దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా జట్టు కడుతున్న రాష్ర్టాలను లక్ష్యంగా చేసి అష్ట దిగ్బంధనం చేసినట్టే తెలంగాణ రాష్ట్రంపై కూడా కుట్రలు ఎక్కుపెట్టింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర మంత్రులు ఇక తెలంగాణపై మూకుమ్మడిగా దాడి చేయాలని నిశ్చయించుకున్నట్టుగానే స్పష్టం అవుతున్నది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం కామారెడ్డి పర్యటనలో తెలంగాణ ప్రభుత్వంపై విషం కక్కిన తీరుతో కేంద్ర వైఖరి మరోసారి తేటతెల్లమైనది. ఆడబిడ్డలను గౌరవించే సంప్రదాయం మెండుగా ఉన్న తెలంగాణలో నిర్మల సీతారామన్ తీరును మహిళా లోకం ఈసడించుకుంటున్నది.
కేంద్ర మంత్రి హోదాలో తెలంగాణ పల్లెల్లో ఎప్పుడూ పర్యటించని నిర్మలమ్మ ఉన్నపలంగా కామారెడ్డికి వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడి ఆమె పట్ల ఉన్న గౌరవాన్ని తనకు తానుగా తగ్గించుకున్నారు. తెలంగాణ పథకాలకు కేంద్రం నుంచి సాయం అందుతున్నదని అబద్ధాలు చెప్పారు. అంతేకాదు కేంద్ర పథకాలకు పేరు మార్చారని అసంబద్ధ వాదనలు చేసి అవాస్తవాలు, నిరాధార ఆరోపణలతో మోదీ సర్కారు తెలంగాణ వ్యతిరేక వైఖరిని మరోసారి బయటపెట్టుకున్నారు. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్లుగా కేంద్ర వైఖరి ఉన్నదని అందరికీ తెలిసిందే. కేంద్రం నుంచి ఏక్ అణా అందకపోయినా దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం ఎదుగుతున్నది. ఈ విషయాన్ని నిండు పార్లమెంట్ ఉభయ సభల సాక్షిగా పలువురు కేంద్ర మంత్రులు ఒప్పుకున్నారు. పలు పథకాలు భేష్ అని 20 మందికిపైగా కేంద్ర మంత్రులు కితాబిచ్చి అవార్డులతో సత్కరించారు.
అబద్ధాలతో గ్రామీణ అమాయక ప్రజల్ని మోసం చేసేందుకు నిర్మల సీతారామన్ శతవిధాలా ప్రయత్నించారు. ఆమె చెప్పిన అబద్ధాలేమిటి? అందులో వాస్తవమేంటో ఓసారి పరిశీలిస్తే… ప్రజల కోసం పాటుపడుతున్న, పైసలు ఖర్చుపెడుతున్న ప్రభుత్వం ఎవరిదో తెలిసిపోతుంది. ‘రేషన్ బియ్యంలో కేంద్రం వాటా ఎంత… ఎందుకు మోదీ ఫోటో పెట్టాలి?’ అంటే ఆమె దగ్గర సమాధానం లేదు. గొర్రెల పంపిణీకి కేంద్రం నిధులిస్తున్నదని మాయజేసే ప్రయత్నం చేశారు నిర్మల సీతారామన్. కానీ నిజానికి ఈ పథకానికి కేంద్రం నయా పైసా కూడా ఇవ్వడం లేదు. పథకం తొలినాళ్లలో రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పిన మోదీ సర్కారు తప్పించుకున్నది. ఇక చేపల పంపిణీకి కేంద్రం నిధులిస్తోందట. ఇది కూడా శుద్ధ అబద్ధం. వాస్తవమేమంటే ఈ పథకంలోనూ కేంద్రానికి భాగం లేదు. రాష్ట్రం ఎన్సీడీసీ నుంచి రుణం తీసుకుంటే.. కేంద్రం తానే డబ్బులిచ్చినట్టు చెప్పడం విడ్డూరం. తెలంగాణలో సముద్రం లేకపోయినా అక్వా రంగంలో కొత్త పుంతలు తొక్కుతూ చేపల ఉత్పత్తిలో అగ్రగామిగా ఉన్నది.
