‘అన్నీ నాకే దక్కాలే… లేకపోతే ఎవరికీ దక్కనివ్వను’ అనే బుద్ధి ప్రజాస్వామ్యానికి పనికిరాదు. ప్రస్తుతం దీన్ని నిండారా ఒంటబట్టించుకున్న పార్టీ బీజేపీ తప్ప మరొకటి లేదు. ఢిల్లీపై ఆ పార్టీ పెంచుకున్న అక్కసు చూస్తే ఈ సంగతి బాగా అర్థమవుతుంది. 1977లో బీజేపీ పూర్వరూపమైన జనసంఘ్ ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని హంగామా చేసింది. అప్పట్లో ఢిల్లీపై ఆ పార్టీకి చాలా ఆశలుండేవి కనుక అలా చేసిందనుకోవచ్చు. ఇప్పుడు అదే పార్టీ ఢిల్లీ ప్రతిపత్తిని చీఫ్ కమిషనరేట్ స్థాయికి దిగజార్చేందుకు వెనుకాడటం లేదు. ఢిల్లీ పరిపాలన బిల్లు ద్వారా నిజానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసింది అదే. అయితే ఇది కేవలం ఢిల్లీకే పరిమితమైన సమస్య కాదు. ప్రధాని మోదీ సర్కారు ఏర్పడిన నాటినుంచి భారతదేశ సమాఖ్య స్ఫూర్తికి తీవ్రమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. దేశమంతా తమ గుప్పిట్లో ఉండాలని మోదీ-షా ద్వయం కోరుకోవడమే అందుకు కారణం.
ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా గవర్నర్ పెత్తనాన్ని వ్యతిరేకించిన మోదీ తాను ప్రధాని పదవి చేపట్టగానే మారిపోయారు. బీజేపీయేతర ప్రభుత్వాలపైకి గవర్నర్లను ఉసిగొల్పుతున్నారు. తెలంగాణ, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ర్టాల్లో అక్కడి ఎన్నికైన ప్రభుత్వాలను గవర్నర్లు ఇబ్బందులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ కథ ఇందుకు పూర్తి భిన్నం కాకపోయినప్పటికీ కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఆప్ వచ్చేంతవరకు అయితే కాంగ్రెస్, కాకపోతే బీజేపీ అన్నట్టుగా ఉండేది. కానీ, ఆప్ అవినీతి నిర్మూలనే ఎజెండాగా ఉద్యమాన్ని నిర్మించి అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. ఆ రెండు పార్టీలు ఢిల్లీలో అంటుకు లేకుండాపోయాయి. ఇది బీజేపీకి కంటగింపుగా మారింది. పైగా ఆప్ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధానిపై తీవ్ర విమర్శలు సంధిస్తుంటారు. కేంద్రానికి, ముఖ్యంగా ప్రధాని మోదీకి ఆయన పక్కలో బల్లెంలా తయారయ్యారు. దీంతో అటు కేంద్ర నిఘా, దర్యాప్తుసంస్థలు ఆప్ నేతల వెంటపడ్డాయి. ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను జైల్లో పెట్టాయి. మరోపక్క లెఫ్టినెంట్ గవర్నర్ కిరికిరీలు లేవదీయడం నిత్యకృత్యమైపోయింది.
ఈ నేపథ్యంలో ఢిల్లీకి గల అధికారాలపై ఆప్ సర్కారు సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఎన్నికైన ప్రభుత్వానికే అధికారుల నియమాక, బదిలీలపై పూర్తి అధికారాలుంటాయని సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఈ తీర్పును రద్దు చేసేందుకే మోదీ ప్రభుత్వం ఢిల్లీ పరిపాలన ఆర్డినెన్స్ తెచ్చింది. దానినే ఇప్పుడు చట్టంగా ప్రవేశపెడితే సోమవారం పార్లమెంటు ఆమోదముద్ర వేసింది. ఆ చట్టం ప్రకారం ఆప్ అధికారాలు నామమాత్రం అవుతాయి. కేంద్రం లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా చక్రం తిప్పుతుందన్నమాట. అంటే ఒకప్పుడు పూర్తిస్థాయి రాష్ట్ర ప్రతిపత్తి కావాలని డిమాండ్ చేసినవారే ఇప్పుడు దాని స్థాయిని దిగజార్చారు. కేవలం తాము గెలవలేదనే అక్కసుతో ఇది చేశారని పైకి తెలుస్తూనే ఉన్నది. దేశ సమాఖ్య నిర్మాణానికి ప్రమాదకరమని అంటూ బీఆర్ఎస్ తదితర పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకించాయి. ఢిల్లీ విషయంలో కేంద్ర ధోరణి ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తుకుతెస్తున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించడం గమనార్హం.