి పద్మావతి చేతుల మీదుగా బతుకమ్మ, అమరుడు ఇషాన్రెడ్డి తల్లిదండ్రులు పట్లోళ్ల సరస్వతీ, ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ సిటీ ఎడిషన్, ‘మా తెలంగాణ మాగ్గావాలె’ అని చంద్రబాబును నిలదీసిన ఫణికర మల్లయ్య చేతుల మీదుగా జిందగీని ఆవిష్కరించుకున్నది ‘నమస్తే తెలంగాణ’. అదొక అపూర్వ సన్నివేశం. అసాధారణ సందర్భం. ఏడున్నర లక్షల సర్క్యులేషన్తో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, నిజామాబాద్ ఇలా ఏకకాలంలో ఏడు కేంద్రాల నుంచి ‘నమస్తే తెలంగాణ’ నాలుగున్నర కోట్ల ప్రజల ఇంటి ముందు పాశుపతాస్త్రమైవాలింది. ‘నమస్తే తెలంగాణ’ ఉద్యమకారుల పిడికిలైంది. ‘జై తెలంగాణ’ నినాదమై గళమెత్తింది. పోరుకెరటమై ఎగజిమ్మింది. ఏడున్నర లక్షల కాపీలతో తెలంగాణ అంతా ‘నమస్తే తెలంగాణ’ పరివ్యాప్తమై సింగిడీని ఆవిష్కరిస్తున్నా.. ‘ఆ పత్రిక రాదండీ.. ఇక్కడ ప్రింట్ కాదు.. ఎక్కడో ప్రింట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ పంచుతున్నరు. అయినా అందులో వార్తలుండవు. అన్నీ కట్టుకథలు.. ఉత్తముచ్చట్లే… ఇవ్వాళ జరిగిన విషయాలు ఏ మూడు నాలుగు రోజులకో అందులో వస్తాయి..’ అని మీడియాను తాము మాత్రమే నిర్వహించగలం. తమకు మాత్రమే ఆ తెలివితేటలున్నాయని భావించేవాళ్లు పై నుంచి కిందిదాకా విష ప్రచారం. తెలంగాణ వాళ్లు పత్రికలు నడుపలేరు (ఆ మాటకు వస్తే అప్పటికీ ఇప్పటికీ దాదాపు అన్ని మీడియా సంస్థల్లో తెలంగాణ భూమిపుత్రులే సంపాదకులు.. కీలక విభాగాల్లో అధిపతులు అయినా సరే) అని నిరూపించే కుత్సిత ప్రదర్శనలు నాడు మొదలై ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
జూన్ 6, 2011 నుంచి జూన్ 2, 2014 దాకా ‘నమస్తే తెలంగాణ’ది ఉద్యమ ఒరవడి. తెలంగాణ ఉద్యమానికి జరిగే వక్రీకరణలను ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తూ నిజాలను నిర్భయంగా ప్రజల ముందుంచింది. ఉద్యమాన్ని కాటగలపాలని లేదా మలినం చేయాలని తెలంగాణ వ్యతిరేక శక్తులు కుట్రలు చేసిన ప్రతీ సందర్భంలోనూ నిజం నిప్పుకణమైంది. తెలంగాణ భావజాలవ్యాప్తికి జిల్లా కేంద్రం, రెవెన్యూ డివిజన్ అనేకచోట్ల మండల స్థాయిలోనూ రౌండ్టేబుల్ సమావేశాలు నిర్వహించింది. తెలంగాణకు అడ్డుపడుతున్న పార్టీల నిజస్వరూపాన్ని ఈ రౌండ్టేబుల్ సమావేశాల ద్వారా ఎండగట్టింది. ఈ భావజాల వ్యాప్తి కేవలం తెలంగాణ ప్రాంతంలోనే కాదు, అటు సీమాంధ్ర ప్రాంతంలోనూ నిర్వహించింది.
అంతేకాదు ‘విభజన వికాసానికే, విడిపోయి కలిసి ఉందాం. ప్రగతిలో పోటీపడదాం’ అని ‘నమస్తే తెలంగాణ’ ఆంధ్రా ప్రాంతంలో అక్షరయాత్ర చేసింది. ఇరు ప్రాంతాల ప్రజల్లో వైషమ్యాలు సృష్టించి రాజకీయాల కోసమే రాజకీయాలు చేయాలనే వారి అసలు ఉద్దేశాలను అంశాలవారీగా వివరించింది. ఇదే క్రమంలో ఇవ్వాళ ప్రపంచ వారసత్వ సంపదగా నిలిచిన రామప్ప ఆలయం ఉనికి ప్రశ్నార్థకం కాబోతున్నదని గ్రహించి ‘నమస్తే తెలంగాణ’ ఆరంభమైన తొలినాళ్లలోనే (జూలై 24, 2011) వరుస కథనాలు ప్రచురించింది. దేవాదుల సొరంగం రామప్ప ఆలయాన్ని నేలమట్టం చేసే ప్రమాదం ఉందని (‘రామప్పకు జలయజ్ఞం ముప్పు) ‘నమస్తే తెలంగాణ’ రాసిన వరుస కథనాలు ఉమ్మడి రాష్ర్టాన్ని కదిలించాయి. ఫలితంగా సొరంగ మార్గ దిశను మార్చుకునేలా ‘నమస్తే తెలంగాణ’ చేసింది. తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసుకున్న కుటుంబాల్లో నెలకొన్న విషాదాలను ‘నమస్తే తెలంగాణ’ కళ్లకు కట్టింది.
