భగవంతుడు ఎప్పుడూ దయామయుడే. భక్తులపై ఆయనకు ప్రేమ మాత్రమే ఉంటుంది. భక్తులు తప్పులు చేసినా పెద్దమనసుతో అనుగ్రహిస్తాడే కానీ, ఆగ్రహించడు. కానీ, భక్తులే తమ కోరికలు నెరవేరలేదని అప్పుడప్పుడు భగవంతుని తూలనాడుతూ ఉంటారు. అన్నాళ్లూ కలలో కూడా దేవుడున్నాడు అనుకునేవాడు.. తన కోరిక తీరకపోవడంతో కలడో! లేడో! అని సంశయిస్తాడు. భగవంతుడు మాత్రం తన భక్తుడి విశ్వాసంతో పనిలేకుండా అనుగ్రహ వృష్టిని కురిపిస్తూనే ఉంటాడు.
శ్రీమన్నారాయణుడికి ఆపన్న రక్షకుడు అనే పేరుంది. ఆయన భక్తులకు ఎక్కడేం కష్టం వచ్చినా అక్కడికి హుటాహుటిన వెళ్లిపోతాడని ఎన్నో పురాణగాథలు స్పష్టం చేస్తున్నాయి. గజేంద్రుడు ‘కావవే వరద!’ అని ఎలుగెత్తి పిలవగానే, సిరికి కూడా చెప్పకుండా తరలివచ్చాడు శ్రీహరి. విభీషణుడు శరణు వేడిన వెంటనే, సాధ్యాసాధ్యాలు కూడా ఆలోచించకుండా లంకకు రాజుగా అతనికి పట్టాభిషేకం చేశాడు రాముడు. ద్రౌపది వస్ర్తాపహరణ సమయంలో క్షణం ఆలస్యం చేయకుండా అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు. విశ్వాసంతో తనను కొలిచిన జంతువులకు కూడా మోక్షం ప్రసాదించాడు దేవుడు. నమ్మి కొలిచిన భక్తుడిని వమ్ముచేసిన దాఖలాలు ఉండవు. అపనమ్మకంతో ఆరాధించేవారి విషయంలోనే పరీక్షలకు గురిచేసి పరమపదం ప్రసాదిస్తాడు.
మనం తెలిసోతెలియకో పాపాలు చేయడం, తర్వాత వాటిని తొలగించమని భగవంతుడిని వేడుకోవడం సహజం. చేసిన దోషాలు పశ్చాత్తాపంతో దైవానికి నివేదించుకుంటే అవి తొలగిపోతాయని నమ్మకం. కానీ, పదే పదే పాపాలు చేస్తూ, దేవుడు చూసుకుంటాడులే అని భావిస్తే ఏ దైవమూ సాయంగా రాడు. ‘మూడు మునకలు వేస్తే చాలు ముక్తి లభిస్తుంది, కోటి దీపాలు వెలిగిస్తే స్వర్గం లభిస్తుంది’ అనుకుంటే పొరపాటు. సన్మార్గంలో ప్రయాణించడమే దైవానుగ్రహానికి తొలి అర్హత. అర్చనలు, తపస్సులు ఎన్నిచేసినా మనసు పాపకూపం అయితే, ఫలితం ఉండదు. అయితే, ఈ పాప పంకిలాన్ని దాటడానికి భగవంతుడే పలు మార్గాలు సూచించాడు. ఏ మంత్రాలూ రాకున్నా, పూజలు చేయలేకున్నా నిండైన మనసుతో భగవంతుడి లీలలు విన్నా, దేవుణ్ని స్మరించినా, కీర్తించినా మనసు పునీతమవుతుంది.
దైవాన్ని చేరుకోవటమే మనిషి జీవితానికి చివరి గమ్యం. ఆ దైవాన్ని చేరుకోవడానికి శక్తిలోపం లేకుండా మనం ఎంపిక చేసుకున్న మార్గంలో దైవాన్ని ఆరాధించటమే. శ్రవణ భక్తి నవవిధ భక్తి మార్గాల్లో ఒకటి. శ్రవణం అంటే వినటం. దైవం గురించి తన్మయత్వంతో వినటం కూడా భగవంతుడిని అర్చించినట్లే అవుతుంది. అయితే, ఆ మాటలను విని వదిలేయకుండా, అందులోని అంతరార్థం మనసుకు చేరాలి. అవి అంతరంగంలో ప్రతిధ్వనించాలి. అవి తప్ప మరేదీ వినటానికి మనసు అంగీకరించని స్థితికి చేరుకోవాలి. అప్పుడే మనం నిజంగా ‘శ్రవణం’ చేసినట్లవుతుంది.
సాధారణ భక్తులు కూడా ఆచరించగలిగే మార్గం భగవత్ కీర్తనం. దేవుడి గొప్పదనాన్ని నోరారా, మనసారా చెప్పటమే కీర్తనం. భగవంతుడి సుగుణాలపై ఆరాధనభావంతో మనసును ఆయనపైనే లగ్నం చేయడం ఇందులో ప్రధానాంశం. నిత్యం భగవంతుడి సుగుణాలను మనసులో తలుస్తూ, వాటి గురించే మాట్లాడుతూ ఉండటం వల్ల మనసు భగవంతుడిపై సులభంగా లగ్నం అవుతుంది. ఎప్పుడైతే దైవనామ సంకీర్తన చేస్తామో ఆ క్షణం నుంచే దైవానికి మరింత చేరువవుతాం. దేవుడి అనుగ్రహం పొందాలంటే స్మరణం మరొక మార్గం. ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దైవం గురించి తలచుకుంటూనే ఉండాలి. చివరికి నిద్రలో కూడా పరమాత్మను మర్చిపోలేని స్థితిని చేరుకోవాలి. అదే స్మరణ భక్తి. నారాయణ నామస్మరణ చేయకుండా నారదుడు, రామనామ స్మరణ లేకుండా హనుమంతుడు క్షణం కూడా ఉండలేరు. నిజమైన స్మరణ అంటే అదీ. ఎప్పుడైతే క్షణం కూడా విడిచిపెట్టకుండా దైవ నామస్మరణ చేసేందుకు ప్రయత్నిస్తామో అప్పటినుంచి దైవానికి మరింత సన్నిహితులమవుతాం. భగవంతుడి అనుగ్రహాన్ని అందుకుంటాం.
– కనుమ ఎల్లారెడ్డి
93915 23027