Pegasus Spyware | ఇజ్రాయెల్కు చెందిన ‘పెగాసస్’ నిఘా సాఫ్ట్వేర్తో కేంద్ర ప్రభుత్వం హ్యాకింగ్కు పాల్పడిందన్న ఆరోపణలకు తాజాగా బలం చేకూరింది. ప్రభుత్వ ప్రాయోజిత హ్యాకర్లతో దేశంలోని ప్రముఖుల ఐఫోన్లను లక్ష్యంగా చేసుకున్నారంటూ యాపిల్ సంస్థ నుంచి ముందస్తు అప్రమత్తతతో కూడిన హెచ్చరిక సందేశాలు అక్టోబర్లో వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇద్దరు భారతీయ జర్నలిస్టులు అనుమానించి తమ ఫోన్లను ల్యాబ్ పరీక్షలకు పంపగా, అవి ‘పెగాసస్ స్పైవేర్’ హ్యాకింగ్కు గురయ్యాయని అందులో తేలడం దిగ్భ్రాంతి కలిగించింది. తమ సెక్యూరిటీ ల్యాబ్ పరీక్షలో ఈ విషయం నిర్ధారణ అయిందని లాభాపేక్ష లేని అంతర్జాతీయ సంస్థ ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ’ ప్రకటించడం కలకలం రేపింది.
ఐఫోన్లకు పొరపాటున ముందస్తు హెచ్చరికలు వచ్చాయని యాపిల్ సంస్థ అప్పట్లో ఇచ్చిన వివరణ తప్పు అని ఈ ఘటనతో తేలిపోయింది. తమ నిఘా సాఫ్ట్వేర్ను కేవలం సార్వభౌమ దేశాల ప్రభుత్వాలకే విక్రయిస్తామని, వ్యక్తులకు, ప్రైవేట్ సంస్థలకు విక్రయించమని ఇజ్రాయెల్కు చెందిన పెగాసస్ సంస్థ స్పష్టంగా పేర్కొంది. భారత్కు చెందిన నిఘా విభాగం సైతం ఇదే సంస్థ నుంచి హార్డ్వేర్ను 2017లో కొనుగోలు చేసినట్టు మన దేశ వాణిజ్య గణాంకాల్లో వెల్లడైంది. ఈ నిఘా సాఫ్ట్వేర్ సాయంతో మన దేశంలోని ప్రముఖ విపక్ష సభ్యులు, అనుమానిత స్వపక్ష రాజకీయవేత్తలు, సామాజిక కార్యకర్తలు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేస్తున్నట్టు సంచలన కథనాలు వెలువడ్డాయి. వారి వ్యక్తిగత సంభాషణలు, గోప్యంగా ఉండాల్సిన ఇతర సమాచారాన్ని అధికార వర్గాలు భారతీయ చట్టాలకు వ్యతిరేకంగా సేకరించాయని 2021 జూలైలోఅంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
‘ది వైర్’ వార్తా సంస్థ వెబ్సైట్ ఎడిటర్ సిద్దార్థ్ వరదరాజన్, ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అండ్ కరప్షన్ రిపోర్ట్ ప్రాజెక్ట్ (ఓసీసీఆర్పీ) దక్షిణాసియా ఎడిటర్ ఆనంద్ మంగ్నాలే ఫోన్లను హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నారని ‘ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్’ సంస్థ కథనాల ద్వారా తెలుస్తున్నది.
ఈ వివాదాన్ని కప్పిపుచ్చేందుకు ఉద్దేశపూర్వకంగా భారత ప్రభుత్వమే యాపిల్ సంస్థపై ఒత్తిడి తీసుకువచ్చి తప్పుడు సందేశాలు ఇతర దేశాల్లోని యూజర్లకు కూడా వచ్చాయని చెప్పించిందని ‘వాషింగ్టన్ పోస్ట్’ పేర్కొంది. ‘భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లోని ఐఫోన్ యూజర్లకు ఇలా పొరపాటున అలర్టులు వెళ్లాయి’ అని యాపిల్ సంస్థ ఆనాడు చెప్పుకొచ్చింది. రాహుల్ గాంధీతో సహా పలువురు విపక్ష నేతలు, జడ్జీలు, సామాజిక కార్యకర్తల ఫోన్ల హ్యాకింగ్ ఉదంతం గతంలో పార్లమెంట్నూ కుదిపేసింది. ఇంత జరిగినా తాము స్పైవేర్ను కొనుగోలు చేయలేదు.. వినియోగించలేదు.. అని మోదీ ప్రభుత్వం ప్రకటించకపోవడం గమనార్హం. భారత రక్షణ నిఘా విభాగానికి చెందిన సిగ్నల్ ఇంటెలిజెంట్ డైరెక్టరేట్ గతంలో ‘కాగ్నెసైట్’ అనే సంస్థ నుంచి నిఘా పరికరాలు కొనుగోలు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.
ఏది ఏమైనా దేశ పౌరులు, విపక్ష నేతలు, న్యాయమూర్తులు, జర్నలిస్టుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించటం చట్టరీత్యా, నైతికంగా కూడా క్షమించరాని నేరం. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్ర ప్రభుత్వమే పూనుకోవటం సరైన పద్ధతి కాదు.
-డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్
98493 28496