ప్రపంచానికి తయారీ హబ్గా భారతదేశాన్ని మారుస్తామన్న ఆర్భాటపు ప్రకటనతో 2014లో ప్రధాని నరేంద్రమోదీ మేకిన్ ఇండియాను ప్రారంభించారు. ఆకర్షణీయమైన లోగో తప్ప ఆ పథకం కింద ఈ తొమ్మిదేండ్లలో సాధించినదేమీ లేకపోగా, విదేశీ కంపెనీలను నెత్తి మీద పెట్టుకోవటం మరింత పెరిగింది. రూ.53 వేల కోట్ల విలువైన 120 వందేభారత్ రైళ్ల తయారీ, సరఫరా, నిర్వహణ కాంట్రాక్టును కేంద్రం రష్యా కంపెనీ ట్రాన్స్మాష్ హోల్డింగ్కు ఇవ్వటం తాజా ఉదాహరణ. మేకిన్ ఇండియాను మొదలు పెట్టినప్పుడు మూడు ప్రధాన లక్ష్యాలను నిర్దేశించారు. తయారీ రంగం వృద్ధిని 12-14 శాతానికి పెంచటం, 2022 నాటికి జీడీపీలో ఆ రంగం వాటాను 16 శాతం నుంచి 25 శాతానికి తీసుకురావటం, 10 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టించటం. ఈ మూడింటిలో ఒక్కటీ పూర్తి కాలేదు. తయారీ రంగం వృద్ధి రేటు ఆరు శాతాన్ని మించలేదు. జీడీపీలో వాటా 16 శాతం వద్దే నిలిచిపోయింది. కోట్ల ఉద్యోగాల సంగతేమోగానీ ఉన్న ఉద్యోగాలు ఊసిపోతున్నాయి.
మేకిన్ ఇండియా ప్రకటన అనంతరం చైనా నుంచి దిగుమతులు మరింత పెరగటం గమనార్హం. గత ఐదేండ్లలో చైనా నుంచి మన దేశానికి దిగుమతులు 30 శాతం పెరిగినట్లు నిరుడు జూలైలో కేంద్రం స్వయంగా పార్లమెంటులో ప్రకటించింది. 2022 జనవరి-జూన్లో చైనా నుంచి భారత్కు దిగుమతులు 34.5 శాతం పెరుగగా, చైనాకు భారత్ నుంచి ఎగుమతులు 35 శాతం తగ్గాయి. అందుకే, ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెబుతున్నట్లుగా.. మన జాతీయ జెండాల దగ్గరి నుంచి పతంగుల మాంజా వరకూ అన్నీ మేడిన్ చైనా ఉత్పత్తులే కనిపిస్తున్నాయి. మేకిన్ ఇండియా పథకం కింద దేశీయ పరిశ్రమల్ని ప్రోత్సహించే చర్యలు కూడా మోదీ సర్కారు చేపట్టటం లేదు. విదేశీ కంపెనీలకు మన మార్కెట్లను బార్లా తెరుస్తుండటంతో దేశీయ కంపెనీలు కోలుకోలేని విధంగా దెబ్బతింటున్నాయి. రోజుకు సగటున 270 కంపెనీల చొప్పున గత ఎనిమిదేండ్లలో 7.84 లక్షల దేశీయ కంపెనీలు మూతపడ్డాయి. వాటిమీద ఆధారపడిన లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
దేశవ్యాప్తంగా కొన్ని పట్టణాలు కొన్ని రకాల వస్తువుల తయారీకి పేరొందాయి. సోలాపూర్ చెద్దర్లు, చన్నపట్టణ బొమ్మలు, కశ్మీర్ విల్లో క్రికెట్ బ్యాట్ల వంటివి. దశాబ్దాలుగా ప్రఖ్యాతిగాంచిన ఈ సంప్రదాయ పరిశ్రమలను నిలబెట్టటానికి కూడా కేంద్రప్రభుత్వం ముందుకు రావటం లేదు. జీఎస్టీ భారం, ముంచెత్తుతున్న చైనా ఉత్పత్తులు, ప్రభుత్వం నుంచి కనీస మద్దతు కరువైన కారణంగా దేశీ తయారీ హబ్లు నేడు కళాకాంతులను కోల్పోతున్నాయి. మేకిన్ ఇండియాలో భాగంగా తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాల్లో, నిబంధనలకు విరుద్ధంగా నాణ్యత లేని చైనా బ్యాటరీలను వాడటం వల్ల ఆ వాహనాలు పేలిపోతున్నాయి. ప్రభుత్వం నుంచి భారీ సబ్సిడీలు తీసుకుంటూ కూడా వాహనాల తయారీ కంపెనీలు నాసిరకం బ్యాటరీలు వాడుతున్నాయని, ఇది వేల కోట్ల కుంభకోణం అని ఆరోపణలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి చర్యలు లేవు. వచ్చిన అరకొర ఎఫ్డీఐలను బీజేపీ పాలిత రాష్ర్టాలకు తరలిస్తూ కేంద్రం పక్షపాత వైఖరిని చూపుతున్నది. మొత్తమ్మీద మేక్ ఇన్ ఇండియా జోక్ ఇన్ ఇండియాగా మారిపోయింది.