కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరుతున్నది. పెత్తందారుల పడగనీడలో బీసీలకు మనుగడ లేదని మరోసారి రుజువైంది. నిర్లక్ష్యానికి గురయ్యానంటూ నిర్వేదంతో ఏకంగా మాజీ పీసీసీ అధ్యక్షుడే రాజీనామా చేయడం ఇందుకు నిదర్శనం. నడమంత్రపు నాయకత్వం నమ్ముకున్నోళ్లను నట్టేట ముంచుతున్నదని పొన్నాల లక్ష్మయ్య తన రాజీనామా లేఖలో పేర్కొనడం గమనార్హం.అధికార బీఆర్ఎస్ పార్టీలో సబ్బండ వర్ణాలకు తగిన గౌరవాదరాలు లభిస్తున్నాయంటూ, అందుకు భిన్నంగా కాంగ్రెస్లో బీసీ నాయకులను మూలకు పెట్టే దురాచారం నిక్షేపంగా సాగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో సేవచేసినవాళ్లను పక్కనబెట్టి ఎమ్మెల్యే టిక్కెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకుంటూ పార్టీనిబజారుకీడుస్తున్నారని రాజీనామా లేఖలో తన మనోగతాన్ని ఇలా పంచుకున్నారు.
శ్రీ మల్లికార్జున ఖర్గేఏఐసీసీ అధ్యక్షులు గారికి నమస్కారం.
అత్యంత బాధాతప్త హృదయంతో మీకు ఈ లేఖ రాస్తున్నాను. అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక సంస్థలో కీలకమైన ఇంజినీర్గా పనిచేస్తూ అప్పటి జాతీయ నాయకులు పీవీ నరసింహారావు పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన నేను ఆ పార్టీ క్రియాశీల కార్యకర్తగా చేరాను. సుమారు నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల కార్యకర్త నుంచి తెలంగాణ రాష్ట్ర తొలి పీసీసీ అధ్యక్షుల వరకు అనేకమైన కీలక పదవులను నిర్వహించాను.
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, సుమారు పన్నెండేండ్ల పాటు మంత్రిగా పనిచేయడం నేను మరువలేని జ్ఞాపకాలు. కానీ, ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు నన్ను తీవ్రంగా కలచివేస్తున్నాయి. 2015లో నన్ను పీసీసీ అధ్యక్ష పదవి నుంచి అకారణంగా తొలగించిన తర్వాత ఇప్పటివరకు దాదాపు తొమ్మిదేండ్లు ఎలాంటి పదవీ ఇవ్వకున్నా అనేక మాధ్యమాల ద్వారా నా గళం విప్పాను. 2014లో దేశవ్యాప్తంగా పార్టీ ఓటమిపాలైంది. అయినా తెలంగాణ ఓటమికి నేను కారణమని నన్ను బలిచేశారు. అదే 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చెందకున్నా నాటి నాయకత్వంపై చర్యలు తీస్కోకపోగా అదనంగా పదవులు కట్టబెట్టారు. నేను పార్టీ సిద్ధాంతాల ప్రచారం, బడుగు, బలహీనవర్గాల అంశాలను ఎత్తిచూపడం, పార్టీ బలోపేతానికి నా వంతుగా అహర్నిశలు కృషిచేస్తూనే ఉన్నాను. ఎంతమంది ఎన్ని రకాలుగా నాపై మాట్లాడినా నేను పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేశాను.
గత రెండేండ్లుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి పూర్తి భిన్నంగా, వ్యక్తిస్వామ్యం రాజ్యమేలుతున్నది. కాంగ్రెస్ పార్టీ భూమి పుత్రులుగా ఉన్న మాలాంటివారిని అవమానపరుస్తూ కొత్తగా వచ్చినవారికి పెద్దపీట వేస్తూ, అసలు సిసలైన సగటు కాంగ్రెస్ వాది నేడు పార్టీలో పరాయివాడిగా మారిపోయి, ఉనికి కోల్పోయే పరిస్థితి దాపురించింది. నేను గత రెండేండ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాల మీద పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడటానికి అనేక పర్యాయాలు అపాయింట్మెంట్ కోరాను. అయితే పీసీసీ అధ్యక్షుడు అపాయింట్మెంట్ ఇవ్వకపోగా, బయట ఎక్కడైనా కలిస్తే కనీసం నమస్కారం పెడితే, చూసి కూడా చూడనట్టు వ్యవహరించి మాట్లాడకుండా అవమానించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నిస్తే కనీసం ఒక్కసారి కూడా బదులు ఇచ్చిన సందర్భం లేదు. ప్రధానంగా నా వ్యక్తిగత అంశాలు పక్కనపెడితే కాంగ్రెస్ మూలసిద్ధాంతమైన సామాజిక న్యాయం ఇప్పుడు పాతరేయబడ్డది. సమాజంలో యాభై శాతం పైగా ఉన్న బీసీల పట్ల ఇక్కడ అత్యంత అవమానకరంగా వ్యవహరిస్తున్నారు. జనాభా ప్రకారం సీట్లు కావాలనడిగితే కనీసం చర్చించిన సందర్భాల్లేవు. బీసీలకు సీట్లను ఎగ్గొట్టడానికి దొంగ సర్వేలు చేస్తూ సీట్లను ఎగ్గొట్టి మీరు ఓడిపోయే అభ్యర్థులు అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. పార్టీలో లేని వ్యక్తులు గెలుస్తారంటూ వారికి టికెట్స్ కేటాయిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు.
