పంజాబ్లో మరోసారి కలకలం రేగుతున్నది. 40 ఏండ్ల తర్వాత మళ్లీ రాష్ట్రంలో ఖలిస్థాన్ నినాదాలు బలంగా వినిపిస్తున్నాయి. అటు కశ్మీర్ కూడా నివురు గప్పిన నిప్పును తలపిస్తున్నది. ఇటీవల అక్కడ పర్యటించి వచ్చిన ఒక పాత్రికేయుడు.. అడుగడుగునా ఓ పోలీసు పహారా కాస్తున్నాడని చెప్పటం కశ్మీర్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో తెలుపుతున్నది. పాకిస్థాన్తో సరిహద్దును కలిగి ఉన్న, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ రెండు రాష్ర్టాల్లో ప్రశాంతత లేకపోవటం ముమ్మాటికీ కేంద్ర సర్కారు వైఫల్యమే.
పంజాబ్లో ఖలిస్థానీ వేర్పాటువాదం అమృత్పాల్సింగ్ రూపంలో మరోసారి తీవ్రంగా ముందుకొచ్చింది. లాహోర్ రాజధానిగా భారత్, పాకిస్థాన్లలోని పంజాబ్ రాష్ర్టాలను కలిపి ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలన్నదే ఖలిస్థానీ వాదుల లక్ష్యం. దేశ విభజన సమయంలో మొగ్గతొడిగిన ఈ డిమాండ్కు 60, 70 దశకాల్లో మద్దతు పెరిగింది. 80ల నాటికి ఉచ్ఛదశకు చేరుకొని సాయుధ మిలిటెన్సీ రూపాన్ని సంతరించుకుంది. దీనికి నాయకుడిగా భింద్రన్వాలే ఆవిర్భవించాడు. భారీ అనుచరగణంతో, ఆయుధాలతో పంజాబ్లో సమాంతర ప్రభుత్వాన్నే నిర్వహించాడు. స్వర్ణ దేవాలయాన్ని తన ప్రధాన కార్యాలయంగా మార్చుకున్నాడు. ప్రత్యర్థులను దారుణంగా హత్య చేయించాడు. ప్రభుత్వానికే సవాల్గా మారటంతో ఎట్టకేలకు ఇందిర సారథ్యంలోని కేంద్రప్రభుత్వం స్వర్ణదేవాలయం పైకి సాయుధ బలగాలను పంపించి, ఆపరేషన్ బ్లూస్టార్ను నిర్వహించింది. ఈ ఆపరేషన్లో భింద్రన్వాలేతోపాటు అనేక మంది హతమయ్యారు. దీనికి ప్రతీకారంగా నాటి ప్రధాని ఇందిరనే పొట్టన పెట్టుకున్నారు ఆమె అంగరక్షకులు. తదనంతరం జరిగిన సిక్కుల ఊచకోత నేపథ్యంలో పంజాబ్లో ఖలిస్థానీ వాదం పెరిగిపోయింది. యువత వేలాదిగా ఆ ఉద్యమంలో చేరారు. అది ఉగ్రవాదం తరహాలో మారటంతో పంజాబ్ అట్టుడికిపోయింది. దీంతో కేంద్రం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించి పాలనను స్వయంగా చేపట్టింది. నాడు కేంద్రంలో పీవీ నరసింహారావు సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. అయినప్పటికీ, పంజాబ్ను దారిలో పెట్టటానికి కృతనిశ్చయంతో పోలీసు శాఖకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఐపీఎస్ అధికారి కేపీఎస్ గిల్ సారథ్యంలో పంజాబ్ పోలీసులు ఖలిస్థానీ వేర్పాటువాదాన్ని అదుపు చేయగలిగారు. ఆ విధంగా పంజాబ్ను అతలాకుతలం చేసిన ఖలిస్థానీ వేర్పాటువాదం 1990ల మధ్య నాటికి సమసిపోయింది. పంజాబ్ అభివృద్ధి బాటన సాగింది. సాగులో అద్భుతాలు సృష్టించి దేశానికే ఆహారం పెట్టే రాష్ట్రంగా ఎదిగింది. అటువంటి పంజాబ్పై నాలుగు దశాబ్దాలు గడిచిన తర్వాత మళ్లీ ఉగ్రభూతం అలుముకున్నది.
‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ అధిపతిగా పగ్గాలు చేపట్టిన అమృత్పాల్ సింగ్ రాష్ట్రంలో ఖలిస్థానీ ఉద్యమాన్ని తిరిగి ప్రారంభించాడు. ఆరు నెలల కిందటి వరకూ అతడి గురించి ఎవరికీ తెలియదు. దుబాయ్లో తన బంధువుల ట్రాన్స్పోర్ట్ వ్యాపారంలో పని చేసేవాడు. సోషల్ మీడియాలో ఖలిస్థాన్ అనుకూల ప్రచారంతో ప్రభావితమై, దాని కోసం పని చేయటానికి పంజాబ్కు వచ్చేశాడు. చూస్తుండగానే ఆ 30 ఏండ్ల యువకుడు ప్రముఖ నాయకుడు అయిపోయాడు. తన అనుచరుడిని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించటానికి ఏకంగా పోలీసులపైనే దాడి జరిపించాడు.
ఇంత జరిగిన తర్వాతగానీ అతడిని పట్టుకోవటానికి పోలీసులు రంగంలోకి దిగలేదు. పంజాబ్తోపాటు ఢిల్లీ తదితర ప్రాంతాల్లో జల్లెడ పడుతున్నారు. అమృత్పాల్ దర్జాగా వీడియాలు విడుదల చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. అయినా కూడా ఇప్పటి వరకూ అతడిని పట్టుకోలేకపోయారు. అమృత్పాల్ సింగ్ దుబాయ్ నుంచి వచ్చి పంజాబ్లో కల్లోలాన్ని సృష్టించే వరకూ కేంద్ర నిఘావర్గాలు ఏం చేస్తున్నాయి? విపక్షాలను, వాటి పాలనలో ఉన్న రాష్ట్రప్రభుత్వాలను సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో అనునిత్యం వేధించటానికి ప్రయత్నించే కేంద్రం.. పంజాబ్ వంటి కీలక రాష్ట్రంలో ఇటువంటి ప్రమాదకర పరిణామాలు చోటుచేసుకుంటున్నా ఎందుకు పట్టించుకోలేదు? దేశభక్తి గురించి, దేశ భద్రత గురించి అనునిత్యం సుద్దులు చెప్పే బీజేపీ నేతలు దీనిపై ఏమంటారు? ఇది కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఫల్యం కాదా?
మరో సరిహద్దు రాష్ట్రం జమ్ముకశ్మీర్లోనూ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అక్కడి ప్రజల అభిప్రాయంతో సంబంధం లేకుండా మోదీ సర్కార్ ఆ రాష్ర్టాన్ని రెండుగా విభజించింది. అంతేగాక, రాష్ట్ర హోదా తొలగించి కేంద్రపాలితప్రాంతంగా మార్చింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత జనంలో గూడుకట్టుకొని ఉంది. కేంద్రంపై ఆగ్రహం అక్కడి పండిట్లపై వ్యక్తమవుతున్నది. ఉగ్రవాదులు రెచ్చిపోయి కశ్మీరీ పండిట్లను హత్య చేస్తున్నారు. కానీ, వారి రక్షణకు కేంద్రం సమర్థవంతమైన చర్యలు చేపట్టటం లేదు. లఢక్ను జమ్ముకశ్మీర్ నుంచి విడగొట్టి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చటంపై స్వయంగా లఢక్ వాసుల్లోనే వ్యతిరేకత పెరుగుతున్నది. ఇంతకుముందే బాగుండేది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా కశ్మీర్తో మోదీ సర్కార్ చేసిన ప్రయోగం రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది.
అంతర్గత భద్రత విషయంలో కేంద్రం వైఫల్యాలు ఈ విధంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆర్థిక రంగంలో, విదేశాంగ విధానంలో మోదీ ప్రభుత్వం చేతులు కాల్చుకున్నది. నోట్లరద్దు, జీఎస్టీ వంటి ఏకపక్ష విధానాలతో ఇటు ప్రజల్ని, అటు రాష్ర్టాలను ఆగం చేసింది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. నేటికీ ఆ నష్టాల ప్రభావం కొనసాగుతున్నది. విదేశాంగ విధానానికి సంబంధించి కూడా.. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ వంటి నిర్ణయాలతో అభాసుపాలైంది. అనేక అంతర్జాతీయ సూచీల్లో భారత్ ర్యాంకు ఏటా కిందికే పడిపోతున్నది. మోదీ హయాంలో భారత్ దేశీయంగా, అంతర్జాతీయంగానూ బలహీనపడింది. దేశాన్ని అభిమానించే వాళ్లెవరూ దీనిని హర్షించరు.
విపక్షాలను, వాటి పాలనలో ఉన్న రాష్ట్రప్రభుత్వాలను సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలతో అనునిత్యం వేధించటానికి ప్రయత్నించే కేంద్రం.. పంజాబ్ వంటి కీలక రాష్ట్రంలో ఇటువంటి ప్రమాదకర పరిణామాలు చోటుచేసుకుంటున్నా ఎందుకు పట్టించుకోలేదు?
కేవీ రవికుమార్