పిచ్చోడి చేతిలో రాయి అనే సామెతను తరచూ వాడుతుంటాం. దేశంలోని తాజా రాజకీయాలను పరిశీలిస్తే అధికార బీజేపీ అచ్చం అలాగే చేస్తున్నది. నిన్నటివరకు దేశ రాజకీయాలను జమిలి ఎన్నికల చుట్టూ తిరిగేలా చేసి ఇప్పుడు ఏకంగా దేశం పేరు మార్చాలన్న కొత్త ఎత్తుగడను దేశం ముందుకు తెచ్చింది. జమిలిపై బీజేపీకున్న అత్యుత్సాహ కోణం ఏంటి? అన్న మాట అటుంచితే, అనేక సమస్యలు తిష్ట వేసి ఉన్న భారతదేశంలో ఉన్నఫళంగా జమిలి ఎన్నికల చర్చ తీసుకురావడం ఎవరికి లాభం? ఎవరికీ నష్టం?
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లోనే జమిలి బిల్లు పెడతారా? అది ఆమోదం పొందినా.. పొందకపోయినా లోక్సభను రద్దు చేస్తారా? ఆ తర్వాత పాక్షిక జమిలి ఎన్నికలు డిసెంబర్-జనవరిల్లోనే జరిగే అవకాశాలున్నాయా? అనే ఓ రాజకీయ చర్చ దేశంలో బలంగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో ఇంతకు మనదేశంలో జమిలి సాధ్యమా అన్నది కూడా చర్చించాలి. ప్రస్తుతం బీజేపీ తెరపైకి తీసుకొచ్చిన ఈ ప్రతిపాదన చుట్టే దేశ రాజకీయాలు తిరుగుతుండటం, ప్రతిపక్షాలు కూడా ఎలాంటి చర్చలు లేకుండా ఆ ఊబిలో పడి సాధ్యాసాధ్యాలను బొత్తిగా విస్మరించడం విచారకరం.
బీజేపీ ప్రతిసారి జమిలి ప్రస్తావన తీసుకొస్తూ 1999 నుంచి తాజాగా రామ్నాథ్ కోవింద్ వరకు గుట్టు చప్పుడు కాకుండా కమిటీలు వేస్తూనే ఉన్నది. అయితే ఇన్నాళ్లు ప్రతిపాదనలు వేరు…ఇప్పటి హడావుడి ఏర్పాట్లను వేరుగా చూడాలి. కొన్ని శాసన సభల పదవీకాలం ముగుస్తుండటం, లోక్సభ పదవికాలం కూడా దగ్గర పడుతుండటంతో ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ ప్రస్తావనను తెరపైకి తీసుకొస్తున్నది బీజేపీ. అయితే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ, దాని పర్యావసానాలపై దేశంలోని మేధావి లోకం, బుద్ధి జీవులు చర్చించాల్సిన అవసరం ఉన్నది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నింటికి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది జమి లి ప్రధాన సూత్రం. ఇది సాధ్యమా, లేక చర్చకు తీసుకొచ్చి వదిలేస్తుందా అన్నది గమనించాలి. జమిలి అనుకుంటే నిజానికి రాష్ర్టాల చట్టసభలను గడువుకు ముందే రద్దు చేయాల్సి ఉంటుంది. మరికొన్ని రాష్ర్టాల కాల వ్యవధిని పొడిగించాల్సిన అవసరమూ రావచ్చు.
