తెలంగాణ నీటి ప్రాజెక్టులను కేంద్రం గుంజుకుంటుందట.. తెలంగాణలో పారే నదుల మీద ఢిల్లీ పెత్తనం చేస్తానంటున్నది. కృష్ణా గోదావరి నదులపైన ఆనకట్టలు, ఎత్తిపోతలు వంటి ప్రాజెక్టులన్నీ తనకే ఇవ్వాలని కేంద్రం రాజపత్రం జారీచేసింది. ఆ ఆస్తులన్నీ నాకిచ్చెయ్. అప్పులు నువ్వుకట్టుకో అని ఆదేశిస్తున్నది ఢిల్లీ ఆ రెండు నదులపై అన్ని ప్రాజెక్టులను స్వాధీనం చేయాలని ఆదేశించడమే జూలై 15, 2021 నాటి ఢిల్లీ ప్రభువుల రాజపత్రం లక్ష్యం. ఇది కనీవినీఎరుగని దౌర్జన్యపు ఆదేశం. ఈ నదుల నీటి అజమాయిషీని ఢిల్లీ పాదుషాలు వారి అనుయాయులు ఏ విధంగా నిర్వహిస్తారు? ఈ ఆలోచనే లేదు.
పూర్తయిన ప్రాజెక్టులు ఆపుతారట..: ఒకవేళ ఏపీ, తెలంగాణ రెండు రాష్ర్టాల్లో ఈ దురాక్రమణ గెజిట్ను అమలుచేయగలిగితే అందువల్ల తీవ్ర జల సంక్షోభం వచ్చే ప్రమాదం ఉన్నది. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికి 9 ప్రాజెక్టులను చేపట్టింది, అందులో 4 దాదాపుగా పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా 36 లక్షల 53 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికి 7 లక్షల 53 వేల ఎకరాలకు నీరందుతున్నది. ఈ గెజిట్ ఆదేశాలు పాటిస్తే ఈ నాలుగే కాదు మొత్తం అన్ని ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోవాల్సిందే. మొత్తం రూ.70 వేల కోట్లతో ఈ ప్రాజెక్టులు నిర్మాణమవుతున్నాయి. అందులో 37 వేల కోట్లు ఇప్పటికే వెచ్చించారు. ఈ దశలో కేంద్రం ఈ ప్రాజెక్టులన్నీ నాకిచ్చేయ్, నోరుమూసుకొని పక్కకు తప్పుకో అంటే ఏమన్నట్టు? వాహనాలు, పనిముట్లు, కార్యాలయాలు, కాగితాలు, భవనాలు, ఉద్యోగులు అన్నీ వారికే అప్పగించాలట. ఈ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి తేలేకపోతే ఆపేస్తామంటూనే, వీటి నిర్వహణకు ఏడాదికి రూ.200 కోట్ల చొప్పున చెల్లించమని ఆదేశిస్తున్నదీ గెజిట్.
ఎక్కడికక్కడ నిలిపేస్తారట..: కేంద్రం అనుమతి లేని ప్రాజెక్టులను ఎక్కడికక్కడే నిలిపివేస్తారట. అంటే రూ.37 వేల కోట్లు పెట్టుబడులు పెట్టిన తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులిచ్చి వాటి ద్వారా జనానికి జలాలు అందేలా చూడాల్సిన బాధ్యత పక్కనబెట్టి, వాటిని స్వాధీనం చేసుకొని నిలిపివేస్తామనడం ఎంత అవివేకమైన మాట. ఇంత వింత ఆలోచన పాలకులకు రావడం ఆశ్చర్యకరం. ప్రాజెక్టులకు అనుమతులకు రాకపోవడానికి కారణాలు పరిస్థితులు వారికి తెలుసు. ఇవ్వడం కూడా వారి బాధ్యతే. ఆ బాధ్యత వదిలేసి, నువ్వే మా దగ్గరి నుంచి అనుమతులు తెచ్చుకో అనడం, లేకపోతే ప్రాజెక్టులు ఆగిపోతాయనడం శత్రువులైనా చేస్తారా? లక్షల ఎకరాలకు అందుతున్న నీటిని ఉన్నట్టుండి ఆపేస్తూ వచ్చే వ్యవసాయ, ఆర్థిక సంక్షోభాన్ని ఎవరు ఎదుర్కొంటారు? పూర్తయిన ప్రాజెక్టుల ద్వారా నీళ్లు రానివ్వరా?సగంలో ఆగిన ప్రాజెక్టులను అక్కడే ఆపితే ఎవరికి లాభం? వాటిపై పెట్టిన ఖర్చులు ఎవరు భరిస్తారు? అప్పులు తెచ్చి శరవేగంగా ప్రాజెక్టులు కట్టి, నీటి పారుదలకు కాలువలు తవ్వి, ఇక ఈ ప్రాజెక్టులు అనవసరం అని ఆపుకొంటారా? అప్పుడు ఆ అప్పులు ఎవరు తీర్చుతారు? తాగునీరు కూడా ఇవ్వరా? ఈ ప్రాజెక్టులు కేవలం సాగునీటి కోసమే కాదు. 12 జిల్లాలలో కోటి 80 లక్షల మందికి తాగునీరు కూడా ఇస్తున్నా యి. ఇవి ఆగిపోతే, తాగే నీళ్లు కూడా రావు. ఇంతెందుకు. మన భాగ్యనగరానికి తాగు నీళ్లిచ్చే ప్రాజెక్టులు కూడా ఆగిపోతే నగరవాసులకు తాగడానికి నీళ్లుండవు. అప్పుడు ఢిల్లీ నుంచి తాగునీటి ట్యాంకర్లు పంపిస్తారా?