‘ఫసల్ బీమా యోజన’ అమలు చేయడం లేదంటూ చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి నిర్మల. మరి ఈ పథకాన్ని ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లోనే అమలుచేయడం లేదు. దీనికి సీతారామన్ దగ్గర సమాధానం లేదు. రైతు బీమాలో కౌలు రైతులకు అవకాశం లేదంటూ వితండవాదం చేశారు. మరి కేంద్రమే ఈ పథకాన్ని ఎందుకు చేపట్టలేదు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనూ చేపట్టలేదు ఎందుకో వాళ్లే జవాబివ్వాలి. వ్యవసాయరంగాన్ని బీజేపీ ఓ పక్క కార్పొరేటీకరణ చేస్తుంటే దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో 20 పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయి. ఉచిత నీరు. విద్యుత్ సహా రైతుబంధు ప్రతీ రైతు దరిచేరుతున్నది. రైతుబంధు పథకంతో పాటు రైతు ఆకర్షక పథకాలన్నీ ఒక్క తెలంగాణలో అమలవుతున్నాయని ఇటీవల జాతీయ రైతు సంఘ ప్రతినిధులూ కొనియాడారు. 26 రాష్ర్టాల ప్రభుత్వాలు కాళేశ్వరం సహా వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించి వెళ్లాయి. ఇప్పటికీ కేంద్ర బృందాలు వచ్చి వెళ్తూనే ఉన్నాయి. కేంద్రం ఇవాళ రైతుబంధు పథకాన్ని కాపీ కొట్టినా సరిగ్గా అమలు చేయలేకపోతోంది. అయినా రాజకీయ నోరు కాబట్టి ‘నరం లేని నాలుక’లా ఆమె వ్యవహరించి తెలంగాణ వ్యతిరేక భావజాలాన్ని చాటుకున్నారు. ఇక ఆయుష్మాన్ భారత్లో తెలంగాణ చేరడం లేదట. నిజానికి ఆయుష్మాన్ భారత్ కన్నా రాష్ట్ర ఆరోగ్యశ్రీతో ప్రజలకు ఎక్కువ ఉపయోగం. కానీ, కేంద్రం ఒత్తిడితో తప్పని పరిస్థితుల్లో రాష్ట్రం ఈ పథకంలో చేరిందన్న సంగతి వారికి గుర్తులేదు. కాళేశ్వరం ఖర్చు పెంచి, కేంద్రం నిధులిచ్చిందట. ఇందులోనూ ఏ మాత్రం నిజం లేదు. ఎందుకంటే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎన్నిమార్లు కోరినా కేంద్రం స్పందించలేదు.
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ఇప్పటిదాకా నయా పైసా సాయం చేయలేదని పార్లమెంట్ ఉభయసభల సాక్షిగా కేంద్ర జలశక్తి మంత్రి చాలా సార్లు చెప్పారు. అయినా రాజకీయ ఆరోపణలు చేయాలి కాబట్టి మోదీ, నడ్డా, అమిత్ షా, ఎవరూ వచ్చినా కాళేశ్వరంపై ఏడుపుగొట్టు వ్యాఖ్యానాలు చేసి వెళ్తున్నారు. ఇక ‘పీఎం ఆవాస్ యోజన’కు పేరు మార్చి అమలుచేస్తున్నారంటూ వితండవాదన చేశారు కేంద్రమంత్రి నిర్మల సీతారామన్. రాష్ట్రంలో ఒక్కో డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి రూ.8 లక్షలు ఖర్చవుతుంటే ఇందులో కేంద్రం రూ.1.5 లక్షలు మాత్రమే ఇస్తున్నది. ఈ వాస్తవాన్ని నిర్మలమ్మ ఎందుకు చెప్పలేదో ఆమెకే తెలియాలి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి హోదాలో ఆమె ఈ రాష్ర్టానికి ఏం చేసిందో చెప్పకపోగా ఎఫ్ఆర్బీఎంను మించి అప్పులున్నాయని చెప్తున్నది. ఇది పచ్చి అబద్ధం. రాష్ట్రం అప్పులు పరిమితిలోనే ఉన్నాయని కేంద్ర సంస్థలే చెప్పాయి. తెలంగాణకు పైసా సాయం చేయకపోగా సాక్షాత్తూ కేంద్ర మంత్రులే అబద్ధాలు చెప్పడంపై జనం మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కాషాయం పార్టీకి తగిన శాస్తి తప్పదని తేల్చిచెప్తున్నారు. తెలంగాణను ఏమాత్రం పట్టించుకోని బీజేపీకి కర్రు కాల్చి వాతపెడతామని జనం హెచ్చరిస్తున్నారు.
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ 4వ స్థానంలో ఉన్నదని విషం చిమ్మే ప్రయత్నం చేశారు నిర్మల. కానీ తెలంగాణ కన్నా ముందు బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్ణాటక ఉన్నది. దానికేమంటారు? ఇప్పటిదాకా సమాధానం లేదు. రుణమాఫీ చేయడం లేదంటూ నోటికొచ్చినట్టు మాట్లాడారు. కానీ కేంద్రంలోనిబీజేపీ సర్కారు రైతులకు రుణమాఫీ చేస్తున్నదా? ఆ సంగతి చెప్పాలంటే మాత్రం నోరు విప్పలేదు.