రాజకీయానికి, రాజనీతిజ్ఞతకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుం ది. మొదటిది తాత్కాలికమైంది. రెండోది దీర్ఘకాలికమైంది. మన రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఎక్కువ రోజులేం కాలేదు. ఇప్పటికీ రాష్ర్టానికి గుర్తింపులు, అవార్డులు వస్తూనే ఉన్నాయి. కొత్త ప్రభుత్వం ఇంకా పూర్తిగా కుదురుకోనేలేదు. ఇచ్చిన హామీలు ఎలా అమలు చేయాలా అని మల్లగుల్లాలు పడుతూనే ఉన్నది. నిధుల సమస్యపై సన్నాయినొక్కులు నొక్కుతూనే ఉన్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పరిపాలన ఇంకా గాడిలో పడనే లేదన్న మాట. ఈ నేపథ్యంలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిపై ప్రశంసలు కురుస్తుంటే ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు చూసీచూడనట్టు వ్యవహరించడం చర్చాంశమైంది. జనవరి మొదటివారంలో, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సుమారు నెల రోజులకు కేంద్రం నుంచి ఓ ప్రశంసాత్మక నివేదిక వెలువడింది. ఇంటింటికి మంచినీరు సరఫరాలో వంద శాతం లక్ష్యాన్ని సాధించిన పది రాష్ర్టాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలిచినట్టు ఓ నివేదిక విడుదల చేసింది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ ఆ తర్వాతి స్థానంలో ఉంది. ఇది రాష్ర్టానికి గర్వకారణమైన విషయం. కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథకు కేంద్రం పైసా ఇవ్వలేదు. అవార్డులు ఇచ్చి, ప్రశంసలు కురిపించి చేతులు దులిపేసుకున్నదనేది వేరే విషయం.
ఏదేమైనప్పటికీ ఇది కాంగ్రెస్ నెలరోజుల్లో సాధించిన విజయం కాదు. ఇది తెలంగాణ ప్రథమ ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఫలితం. మిషన్ భగీరథ కీర్తి కిరీటానికి మరో కలికితురాయి. రాష్ర్టానికి దక్కిన ఈ ఘనతను కాంగ్రెస్ ప్రభుత్వం చూసీచూడనట్టు వదిలేసింది. నిన్నటిదాకా దేశానికే ఆదర్శంగా ప్రభుత్వాన్ని నడిపినవారికి ఎక్కడ మంచిపేరు వస్తుందేమోనని అనుకొని ఉండవచ్చు. ఇక్కడ రాష్ట్రం ముఖ్యమనుకుంటే పార్టీ రాజకీయాలకతీతంగా ఇంటింటికి నల్లానీరు అందించాలన్న సంకల్పాన్ని ప్రశంసించి ఉండేవారు. అలా చేస్తే వారికీ మంచిపేరు వచ్చేది. విజయం సాధించినప్పుడు హుందాగా ఉండాలని పెద్దలు చెప్పిన మాటలు ఇక్కడ గుర్తుకురావడం సహజం. ఈ నివేదికకు కొంచెం అటూఇటుగా వెలువడిన భారత్ కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక రాష్ట్రం రాబడి గణనీయంగా పెరిగినట్టు వెల్లడించింది. ఈ విజయం కూడా ఇదివరకటి ప్రభుత్వం ఖాతాలోనిదే అని చెప్పక తప్పదు. ఆరేండ్లలో జీఎస్టీ వసూళ్లు 63 శాతం వృద్ధిని నమోదు చేశాయని కాగ్ నివేదిక లెక్కలతో సహా వెల్లడించింది. నిధుల్లేవని ఇల్లెక్కి కూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిమీదా పల్లెత్తు మాట్లాడలేదు. సొంత రాబడుల్లోనూ తెలంగాణ టాప్లో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో హర్యానా, గుజరాత్ తొమ్మిదో స్థానంలో నిలిచాయి. ఇదీ పదేండ్ల కేసీఆర్ పాలన ఫలితమే కదా.
ఎలక్ట్రానిక్ రంగ అభివృద్ధికి కామన్ ఫెసిలిటీ సెంటర్ (సీఎఫ్సీ)తోపాటు ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)ను మంజూరు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేసీఆర్ ప్రభుత్వం పదే పదే చేసిన విజ్ఞాపనల వల్లనే ఇది సాధ్యమైందనేది జగమెరిగిన సత్యం. జహీరాబాద్ నిమ్జ్ పారిశ్రామిక వాడలో కంపెనీల సందడి మొదలైంది. ఇది కేసీఆర్ ఆలోచనల్లోంచి పురుడు పోసుకున్నదే. తొమ్మిదేండ్లలో రాష్ట్రం తలసరి ఆదాయం, జీఎస్డీపీ వృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలంగాణ స్టేట్ ఎ గ్లాన్స్ పుస్తకం వెల్లడించింది. దీన్ని ప్రస్తుత ప్రభుత్వమే విడదల చేసింది. అదేం చిత్రమో కానీ ఖాళీ ఖజానా ఇచ్చి వెళ్లారని సన్నాయి నొక్కులు నొక్కేదీ వారే. నిన్నగాక మొన్న విడుదలైన నీతి ఆయోగ్ నివేదిక తెలగాణలో పేదరికం తగ్గిందని శుభవార్త చెప్పింది. గత తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో పేదల సంఖ్య 83 శాతం తగ్గిపోవడం కేసీఆర్ ప్రభుత్వ పాలనకు మెచ్చుతునక. ఇవన్నీ కూడా నిన్నటి కేసీఆర్ ప్రభుత్వ విజయాల కొనసాగింపులే. ఆయన దార్శనిక నాయకత్వానికి ప్రతిధ్వనులే. ఇలాంటి అవార్డులు గత పదేళ్లలో తెలంగాణ రాష్ర్టానికి కోకొల్లలుగా వచ్చాయి. ఇప్పటికీ వస్తున్నాయి. ఈ అవార్డుల వెనుక ఒక లోతైన ఆలోచన, అంతకుమించిన వివేచన, ఈ ప్రాంతంపై అం తులేని అధ్యయనం, అవధిలేని అభిమానం ఉన్నాయి. అందుకే తెలంగాణ విజయ దుందుభి మోగించింది. దేశంలోనే ఆదర్శ రాష్ట్రం గా పేరుగాంచింది. కానీ బట్టకాల్చి మీదేసి బద్నాం చేసేవాళ్లకు ఇలాంటివేవీ కనిపించవు. ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞత, పరిణతి చూపించి స్వరాష్ట్రం సాధించిన ప్రగతిని ఒప్పుకొంటే బాగుంటుంది. దానికి కర్తలెవరో చెప్తే మరింత బాగుంటుంది. ఇది నిజాలు ఒప్పుకున్నవాళ్ల నిజాయితీని తేటతెల్లం చేస్తుంది.