ఆర్థికవ్యవస్థను మెరుగుపరచటంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చాలా కీలకం. గ్రామీణ మౌలిక వనరులు సామాజిక, ఆర్థికవృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను పెంచటానికి అవసరమైన ఉత్పత్తి పరిస్థితులను అందిస్తాయి. అలాగే, దేశంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నగరీకరణ శరవేగంగా విస్తరిస్తున్నది. ఈ నేపథ్యంలో అటు గ్రామాలను, ఇటు పట్టణాలను సమగ్రంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థంగా అమలుచేస్తున్నది.
తెలంగాణలో గ్రామీణ మౌలిక వనరుల, సదుపాయాల అభివృద్ధిలో మెరుగైన పురోగతి సాధించటం సాధ్యమైందంటే అది ‘పల్లె ప్రగతి’ కారణంగా చెప్పవచ్చు. స్వరాష్ట్రం ఏర్పాటయ్యాక కనీస మౌలిక సదుపాయాలు ప్రతి పల్లెకూ చేరాయి. పల్లె ప్రగతిలో భాగంగా.. శిథిలావస్థకు చేరిన ఇళ్లు, ఇతర నిర్మాణాలకు మరమ్మతులు, ఉపయోగించని బావుల మూసివేత, పిచ్చిమొక్కలు తొలగింపు, కాలువలను శుభ్రపరచడం, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటి సంరక్షించడం, చెత్తను తొలగించడం, డంపింగ్ యార్డు ల ఏర్పాటు, వైకుంఠధామాల వంటి వాటితో మౌలిక సదుపాయాలు, పచ్చదనం, పారిశుద్ధ్యం మెరుగుపడ్డాయి. ప్రతినెలా వివిధ పనుల కోసం గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రూ.227.5 కోట్లు విడుదల చేస్తోంది. ఇటీవల ‘సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన’ ద్వారా, కేంద్రప్రభుత్వం గ్రామ పంచాయతీలకు దేశవ్యాప్తంగా ర్యాంకులను ప్రకటించింది. అందులో టాప్-20లో తెలంగాణలోని 19 గ్రామాలు ఉన్నాయంటే పల్లె ప్రగతి ఎంత విజయవంతం అయిందో తెలుస్తున్నది.
పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించి గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం చేపట్టిన పల్లెప్రగతి గ్రామాల్లో వాతావరణాన్ని మారుస్తున్నది. పొడి, తడి చెత్తను వేరు చేయడం, చెత్త ద్వారా వర్మీ కంపోస్టు తయారీ, నర్సరీల ఏర్పాటు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. 2019 నుంచి 2022 వరకు ఈ మూడేండ్లలో రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం రూ.16,070 కోట్ల నిధులు విడుదల చేసింది. పల్లె ప్రగతిలో చేస్తున్న అన్ని పనులకు ఆదరణ లభిస్తున్నది. ఈ కార్యక్రమం కింద చోటుచేసుకున్న అత్యుత్తమ ఫలితాలను యూనివర్సిటీ, ఉన్నత విద్యాసంస్థల విద్యార్థులు గ్రామాలను సందర్శించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది.
దేశ జనాభాలో పట్టణ జనాభా శాతం రోజురోజుకీ పెరుగుతున్నది. 2017లో ఇది 33.6 శాతం ఉంటే, 2020లో 34.93 శాతానికి పెరిగింది. గత ఏడాదికి 35.4 శాతానికి చేరుకుంది. ప్రపంచ జనాభాలో సగానికిపైగా నేడు పట్టణాల్లో నివసిస్తున్నారు. 2045 నాటికి ప్రపంచ పట్టణ జనాభా 1.5 రెట్లు పెరిగి 600 కోట్లకు చేరుకుంటుందని అంచనా. గత దశాబ్దంలో, మన దేశంలో పట్టణీకరణ దాదాపు నాలుగు శాతం పెరిగింది. చాలామంది వ్యవసాయ రంగాన్ని వదిలి సేవారంగంలోకి తరలి వస్తున్నారు.
నగరాభివృద్ధికి ‘పట్టణ ప్రగతి’ దోహదం: తెలంగాణలో పట్టణ జనాభా వేగంగా పెరిగి, జాతీయ సగటును అధిగమించింది. 20 22 నాటికి తెలంగాణలో పట్టణ జనాభా 46.8 శాతం. ఇది జాతీయ సగటు 34.7 శాతం కన్నా అధికం. తెలంగాణ ఆరోగ్య, కుటుంబ సంక్షేమం మంత్రిత్వశాఖ అంచనాల ప్రకారం.. దేశంలోని మిగిలిన రాష్ర్టాల కంటే వేగంగా మన వద్ద పట్టణీకరణ జరిగి, 2036 నాటికి రాష్ట్రంలోని పట్టణ వాసుల జనాభా 57.3 శాతానికి చేరుతుందని అంచనా. ఈ నేపథ్యంలో నగరాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమాన్ని ప్రారంభించి, ప్రతి నెలా అన్ని మున్సిపాలిటీలకు నిధులు అందజేస్తుంది. రక్షిత మంచినీటి సరఫరా కోసం అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టింది.
రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంచేందుకు 1,602 నర్సరీలను నెలకొల్పారు. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో ఎల్ఈడీ వీధి దీపాలు కూడా ఏర్పాటుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకీకృత కూరగాయలు, మాంసం మార్కెట్లు, మరుగుదొడ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. పట్టణాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు టీయూఎఫ్ఐడీసీ ద్వారా రూ.3,000 కోట్లు కేటాయించారు. వ్యర్థాలను ఎరువులుగా మార్చేందుకు 123 మున్సిపాలిటీల్లో రూ.276 కోట్లతో బయోమైనింగ్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పట్టణాల్లో కూడా వైకుంఠధామాలను నిర్మిస్తున్నారు. అర్బన్ డెవలప్మెంట్లో వివిధ రంగాలకు సంబంధించిన ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలున్నప్పటికీ.. ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం పట్టణాల మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది.
– కందగట్ల శ్రవణ్ కుమార్
86393 74879
(వ్యాసకర్త: సీనియర్ రీసెర్చ్ ఫెలో, కాకతీయ యూనివర్సిటీ, వరంగల్)