ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దార్శనికుడు, మహా మేధావి, పరిపాలనాదక్షుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర సచివాలయానికి తెలంగాణ ప్రాభవం, సంస్కృతి ఉట్టిపడేలా అత్యాధునిక సౌకర్యాలతో భవనం వుండాలని ఆయన సంకల్పించారు. ఆ విధంగా ఆయన ఆలోచనల నుంచి రూపుదిద్దుకున్నదే నూతన సచివాలయ భవనం.
సచివాలయం అనేది రాష్ట్ర పరిపాలనలో అత్యున్నతస్థాయి అధికార పీఠం. రాష్ట్ర పాలనకు సంబంధించిన అన్ని విధానపరమైన నిర్ణయాలు ఇక్కడే జరుగుతాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శులు ఇక్కడినుంచే పనిచేస్తుంటారు. మంత్రివర్గ సమావేశాలు ఇక్కడే జరుగుతాయి. ఇం తటి ప్రాధాన్యం ఉన్న సచివాలయం ఇంతకాలం అరకొర వసతులున్న భవనాల్లో కొనసాగింది. పాత సచివాలయంలో సరైన పార్కింగ్ స్థలమే లేదు.
ఆధునిక వసతులతో సమావేశ మందిరాలు, వీడియో కాన్ఫరెన్స్ హాళ్లు లేకపోవడంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం లేదు. అధికారులు, సిబ్బంది ఒక భవనం నుంచి మరొక భవనానికి వెళ్లడానికి అనువైన సౌకర్యాల్లేవు. ఉద్యోగులు ఫైళ్ల తరలింపులో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు. నేషనల్ బిల్డింగ్, గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాల్లేవు. అగ్ని ప్రమా దం జరిగితే అగ్నిమాపక శకటాలు భవనాల చుట్టూ తిరిగే అవకాశం లేదు. బయటికి పరిగెత్తి ప్రాణాలు కాపాడుకునే అవకాశం కూడా లేదు.
ఈ నేపథ్యంలోనే పాత సచివాలయ భవనాలను కూల్చివేసి, అత్యద్భుతంగా నూతన భవనాన్ని నిర్మించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. పాత భవనాలను 2020 జూలైలో కూల్చివేసి, కొత్త భవనం నిర్మాణాన్ని 2021 జనవరి నెలలో ప్రారంభించారు. సచివాలయ ప్రాంగణానికి పక్కనే స్టోన్ బిల్డింగ్గా పిలువబడే విద్యుత్శాఖ వారి భవనాన్ని కూడా కూల్చివేసి, 25 ఎకరాల స్థలాన్ని 28 ఎకరాలకు విస్తరించారు. కొత్త సచివాలయాన్ని 10,51,676 చదరపు అడుగుల విస్తీర్ణంలో 265 అడుగుల ఎత్తు తో, ఆరు అంతస్తుల్లో నిర్మింపజేశారు.
ఆరవ అంతస్తులో ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరాలు, 2 నుంచి 5 అంతస్తుల్లో మంత్రుల కార్యాలయాలు, ఒకటి, రెండు అంతస్తుల్లో సాధారణ పరిపాలన, ఆర్థిక శాఖ కార్యాలయాలు, 3 నుంచి 5 అంతస్తుల్లో ఇతర శాఖల కార్యాలయాలు ఏర్పాటుచేస్తారు. ముఖ్యమంత్రి, మంత్రుల వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సదుపాయం ఉంటుంది. ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా పార్కింగ్ సదుపాయం కల్పించారు. సచివాలయ నిర్వహణ, స్టోర్స్ మొదలైనవాటిని గ్రౌండ్ఫ్లోర్లో ఏర్పాటు చేస్తారు. భవనంపై సౌరఫలకాలను బిగించారు. సచివాలయంలో వినియోగించే లైట్లకు అవసరమైన విద్యుత్తును వీటినుంచే ఉత్పత్తి చేస్తారు.
సచివాలయం భవనంపై నాలుగు రకాలైన 34 డోమ్స్ను (గుమ్మటాలను) ఏర్పాటుచేస్తున్నారు. వీటిని ఏ, బీ, సీ, డీలుగా వర్గీకరించారు. ఏ-టైప్ డోమ్లు 23.6 అడుగులు, బీ-టైప్ డోమ్లు 31 అడుగులు, సీ-టైప్ డోమ్లు 21.6 అడుగులు, డీ-టైప్ డోములన్నింటికంటే పెద్దగా 54.8 అడుగుల ఎత్తుతో ఉంటాయి. అన్ని డోమ్ల నిర్మాణానికి 90 టన్నుల స్టీలును ఉపయోగించారు.
సుమారు రూ.500 కోట్ల ఖర్చుతో ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన కొత్త సచివాలయం దీర్ఘ చతురస్ర్తాకారంలో అత్యంత సుందరంగా రూపొందింది. మొత్తం 28 ఎకరాలున్న ఈ స్థలంలో భవనం నిర్మాణానికి 20 శాతం స్థలాన్ని మాత్రమే వినియోగించుకున్నారు. మిగిలిన స్థలంలో చెట్లను పెంచుతారు. పచ్చిక మైదానాలను ఏర్పాటు చేస్తారు. చెట్లకు, పచ్చిక మైదానాలకు, ఇతర అవసరాలకు కావలసిన నీటి కోసం సచివాలయ భవనం కింద రెండున్నర లక్షల లీటర్ల నీటి సామర్థ్యంతో మినీ రిజర్వాయర్ను నిర్మించారు. భవనం నలువైపుల నుంచి వాన నీటిని ఒడిసిపట్టి రిజర్వాయర్లోకి తరలించేందుకు ప్రత్యేక పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. సచివాలయ పైభాగంలో రెండు భారీ డోమ్లను నిర్మిస్తున్నారు.
ఒక్కొక్క డోమ్ 82 అడుగుల ఎత్తుతో (దాదాపు 8 అంతస్తులు), 52 అడుగుల వ్యాసంతో సచివాలయ భవనం తూర్పు, పశ్చిమ భాగాల్లో ఉంటా యి. ఇవి ప్రధాన ఆకర్షణ కానున్నాయి. డోముల లోపలి భాగాన్ని స్కైలాంజ్ తరహాలో రూపొందిస్తున్నారు. వీటిలో ఏర్పాటుచేసిన విశాలమైన గవాక్షాల నుంచి చుట్టూ నగరాన్ని వీక్షించే అవకాశం ఉన్నది. భారీ డోమ్లపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన నాలుగు సింహాల స్తూపాలను ఏర్పాటుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అద్భుతమైన సృజనాత్మక మేధకు నిదర్శనం కొత్త సచివాలయం. తెలంగాణ రాష్ట్ర పరిపాలన చరిత్రలో దీని ద్వారా ఒక నూతన అధ్యాయం ఆవిష్కృతం కానున్నది.
కోలేటి దామోదర్: 98491 44406
(వ్యాసకర్త: రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్)