‘నా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవడం లేదు. జగన్.. జగన్.. అని కొట్టుకుంటున్నది’ అని ఏపీ శాసనసభలో గర్వంగా ప్రకటించిన వైఎస్ఆర్సీపీ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి కొద్ది రోజులకే టీడీపీలో చేరిపోయారు. అంతటితో ఆగకుండా జగన్పై రోజూ దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకొన్నారు. రాజకీయాల్లో ఇదేం కొత్త కాదు. ఎన్టీఆర్ కాళ్లు మొక్కిన నాయకులే ఆయన కాళ్లను లాగేశారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఒకరిద్దరు శాసనసభ్యులు కాదు, ఏకంగా ప్రభుత్వాలే రాత్రికి రాత్రే మారిపోతున్నాయి. ఐదేండ్లకు ఓసారి ఎన్నికల్లో ప్రభుత్వాలు మారడం కాదు, మోదీ తలుచుకుంటే ఎన్నికలతో సంబంధం లేకుండా ప్రభుత్వాలు మారిపోతున్నాయి. ‘షిండేలను ప్రవేశపెడతాం జాగ్రత్త!’ అని కొందరు నేతలు బహిరంగంగానే ప్రకటనలు చేస్తుండటం పరిస్థితికి అద్దం పడుతున్నది.
రాజీవ్గాంధీ ప్రధానమంత్రి అయ్యాక పార్టీ మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకువచ్చారు. పార్లమెంట్, అసెంబ్లీలు చట్టాలను రూపొందించే పవిత్ర ఆలయాలు. అటువంటి చట్టసభల్లో పార్టీ మార్పిడి నిరోధక చట్టం అమలు తీరు ఎంత గొప్పగా ఉందో మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. ‘తాళం వేసితిని కానీ, గొళ్లెం పెట్టడం మరిచితిని’.. అన్నట్టుగా ఈ చట్టం హాస్యాస్పదంగా మారిపోయింది. ఒక శాసనసభ్యుడు లేదా పార్లమెంట్ సభ్యుడు పార్టీ మారినప్పుడు ఆ పార్టీ వాళ్లు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోవాల్సింది స్పీకర్. సహజంగా స్పీకర్ అధికార పక్షానికి చెందినవారే అయి ఉంటారు. స్పీకర్ స్వతంత్రంగా వ్యవహరిస్తారని ఆశించడం అత్యాశే అవుతుంది. న్యాయవ్యవస్థను ఆశ్రయించినా ఫలితం ఉండటం లేదు. స్పీకర్ అధికారాల్లో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదు. గతంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సలహా ఇవ్వడం తప్ప సర్వోన్నత న్యాయస్థానం కూడా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఏపీ, తెలంగాణలో గతంలో ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు శాసనసభ చివరి దశలో ఎన్నికలకు వెళ్లే ముందు స్పీకర్లు నిర్ణయాలు తీసుకున్నారు. ఐదేండ్ల పదవీకాలం ముగిసే సమయంలో నిర్ణయం తీసుకుంటున్నారంటే.. చట్టాలు చేసే చట్టసభలే పార్టీ మార్పిడి నిరోధక చట్టాన్ని ఎంత బాగా అమలు చేస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఓటర్లు ప్రజాప్రతినిధులను పార్టీ పరంగా ఎన్నుకుంటారు. ప్రజలు తమకున్న ఓటు హక్కు ద్వారా ఒక పార్టీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడు అతను మరో పార్టీలో చేరడమంటే ప్రజల నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లినట్టే. ఒక పార్టీ మినహాయింపు అని కాదు.. అన్ని రాష్ర్టాల్లో, అన్ని పార్టీల్లో ఇదే తంతు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచే ఈ సమస్యను ఎదుర్కొంది. వైఎస్ఆర్ హయాంలో 13 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులను కాంగ్రెస్ తమవైపు తిప్పుకొంది. ఈ 13 మందిలో సంగారెడ్డికి చెందిన జగ్గారెడ్డి మినహా మిగిలిన వారెవరూ తిరిగి శాసనసభకు ఎన్నిక కాలేదు.
2014లో తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో పలువురు చేరారు. ఆంధ్రాలోనూ ఇదే జరిగింది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 మంది శాసనసభ్యులను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అయితే కనీసం ఎంపీగా ప్రమాణస్వీకారం చేయకుండానే టీడీపీలో చేరిపోయారు. ఎంతమంది పార్టీని వీడినా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్ మోహన్రెడ్డి పట్టించుకోలేదు. ‘జనం ఆదరణే నాకు ముఖ్యం, వాళ్లు పోతేపోనీ’ అని అనుకున్న ఆయన వారిని ఖాతరు చేయలేదు. 2019 ఎన్నికల్లో జగన్ ఆశించినట్టే ప్రజలు ఆ పార్టీని ఆదరించారు. 23 మంది శాసనసభ్యులను టీడీపీలో చేర్చుకున్న చంద్రబాబుకు ఆ ఎన్నికల్లో 23 సీట్లే వచ్చాయి. పార్టీలు మారడాన్ని అధినాయకులు ప్రోత్సహిస్తున్నా జనం మాత్రం సహించడం లేదు. ఎన్నికల్లో ఫిరాయింపుదారులను తిరస్కరిస్తున్నారు.
