వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు నేలకూలినట్లుగా దేశమంతటా తనకు ఎదురే లేదని భావిస్తూ వస్తున్న బీజేపీకి దిమ్మతిరిగే తీర్పునిచ్చింది మునుగోడు. తెలంగాణ వాడి, వేడి ఎలా ఉంటుందో ఉత్తరాది పార్టీకి, ఢిల్లీ కేంద్రంగా ఇక్కడ చక్రం తిప్పాలనుకున్న ఆ పార్టీ ద్వయానికి ఈ పాటికి తేటతెల్లమై ఉంటుంది. ఇది బీజేపీ స్వయంగా కోరుకుని తీసుకొచ్చిన ఉప ఎన్నిక కాబట్టి, ఈ ఫలితానికి ఆ పార్టీ ఎవరినీ వేలెత్తి చూపాల్సిన పని కూడా లేదు. గర్వభంగాన్ని కలిగించిన స్వయంకృతం ఇది. దీనివల్ల బీజేపీ తన విధానాల్ని సమీక్షించుకుంటుందా? మార్చుకుంటుందా? అంటే అది అత్యాశే కావచ్చు. ఎందుకంటే నరేంద్ర మోదీ, అమిత్ షా సారథ్యంలో ఉన్న ఆ పార్టీలో ఇప్పటివరకూ అటువంటి పశ్చాత్తాప దిద్దుబాటు ధోరణి కనిపించలేదు.
ఇక్కడ బీజేపీ మార్కు రాజకీయాలు చెల్లబోవని తెలంగాణ విస్పష్టంగా ప్రకటించింది! డబ్బుతో, అధికారబలంతో, అబద్ధాలతో, శుష్క హామీలతో, ప్రగల్భాలతో, తడిబట్టల ప్రమాణాలతో తమను ఏమార్చలేరని తెలంగాణ బిడ్డలు ఓట్లు గుద్ది మరీ చెప్పారు. తెలంగాణను తెచ్చిన టీఆర్ఎస్ పార్టీ వెంటే తాము ఉంటామని, దశాబ్దాల ఫ్లోరైడ్ గోసను తీర్చిన కేసీఆర్ వెంటే నిలబడుతామని చాటి చెప్పారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణను పచ్చగా మార్చుకుంటూ ఉంటే ఏ విధంగానూ సహకరించకపోగా, కాళ్లలో కట్టెలు పెడుతున్న బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని తీర్పునిచ్చారు. ఢిల్లీ అహంకార, ఆధిపత్య రాజకీయాలను తుత్తునియలు చేసిన తెలంగాణ ఆత్మగౌరవం ఇది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీ కుట్రలను బద్దలు కొట్టి, ఆ పార్టీని బజార్లో బరిబాతల జనం ముందు నిలబెట్టారు. ఇప్పుడు మునుగోడు ఓటర్లు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించారు.
మునుగోడు ఉప ఎన్నిక.. తెలంగాణకూ సమీక్షించుకోవాల్సిన, జాగ్రత్త పడాల్సిన ఒక సందర్భం. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ, ప్రభుత్వాలను కూల్చివేస్తూ, ఆ పద్ధతిలోనే తెలంగాణలో కూడా పాగా వేయాలని బీజేపీ ఈ ఉప ఎన్నికను ప్రజల మీద రుద్దింది. తెలంగాణ భౌగోళికంగా ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య ఉన్న ప్రాంతమే కాదు.. ఆ రెండింటి సంస్కృతుల సమ్మిళిత ప్రాంతం కూడా. ‘గంగా జమునీ తెహ్జీబ్’ అనే మాట ఊరకే రాలేదు. ఒక రకంగా మినీ ఇండియా మన తెలంగాణ. ఇటువంటి తెలంగాణలో బీజేపీ తనవైన మతపరమైన, బుల్డోజర్ రాజకీయాలు చేయాలని చూస్తున్నది. దీంట్లో భాగమే మునుగోడు ఉప ఎన్నిక. అక్కడ ఆ పార్టీ బొక్క బొర్లా పడింది. రెంటికీ చెడ్డ రేవడిలా మారిన రాజగోపాల్రెడ్డి అనుభవం బీజేపీవైపు చూసే ఇతరులకూ గుణపాఠం కావచ్చు. అయినప్పటికీ, యావత్ తెలంగాణ నిత్య జాగురూకతతో ఉండాలి. మునుగోడు స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. విచ్ఛిన్నకర రాజకీయాలు చేసే బీజేపీకి ఈ గడ్డ మీద స్థానం లేదని చాటి చెప్పాలి.