అభ్యర్థుల ఎంపికలో అనేక అవకతవకలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. నాలాంటి ఒక సీనియర్ నాయకుడు పార్టీ అంశాలు చర్చించాలంటే నెలల తరబడి అపాయింట్మెంట్ కోసం వేచిచూడటం ఒక దురదృష్టకర పరిణామం. నేను ఢిల్లీకి వచ్చి పది రోజులు తిరిగినా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను కలుద్దామంటే కనీసం ఒక్క నిమిషం సమయం ఇవ్వలేదు. బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీట్లు కేటాయించాలని కోరేందుకు ఢిల్లీకి బీసీ టీమ్ నాయకులు 50 మంది వెళ్తే ఏఐసీసీ నాయకులు కలవడానికి కూడా సమయం ఇవ్వకపోవడం చాలా అవమానకరం. తెలంగాణ అంటే ఆత్మగౌరవానికి ప్రతీక.
ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అగ్రనాయకుల చుట్టూ బీసీలు తిరిగితే పార్టీ పరువు పోతుంది. 2001లో తెలంగాణ కోసం 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేసి పంపినవారిలో మొదటి సంతకం పెట్టిన వాణ్ణి నేను. తెలంగాణ కోసం నేను మొదటి నుంచి నా వంతు చిత్తశుద్ధితో పనిచేశాను. రాష్ట్రంలో పన్నెండేండ్లు మంత్రిగా అనేక శాఖలను నిర్వహించి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశాను. పార్టీలో అనేక పదవులను అత్యంత నిబద్ధతతో, క్రియాశీలకంగా, పార్టీ కోసం అంకితభావంతో 40 ఏండ్లుగా పనిచేసిన నాకే ఇంత అవమానం జరిగితే పార్టీలో సగటు బీసీ నేత పరిస్థితి ఊహిస్తేనే భయమవుతున్నది. ఎవరో డబ్బులిచ్చారని బీసీ నాయకులు పనికిరారు, వాళ్లు ఓడిపోయే వాళ్లంటూ టికెట్లు ఇవ్వకుండా పక్కన పెడుతున్నారు. డబ్బులు, భూములు, విల్లాలు, బంగారం ఇచ్చే కొత్తవారికి టికెట్లు ఇస్తూ పార్టీని ఒక వ్యాపార సంస్థగా మార్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తూ పార్టీని అమ్మకానికి పెట్టారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే వాళ్లు బజారులో గొడ్లను అమ్మినట్టు పార్టీ టికెట్లను అమ్ముకుంటున్నారు.
పార్టీలో జరుగుతున్న ఈ వ్యాపార రాజకీయాలతో తెలంగాణ సమాజంలో పార్టీ పరువు మట్టిలో కలిసిపోయింది. ఒకవైపు అధికార బీఆర్ఎస్లో చిన్న చిన్న బీసీ కులాలను కూడా గుర్తించి వారికి ఎంపీ, ఎమ్మెల్సీ, కార్పొరేషన్ పదవులు, పార్టీ పదవులు ఇస్తుంటే.. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్ష పదవులు నిర్వహించినవారికే అగ్ర నాయకుల అపాయింట్మెంట్ దొరకకపోవడం విడ్డూరం. దీంతో తెలంగాణ సమాజంలో కాంగ్రెస్ నాయకులంటేనే చిన్నచూపు అయింది. పార్టీలో గొప్ప గొప్ప సిద్ధాంతాలు రాసుకుంటాం. ఉదయపూర్ డిక్లరేషన్, రాయపూర్ ప్రకటనలు.. ఇలా ఎన్నో నిబంధనలు పెట్టారు. సీనియర్లను గౌరవిస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గుండెల్లో పెట్టుకుంటామన్నారు. కొత్తగా వచ్చినవారు ఐదేండ్లు పార్టీలో పనిచేస్తేనే పదవులన్నారు. ఒకే కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్నారు. డిజిటల్ మెంబర్షిప్ చేసిన వారికి, పార్టీ కోసం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. కానీ, నేడు పార్టీలో జాయిన్ కాకముందే టికెట్లను అమ్ముకుంటున్నారు. ఎవరో వ్యూహకర్త చెప్పిందే ఫైనల్ అంటూ, సర్వేల్లో మీ పేరు లేదంటూ ఒక అనామకుడు చెప్పింది వింటూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు.
ఇలాంటి దారుణమైన పరిస్థితిలో, పార్టీలో అవమానాలను భరిస్తూ మనుగడ సాగించలేమన్న ఆవేదనతో నేను పార్టీతో నాకున్న అనుబంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నాను. ఇంతకాలం పార్టీలో నాకు పదవులు ఇచ్చి ఆదరించిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మీ….
-పొన్నాల లక్ష్మయ్య
మాజీ పీసీసీ అధ్యక్షులు