రాజకీయం ఫక్తు వ్యాపారంగా మారిపోయింది. కొన్ని నియోజకవర్గాల్లో ఎంపీగా పోటీ చేయాలంటే వంద కోట్ల రూపాయలు అవసరం. తాము చేసిన ఖర్చును రాబట్టుకోవడంతో పాటు అదనంగా సంపాదించుకోవడం కోసం, తిరిగి గెలవడం కోసం అధికార పక్షాన్ని పలువురు నేతలు ఆశ్రయిస్తున్నారు.
గతంలో కన్నా ఈ సారి తెలంగాణలో చాలా వేగంగా గోడ దూకేస్తున్నారు. కె.కేశవరావును ప్రజలెప్పుడూ ఓటు వేసి ఎన్నుకోలేదు. టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆ పార్టీ అతనికి రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇచ్చింది. ఆయన కుమార్తెను హైదరాబాద్ మేయర్ను చేసింది. అయితే బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. తండ్రి, కూతురు కాంగ్రెస్లో చేరిపోయారు. సాధారణంగా నాయకులు పార్టీ మారినప్పుడు.. తనకు పార్టీలో అన్యాయం జరిగిందని, అందుకే పార్టీ మారుతున్నానని ప్రకటిస్తారు. కేకేను రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా, ఆయన కుమార్తెను గ్రేటర్ హైదరాబాద్ మేయర్గా అవకాశం కల్పించాక కూడా అన్యాయం జరిగిందని అనడానికి కేకే మొహమాట పడ్డట్టున్నారు. అందుకే అన్యాయమనే డైలాగ్ను ఆయన వాడలేదేమో. దేశంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్లో ఉందని, అందుకే ఆ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కనీసం పార్లమెంట్లో ప్రతిపక్ష హోదాకు అవసరమైన ఎంపీ స్థానాలను కూడా గెలవని కాంగ్రెస్ దశాబ్ద కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. గడ్డు పరిస్థితి ఈ రోజు కొత్తగా వచ్చింది కాదు. కేశవరావు కాంగ్రెస్లో చేరి ఆ పార్టీని గట్టెక్కించే అవకాశమూ లేదు. దేశంలో ఎక్కడా కాంగ్రెస్ గెలుస్తుందనే గ్యారెంటీ లేదు. స్వయంగా సోనియాగాంధీ ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైపోయారు. ఇటీవల ఆమె రాజ్యసభకు ఎన్నికైన విషయం విదితమే.
కేశవరావు, కడియం శ్రీహరి లాంటి వారి విషయంలో పార్టీ మారడం వెనుక వారి పిల్లల ఒత్తిడి ఉన్నట్టు వినిపిస్తున్నది. మేయర్గా ఉన్న తన కుమార్తె కోసం ఆయన తన రాజకీయ జీవితం చివరి దశలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కడియం శ్రీహరి కూడా తన కుమార్తె కావ్య కోసం కాంగ్రెస్లో చేరారు. ‘పుట్టి నాలుగు రోజులు కాలేదు, నా జీవితంలో ఇంత పెద్ద గాలివాన చూడలేదు’ అని సామెత చెప్పినట్టు.. బీఆర్ఎస్కు అవినీతి మరక అంటిందని, అందుకే రాజీనామా చేస్తున్నానని కడియం కావ్య చెప్పడం విడ్డూరం. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కావ్య పేరును ఆ పార్టీ ప్రకటించిన మూడు నాలుగు రోజులకే ఆమె పార్టీ మారాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని పార్టీ అడిగినప్పుడే.. ‘వద్దేవద్దు, మీ పార్టీకి అవినీతి మరక అంటింది’ అని చెబితే బాగుండేది కదా. పాపం! అవినీతి అంటే ఆమెకు ఎలర్జీ అనుకుంటా. అవినీతి అంటే ఎలర్జీ ఉన్న ఆమె పవిత్రమైన కాంగ్రెస్లో చేరారు. 135 ఏండ్లలో పవిత్రమైన కాంగ్రెస్ చేసిన అవినీతి గురించి తన తండ్రిని కడియం కావ్య అడగాల్సింది. ‘మాజీ లెక్చరర్ గారు’ కాంగ్రెస్ అవినీతి గురించి అరటి పండు ఒలిచి పెట్టినంత బాగా వివరించేవారు. కాంగ్రెస్ అవినీతిపై అద్భుతంగా దశాబ్దాల పాటు మాట్లాడిన కొద్దిమంది తెలంగాణ నాయకుల్లో కడియం శ్రీహరి ఒకరు. ఐదేండ్ల క్రితమే వరంగల్ పార్లమెంట్ సీటు కోసం కడియం కావ్య తీవ్రంగా ప్రయత్నించారు. అప్పుడామెకు టికెట్ దక్కలేదు. ఇప్పుడు కాంగ్రెస్లో అయితే లాభసాటి బేరం అనుకోని ఆ పార్టీలో చేరారు. కడియం శ్రీహరి ముక్కుసూటి మనిషి. పార్టీలు మారడం అయన తత్త్వం కాదు. గతంలో ఒక ఛానల్ వాళ్లు అడిగితే.. ‘ఉప ముఖ్యమంత్రి పదవి వరకు వెళ్లాను. ముఖ్యమంత్రి కావాలనే కోరికేమీ లేదు. ఇక నేను పార్టీ ఎందుకు మారుతాను. మారాల్సిన అవసరం ఏముంది?’ అని ఎదురు ప్రశ్నించారాయన. అందుకే కుమార్తె ఒత్తిడి వల్ల పార్టీ మారినట్టు తెలుస్తున్నది. పార్టీ మారినవారు చెబుతున్నట్టు బీఆర్ఎస్లో లోపాలు ఉండవచ్చు. అయితే ఆ లోపాలు పార్టీ ఓడిపోయి, వీళ్లు పార్టీ మారాలని అనుకున్నప్పుడే గుర్తుకు వచ్చాయా? అనేదే సమస్య.