ఇంటిదిక్కును కోల్పోయిన ఇల్లాలు, పిల్లల జీవితాలు, జీవిత చరమాంకంలో తోడూ నీడలా ఉండాల్సిన కొడుకో, బిడ్డో ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబాల చిధ్ర వెతలను కళ్లకు కడుతూ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. ‘కన్నీటి ‘బిందు’వుతో మొదలైన ఈ కథనాల పరంపర సుదీర్ఘకాలం కొనసాగింది. ఫలితంగా ‘నమస్తే తెలంగాణ వెల్ఫేర్ అండ్ రిలీఫ్ సొసైటీ’ని ఏర్పాటు చేసి ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో రెండు దశల్లో తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు రూ.35 వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించింది. తెలంగాణ ఏర్పాటు సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు కేంద్రం వేసిన శ్రీ కృష్ణ కమిటీ నివేదికలోని 8వ ఛాప్టర్ను బట్టబయలు చేసింది ‘నమస్తే తెలంగాణే’. ‘శ్రీ కుట్ర’ కమిటీ పేరుతో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనాలను ప్రచురించింది. తెలంగాణ ఇవ్వకూడదని భావిస్తే.. ‘ఉద్యమాన్ని అణచివేసేందుకు లేదా చల్లబరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలను కేంద్రానికి సిఫారసు చేసిన అంశాలను ఆ కథనాల్లో ఎండగట్టింది.
దూద్కా దూద్.. పానీకా పానీ.. ఇదీ ‘నమస్తే తెలంగాణ’ అనుసరిస్తున్న సత్యం. నడుస్తున్నదారి. నమ్ముతున్న సిద్ధాంతం. తెలంగాణ వస్తే చిమ్మచీకటి అన్నవాళ్ల చీకటి ప్రపంచం మీద కరెంటు వెలుగులు ప్రసరింపజేసింది తెలంగాణ.
గంగా జమునీ తహ్జీబ్కు అత్యద్భుత నమూనా హైదరాబాద్. భిన్నత్వంలో ఏకత్వాన్ని… ఏకత్వంలో భిన్నత్వాన్ని ప్రదర్శించే ప్రగతివైభవ ఏకాత్మగా తెలంగాణ ఎలా నిలిచిందో గడిచిన తొమ్మిదేండ్ల కాలమే సాక్ష్యం. రాష్ట్రం ఏర్పడిన తొమ్మిదేండ్లు పెద్దకాలం కాదు. కానీ, ‘కాలు తొక్కిననాడే కాపురం చేసే కళ’ తెలిసిపోద్ది అన్నట్టు ఈ తొమ్మిదేండ్లు తెలంగాణ నడిచిన దారి ఏదో తెలంగాణ ప్రజలకు సుస్పష్టం. దారికిరువైపులా తలలూపుతూ పలకరిస్తున్న పచ్చనిచెట్లే మన ప్రగతికి మెట్లుగా తెలంగాణ ప్రగతివైభవ సౌరభానికి దారిచూపుతున్నాయి. రైతుబంధుపై రాబందు కూతలు, రైతుబీమాపై దింపుడుగల్లం మోతలు, ధరణిపై ముష్టిదరువులు, గొర్ల పంపిణీపై గావుకేకలు, నూతన సచివాలయంపై చావుడేరా పూతలు… ఇలా కుదుటపడుతున్న తెలంగాణ సర్వవ్యవస్థలపై విషపు రాతలు.. తెలంగాణ ఆవల అద్భుతం జరిగినట్టు లోపల ఆగమైపోయినట్టు బెంబేలు పెడుతున్న దుర్వాదనలపై ‘నమస్తే తెలంగాణ’ తన ధర్మాన్ని నెరవేరుస్తూనే ఉన్నది. అబద్ధాల కోటలు, అసత్యాల అడ్డుగోడలను ఛేదిస్తూ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ‘నమస్తే తెలంగాణ’ తెలంగాణ ప్రజల పక్షం. నిలువెత్తు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతిబింబం.
జూన్ 2, 2014 నుంచి ‘నమస్తే తెలంగాణ’ ప్రగతిదారికి ప్రతిబింబమవుతూ అప్రతిహతంగా ముందుకుసాగుతున్నది. ఉద్యమానికి నాయకత్వం వహించిన నాయకుడు కేసీఆర్ చేతిలోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యమవుతుందని ప్రజలు విశ్వసించారు. రెండుసార్లు ప్రజలు ఆయన చేతిలోనే తెలంగాణను పెట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే సత్యాన్నే జీర్ణించుకోలేని ప్రతీపశక్తులు, ప్రతిఘాతక శక్తులు రాష్ట్రం ఆవిర్భవించినప్పటి నుంచే కుట్రలు చేయటం మొదలుపెట్టారు. ఆ కుట్రల నేపథ్యాన్ని, కుట్రదారుల కపట‘దారు’లను ‘నమస్తే తెలంగాణ’ ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నది. వక్రీకరణపై వజ్రాయుధాలను సంధిస్తూనే ఉన్నది.
నూర శ్రీనివాస్: 91827 77011