భారతదేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంట్ నూతన భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం అంటే ఈ దేశ ప్రజలు తమను తాము గౌరవించుకోవడమే అవుతుంది. మన దేశానికి దార్శనికునిగా, మార్గదర్శిగా భారత రాజ్యాంగం ద్వారా దిశా నిర్దేశం చేసిన అంబేద్కర్ను గౌరవించుకోవడానికి ఇంతకన్నా మంచి సందర్భమేముంటుంది. ఒకవైపు దేశ విదేశాలు, ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు అంబేద్కర్ సేవలను, త్యాగాలను కీర్తిస్తుంటే మన దేశాన్ని పాలిస్తున్నప్రభుత్వాలు ఆయనకు సమున్నత గౌరవాన్ని కల్పించడంలో నేటికీ విఫలమవుతున్నాయి.
1947 ఆగస్ట్ 15న మన దేశానికి స్వాతంత్య్రమైతే వచ్చింది కానీ దేశాన్ని పరిపాలించుకోవడానికి రాజ్యాంగ చట్టం అవసరమైంది. దీనికి న్యాయశాస్త్రం, శాసన నిర్మాణంలోనూ ప్రత్యేక ప్రతిభ ఉన్నవారు అవసరం. దానితో అప్పటి పెద్దలు అంబేద్కర్ తో రాజ్యాంగాన్ని రాయించేపనికి పూనుకున్నారు. మన రాజ్యాంగాన్ని దేశంలోని అనేక మతాలు, కులాలు, ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని అందరికీ అనుకూలంగా వ్రాయవలసి ఉన్నందున అంబేద్కర్ ఎంతో శ్రమించ వలసి వచ్చింది. అనేక దేశాలు ప్రాంతాలు అనేక సంప్రదింపులు, కాలమాన సామాజిక పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసిన ఆ మహనీయుడు రెండు సంవత్సరాల పదకొండునెలల పద్దెనిమిది రోజులపాటు అహోరాత్రులు శ్రమించి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని దేశానికి అందించారు. ఇందులో స్వతంత్రం, స్వేచ్ఛ, సమానత్వానికి పెద్దపీట వేశారు.
నూతన రాజ్యాంగం 1949 నవంబర్ 26 న ఆమోదించినట్టు రాజ్యాంగ సభ తెలిపింది. ఈసభలో డాక్టర్ అంబేద్కర్ సభ్యులందరినీ తన చూపుడు వేలుతో హెచ్చరిస్తూ ‘1950 సంవత్సరం జనవరి 26వ తేదీనుండి ఈ దేశరాజ్యాంగం అమలులోకి వస్తుంది. మన భారతదేశంలో రాజకీయంగా సమానత్వం ఏర్పడి ఉన్నప్పటికీ సాంఘిక ఆర్థిక,రంగాలలో అసమానత్వం నెలకొని ఉన్నది. ప్రజాస్వామ్య విరుద్ధమైన అసమానతలను వీలైనంత త్వరలో రూపుమాపనట్లయితే ఈ సాంఘిక ఆర్థిక ,అసమానతల ద్వారా బాధింపబడే ప్రజానీకంలో సహనం నశించిపోయి తిరుగుబాటు చేయడం తప్పదు. ఒకవేళ అలాంటిదే జరిగినట్లయితే ఎన్నో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన ఈ ప్రజాస్వామిక వ్యవస్థ తునాతునకలు అయిపోతుంది’ అన్నారు.
అంబేద్కర్ దేశాభివృద్ధికోసం సమగ్ర రాజ్యాంగాన్ని చట్టాలను రూపొందించారు . పాలన వ్యవస్థను ఎలా ఉండాలో రాజ్యాంగంలో నిర్దేశించారు. శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలు దారి తప్పితే న్యాయ వ్యవస్థ వాటిని గాడిలో పెట్టే విధంగా విధానాలను రూపొందించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే హక్కును ప్రజలకు కల్పించారు.
ప్రభుత్వాల బాధ్యత ఏమిటో ఆదేశిక సూత్రాలలో పొందుపరిచారు. భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించే విధంగా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారు.అంటరానితనం రూపుమాపేందుకు అనేకరకాల పౌర స్వేచ్ఛలకు రాజ్యాంగ హామీలు, రక్షణలు అంబేద్కర్ కల్పించారు. సామాజికంగా,ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి కారకులయ్యారు. దేశంలో ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ, ఉపాధి కల్పించాల్సిన బాధ్యతనీ ప్రభుత్వాలపైనే పెట్టారు. దేశంలో లభ్యమవుతున్న వనరులన్నీ ప్రజలందరికీ సమానంగా ఉండాలని కోరారు. ప్రజల విద్య,ఆరోగ్యం బాధ్యత ప్రభుత్వమే వహించాలని నిర్దేశిస్తూ ఒకే సంక్షేమ రాజ్యాన్ని ఆదేశిక సూత్రాలలో ఇమిడ్చిపెట్టినారు అంబేద్కర్.
దేశంలో అత్యంత అణచివేతకు గురవుతున్న మహిళల రక్షణ కోసం హిందూ కోడ్ బిల్లును తేవడం చారిత్రాత్మకం. దీనివల్ల మహిళలకు పురుషులతో సమానంగా విద్యా హక్కు ,ఆస్తి హక్కు కల్పించబడింది. కార్మికులు ఉద్యోగులకు సెలవుదినాల్లో జీతాలు ఇవ్వాలని, ఎనిమిది గంటల పని దినాన్ని, కనీస వేతనాల చట్టాన్ని, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు ఇంకా ఇతర రక్షణలు కల్పించారు. ముఖ్యంగా ఈ దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడంకోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపకల్పనకు కారకులయ్యారు. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు మూలమైన ఓటుహక్కు కుల మత వర్గాలకు అతీతంగా 18 సంవత్సరాలు నిండిన ఈదేశ ప్రతి పౌరుడికి ఉండాలని ఆ నాటి దేశ నాయకులతో పోరాడి సాధించారు. మరీ ముఖ్యంగా చిన్న రాష్ర్టాల ఏర్పాటును ఆర్టికల్-3లో స్పష్టంగా పొందుపరిచారు.
ఆయన రూపొందించిన రాజ్యాంగం స్ఫూర్తి గా చట్టసభలు ఏర్పడినప్పటికీ చట్టసభల ముందు కనీసం ఆయన విగ్రహాన్ని పెట్టాలనే సోయి పాలకులకు లేకుండా పోయింది. ఈ దేశ భారత పార్లమెంటు భవనానికి ఆయన పేరు పెట్టాలని యావత్ దేశం కోరుకుంటున్నది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. అంతటితో ఆగకుండా సీఎం కేసీఆర్ నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్నట్లుగా ప్రకటించి దేశానికే ఆదర్శంగా నిలిచారు. సమున్నత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పేరును కొత్త పార్లమెంటుకు పెట్టడం వల్ల ఈ దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేవిధంగా సగర్వంగా ఉంటుంది.
(వ్యాసకర్త: రాష్ట్ర అధ్యక్షులు, ఎస్సీ ఉప కులాల హక్కుల పోరాట సమితి)