జమిలి బిల్లు తొలు త పార్లమెంట్ ఆమోదం పొందాలి. అంతకుముందే ఐదు రాజ్యంగ సవరణలు, ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని లా కమిషన్ స్పష్టంగా పేర్కొంటున్నది. అంతేకాకుండా 543 మంది ఎంపీల్లో కనీసం 67 శాతం (362 మంది) మంది ఈ బిల్లుకు అనుకూలంగా ఓటేయాలి. అలాగే 245 రాజ్యసభ సభ్యుల్లో 67 శాతం (164 మంది) బిల్లును సమర్థించాలి. మరోవైపు దేశంలోని 14 రాష్ర్టాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఇక దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే జాతీయ అంశాలే తప్ప స్థానిక సమస్యల ఊసుండదు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తోడు స్థానిక సంస్థల విధులు ప్రత్యేకంగా ఉంటాయి. మూడంచెల పాలనా వ్వవస్థలో అనేక మార్పుచేర్పులు అనివార్యమవుతాయి. అంతేకాదు రాజకీయంగా బలంగా ఉన్న బీజేపీ ఈ దేశంలో ఉన్న ప్రతిపక్షాలన్నింటినీ మరింత బలహీనపరిచే అవకాశం లేకపోలేదు. అయితే దశలవారీగా ఈ ఆలోచనను అమలు చేయాలన్న కుట్రలకు మాత్రం బీజేపీ తెరలేపుతున్నదనే చెప్పాలి. అందుకే ఈ డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది డిసెంబర్ మధ్యలో ఎన్నికలు జరుగాల్సిన 10 నుంచి 12 రాష్ర్టాల అసెంబ్లీలు, లోక్సభకు కలిపి పాక్షిక జమిలి ఎన్నికలు జరిపేవిధంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తున్నది.
అసెంబ్లీలకు ముందస్తు సంబంధించి పెద్దగా ఇబ్బందులుండవు. నిబంధనల ప్రకారం ఆరు నెలల ముందు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించవచ్చు. కానీ, ఈ ఏడాది నవంబర్-డిసెంబర్ల్లో ఎన్నికలు జరగాల్సిన అసెంబ్లీలకు సం బంధించి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. ఉదాహరణకు: తెలంగాణలో 2024 జనవరి 16లోపు మళ్లీ ఇక్కడ సర్కారు కొలువు తీరాలి. లేకపోతే, రాష్ట్రపతి పాలన విధించాలి. పాక్షిక జమిలి ఎన్నికలు ఆలస్యమైతే తెలంగాణతోపాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ర్టాల్లోనూ ఇదే సమస్య ఉత్పన్నమవుతుంది. అప్పుడు రాష్ట్రపతి పాలనకు ఆ రాష్ర్టాలు అంగీకరిస్తాయా? అనేది ప్రశ్న. అంగీకరించకపోతే ఆ రాష్ర్టాల్లో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుపాలి. అప్పుడు పాక్షిక జమిలి ప్రయోగం విఫలమవుతుంది. ఇక్క డే మరో సమస్య తెరపైకి వస్తోంది. ఒకవేళ, సెప్టెంబర్ చివర్లో లోక్సభను రద్దు చేసి ఎన్నికలకు వెళితే.. కేంద్ర మంత్రి మండలి ఉండదు కనుక వివిధ రాష్ర్టాల్లో రాష్ట్రపతి పాలన విధించడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో, లోక్సభతోపాటు కొన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు డిసెంబర్- జనవరిల్లోనే ఎన్నికలు జరిపేలా కేంద్రం పావులు కదుపుతున్నది. కానీ, సెప్టెంబర్ 18న లోక్సభను రద్దు చేసినా పాక్షిక జమిలి ఎన్నికలకు 100 నుంచి 110 రోజుల గడువే ఉంటుంది. అం త తక్కువ సమయంలో ఇంత భారీ కసరత్తును పూర్తి చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలూ ఎదురవుతున్నాయి. నిజానికి ఇదంతా బీఆర్ఎస్ జాతీయ పార్టీగా విస్తరించకూడదన్న కుట్ర కోణం కనిపిస్తున్నది. దేశా న్ని మారుస్తానంటున్న తెలంగాణ సీఎంను తెలంగాణకే పరిమితం చేయాలన్న కుయుక్తులను దేశం గమనిస్తున్నదని గుర్తెరుగాలి.
– వెంకట్ గుంటిపల్లి 94949 41001