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్రెడ్డి తాను మళ్లీ పోటీ చేయడం లేదని తొలుత ప్రకటించారు. తర్వాత కాంగ్రెస్లో చేరి అదే చేవెళ్ల నుంచి ఆ పార్టీ తరపున బరిలో దిగుతున్నారు. ‘బీఆర్ఎస్ ఎంపీగా ఏమీ చేయలేక విఫలమయ్యాను. ఈ సారి కాంగ్రెస్ ఎంపీగా అవకాశం ఇవ్వండి. ఎంతో చేసి చూపిస్తాను’ అని ఆయన ప్రచారం చేస్తారేమో చూడాలి.
రాజకీయం వ్యాపారంగా మారిపోయిన ప్రస్తుత తరుణంలో కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగినవారే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. టికెట్లు వారికే వస్తున్నాయి. క్యారెక్టర్ చూసి టికెట్ ఇస్తే, వారి వద్ద డబ్బులు ఉండవు. గెలిచే అవకాశాలు సన్నగిల్లుతాయి. పార్టీలు కూడా చూసేది సంపన్నులనే. అలాంటివారు గెలిచాక లాభసాటి నిర్ణయాలే తీసుకుంటారు. బీఆర్ఎస్ నుంచి లాయల్టీ రాత్రికి రాత్రి కాంగ్రెస్కు మారినపుడు.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ లాయల్టీ కాంగ్రెస్ నుంచి బీజేపీకి మారదనే గ్యారెంటీ ఏమీ లేదు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ద్వారాలు తెరిచినట్టే.. ఒకవేళ బీజేపీ మూడోసారి గెలిస్తే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ ద్వారాలు తెరిచే అవకాశం లేకపోలేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని బీజేపీ శాసనసభ్యులు విలేకరుల సమావేశాల్లోనే హెచ్చరిస్తున్నారు. 119 నియోజకవర్గాలు ఉన్న తెలంగాణలో బీజేపీ శాసనసభ్యుల సంఖ్య 8 మాత్రమే. మరి ప్రభుత్వం ఉండదని వారెలా చెబుతారని సందేహం కలగవచ్చు. కానీ, ఆ పార్టీ ఏమైనా చేయగలదు. అందుకే బీజేపీ నేతల మాటలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. ఎందుకంటే కమలం సంగతి కాంగ్రెస్కు తెలుసు. పొరుగునున్న మహారాష్ట్రలో ఏం జరిగిందో కాంగ్రెస్ కూడా చూసింది.
వందల కోట్లు ఖర్చు చేసి గెలిచేవాళ్లు నిజాయితీగా ఉండాలని కోరుకోవడం అత్యాశే అవుతుంది. నిజాయితీగా ఉంటారని అనుకోవడం అమాయకత్వమే అవుతుంది. రాజకీయాల్లో మితిమీరిన వ్యయం రాజకీయాలను వ్యాపారంగా మార్చేసింది. ప్రజాస్వామ్యం అంటే సంపన్నుల రాజకీయ వ్యాపారం అన్నట్టుగా తయారైంది. ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతాలు, లక్ష్యాలంటూ ఏమీ లేవు. ఏ పార్టీలో చేరితే ఎంత లాభం అనేదే ముఖ్యం. పోలింగ్ రోజు క్యూలో నిలబడి ఓటు వేయడం వరకే ప్రజల బాధ్యత. గెలిచిన వారిని ఎవరు కొంటారు? ఎవరికి, ఎవరు అమ్ముడుపోతారనేది ప్రజలకు సంబంధం లేని వ్యవహారం. ప్రజాస్వామ్యం క్రమంగా ప్రజలకు సంబంధం లేని అంశంగా మారిపోతున్నది. అయితే పార్టీలు మారినవారిని ప్రజలు ఆదరిస్తారా? తిరస్కరిస్తారా? అనేది ఎన్నికల్లో తేలుతుంది.
– బుద్దా మురళి