మెజారిటీ ఎంతన్నది కాదు భయ్యా… గెలిచామా లేదా అన్నది పాయింటు! కట్ చేస్తే.. మునుగోడు గెలిచాం, కానీ ఈ మొత్తం ఉప ఎన్నిక ఎపిసోడ్ వెనుక ఏం జరిగిందన్నది, ఎంత కుట్ర దాగి ఉందన్నది ఎంతమంది సాధారణ ప్రజానీకానికి తెలుసు?
మునుగోడు బైపోల్స్ హాష్ట్యాగ్ సోషల్ మీడియాలో దేశవ్యాప్తంగా ఎందుకని అంతగా ట్రెండింగ్ అయిం ది? ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా, గుంటూరు, భీమవరం, ఏలూరు, రావులపాలెం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాలు ప్రధాన కేంద్రాలుగా మునుగోడు ఉప ఎన్నిక గెలుపోటములపై సుమారు రూ. 3 వేల కోట్ల బెట్టింగ్ నడిచిందంటే ఎంత దిమ్మ తిరిగిపోవాలి? అక్టోబర్ 31కి ముందే ఆయా ప్రాంతాల నుంచి వచ్చి, గంటగంటకి మునుగోడు తాజా ట్రెండింగ్ ఫీల్డ్ రిపోర్ట్స్ను ఆయా ప్రాంతాలకు అందించారంటే నమ్మగలమా? టీ 20 మ్యాచ్ను మించిన ఫోకస్ ఈ ఒక్క ఉప ఎన్నిక మీదనే చట్ట వ్యతిరేక ఫంటర్స్కు రావడానికి కారణమేంటి?
దేశంలోని ప్రధాన మీడియా మొత్తం చూపు, దేశంలోని అన్ని రాజకీయ పార్టీల చూపంతా ఈ ఒక్క మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక వైపే గత కొద్దిరోజులుగా ఏ స్థాయిలో ఉందో మనమంతా చూస్తున్నాం. మునుగోడు ఉప ఎన్నికకు ఇంత ప్రాధాన్యం ఎందుకొచ్చింది? అసలక్కడ ఉపఎన్నిక ఎలా వచ్చిం ది? సిట్టింగ్ ఎమ్మెల్యే మరణించాడా? తెలంగాణ రాష్ట్ర సాధన వంటి ఒక శక్తివంతమైన కారణం కోసం ఏమైనా రాజీనామా చేశా డా? అలాంటి కారణాలతో ఉప ఎన్నిక వచ్చిందం టే ఒక అర్థం పర్థం ఉంటుంది. కానీ, మునుగోడు ఉపఎన్నిక అలా వచ్చింది కాదు.
ఇదొక కృత్రిమ ఉపఎన్నిక. దేశ ప్రయోజనాలు, ప్రజా సంక్షేమం, అభివృద్ధి వంటి అం శాల్లో అ, ఆలు తెలియనివారి పచ్చి రాజకీయ క్రీడకు ప్రతిరూపం ఈ ఉప ఎన్నిక. ప్రజల కోసం తాను అనుకున్నది సాధించడమే తప్ప మరొకటి తెలియని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిని ఢిల్లీ నుంచి మళ్లించడం కోసం వేసిన ఎత్తుగడ. కేసీఆర్ సృష్టించిన బీఆర్ఎస్ అన్న పదం పుట్టించిన వణుకు వల్ల వచ్చిన పనికిమాలిన ప్రతిస్పందన ఈ ఉప ఎన్నిక. అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ను నైతికంగా దెబ్బతీయాలన్న కుటిల ప్రయత్నం. మునుగోడులో గెలువడం ద్వారా తెలంగాణలో హల్చల్ సృష్టించి, ఇక తెలంగాణలో రాబోయేది మా ప్రభుత్వమే అని భారీ బిల్డప్లు ఇచ్చుకోవాలన్న దురాశ. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ శక్తి ఒక పాలపొంగు వంటిది. క్షేత్రస్థాయిలో టీఆర్ఎస్తో పోలిస్తే ఆ పార్టీకున్న కేడర్ దాదాపు శూన్యం. అయితే.. ఒక్కసారి కేసేఅర్ ఫోకస్ పెడితే పరిస్థితి ఎలా ఉంటుందన్నదానికి ఈ మునుగోడు ఉప ఎన్నిక ఒక తాజా ఉదాహరణ. కౌంటింగ్ ప్రారంభంలో ఒక రెండు, మూడు రౌండ్ల వరకు కొంత టెన్షన్ క్రియేట్ అయ్యే పరిస్థితిలా అనిపించింది. ఆ తర్వాత కూడా ఏదో ఇండియా-పాకిస్థాన్ టీ ట్వంటీ మ్యాచ్లా ఉంటుందా అని కూడా అనిపించింది. అయి నా సరే, టీఆర్ఎసే గెలుస్తుందని అందరికీ తెలుసు.
ఎప్పుడో మధ్యాహ్నం ఒంటి గంటవరకే మొత్తం డిక్లేర్ అవుతుందనుకున్నది దాదాపు సాయంత్రం వరకు కొనసాగింది. చివరికి అనుకున్నట్టే టీఆర్ఎస్ గెలిచింది. బీజేపీ కుట్రలన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి. అలా అట్టర్ఫ్లాపవుతాయని వాళ్లకు కూడా ముందే తెలుసు కాబట్టే ముందురోజు నుంచే ఆ శిబిరం నుంచి ఎలాంటి హడావుడి లేదు. నిజానికి ఇదంతా వోటింగ్కు ముందే తెలుసు కాబట్టే నడ్డా, అమిత్ షాల మీటింగ్స్ రద్దయ్యాయి.
ఎమ్మెల్యేల కొనుగోలు స్కామ్లో బయటపడిన ఆడియోలు, వీడియోలు, డేటా రికార్డు అన్నీ అబద్ధాలని మొత్తుకొన్న బీజేపీ, అదే మాటకు కట్టుబడి, ఫామ్హౌజ్లో పట్టుబడ్డ ఆ ముగ్గురి మీద కేసులు పెట్టి లోపల వేయించాలి. కానీ, అసలు విచారణే వద్దంటూ పరోక్ష ప్రయత్నాలు చేస్తుండటం సిగ్గుచేటు. ఎనిమిది రాష్ర్టాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను బీజేపీ కూలగొట్టడం ఒక ఎత్తు. కేసీఆర్తో పెట్టుకోవడం ఒక ఎత్తు.
బీజేపీకి, కేసీఆర్ ఇతర రాజకీయ ప్రత్యర్థులకు రాజకీయాలంటే ఒక గేమ్. కేసీఆర్కు రాజకీయాలంటే ఒక టాస్క్. రాజకీయాలే చేయాలనుకుంటే కేసీఆర్ను మించినోడు దేశంలో ఉన్నాడా? కట్ చేస్తే… గుజరాత్లో ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ బయల్దేరుతున్నారు. ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాలయం సిద్ధమైంది. డియర్ మోదీజీ, ముందుంది ముసళ్ల పండగ.
– మనోహర్ చిమ్మని
99895 78125
(వ్యాసకర్త: రచయిత, చలనచిత్ర దర్శకుడు)