ఆయా ప్రాజెక్టుల కోసం లక్షా 20 వేల ఎకరాల భూములకు నష్టపరిహారం ఇచ్చి సేకరించి పెట్టుకున్నారు. వీటిని ఏం చేయాలో గెజిట్లో లేదు. ఆమోదం పొందవలసిన ప్రాజెక్టుల్లో నిర్మాణమవుతున్నవి ఎన్నో ఉన్నాయి. వాటిపైన రూ.28 వేల కోట్లు ఖర్చుచేశారు. ఆమోదం పొందకుండా నిర్మాణం పూర్తయిన ప్రాజెక్టుల మీద రూ.8,734 కోట్లు వెచ్చించారు. పూర్తయిన ఈ సాగునీటి ప్రాజెక్టుల కింద 7.53 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ గెజిట్ ప్రకారం పూర్తయిన ప్రాజెక్టులు కూడా మూసివేయాల్సిందే.
కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డులు (కేఆర్ఎంబీ అండ్ జీఆర్ఎంబీ) అధికార పరిధిని నిర్వచించే సాకుతో నోటిఫికేషన్ జారీచేసిన కేంద్రం రాష్ర్టాలకున్న అన్ని అధికారాలనూ, వారి పాలనాశక్తిని గుంజుకుని వాటిని బోర్డులకు అప్పగిస్తుంది. కృష్ణా నదిపైన 35, గోదావరి పరిధిలోని 71 ప్రాజెక్టులపైన రాష్ర్టాలకున్న అన్నిరకాల అధికారాలను కేంద్రం మింగేసే గెజిట్ ఇది.
జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతలు, కోయిల్సాగర్ ఎత్తిపోతలు, మహాత్మాగాంధీ కల్వకుర్తి, ఏఎంఆర్పీ ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఆమోదాలు ఇంకా తీసుకోలేదు. దాదాపు రూ.11 వేల కోట్లు ఖర్చు చేశారు. 7.53 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు, శ్రీరామరాజు విద్యాసాగర్ రావు డిండి ఎత్తిపోతలు, శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ పథకం, ఉదయ సముద్రం ఎత్తిపోతలు, సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. రూ.28 వేల కోట్లు ఖర్చు చేశారు. 43 వేల 872 ఎకరాలు సేకరించారు.
ఇది అధికార పరిధి నిర్ణయమట..: రెండు తెలుగు రాష్ర్టాలకు తీవ్రమైన చిక్కులు తెచ్చిపెడుతూ జలశక్తి మంత్రిత్వశాఖ (నీటి వనరులు, నదుల అభివృద్ధి, గంగా పునరుజ్జీవ విభాగం) జులై 15న న్యూ ఢిల్లీ నుంచి నెం.ఎస్.ఓ.2842 (ఇ) పేరుతో ఒక నోటిఫికేషన్ను జారీచేసింది. ఏడేండ్ల తమ పాలనకు అనుగుణంగానే కేంద్రం ఇక్కడ తన అధికార పరిధిని నిర్ణయించింది. అంటే వారి ఉద్దేశం ప్రకారం ఇక్కడ ‘అధికార పరిధి’ అంటే అర్థం. హైడల్ జనరేషన్తో సహా అన్ని ప్రాజెక్టుల నిర్వహణను బదిలీ చేయడమే. బదిలీ మాత్రమే కాదు, మొత్తం ఈ ఆస్తులను ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి అపహరించి తన నియంత్రణలోకి తెచ్చుకుంటోంది. నదీజలాల నిర్వహణ బోర్డుల పేరుతో ఈ జలాక్రమణకు పాల్పడింది. ఈ రాజపత్రాలు ఉపసంహరించి, తెలుగువారి ఆనకట్ట, ఆయకట్టులు తెలుగువారికే అప్పగించాలనే తెలంగాణ పౌర సమాజం, అనేక పార్టీలు, సంస్థలు, ఇతర సంఘాలు, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఇటీవల డిమాండ్ చేశాయి. జీవనదులను, వాటిపై కట్టిన ఆనకట్టలను, వాటికింద నిర్మించిన ఆయకట్టులకు వేల కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి, నిలబెట్టుకోకుండా వదులుకోవాలా? ఇది ఆర్థిక వ్యవసాయిక విధానాలకు గొడ్డలిపెట్టు. అంతేకాదు రెండు తెలుగు రాష్ర్టాల సార్వభౌమత్వానికే అవమానం కాదా?
(ఇంకా ఉంది..)
-మాడభూషి శ్రీధర్ , 84476 51505