తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని కుల సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఎలాంటి ధర్నాలు, దీక్షలు చేయలేదు. ప్రజల గుండె చప్పుడు తెలిసిన రాష్ట్ర ప్రభుత్వం ఎవరూ అడగకముందే నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పేరు పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది. మరొక అడుగు ముందుకు వేసి తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతున్నట్లు ప్రకటించింది. ఇది అంబేద్కర్ పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న గౌరవానికి నిదర్శనం.
తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ హర్షం వ్యక్తం చేస్తున్నది. నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టేలా కేంద్ర ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఒత్తిడి తేవాలి. కోట్లాది దళిత, బహు జనుల గుండె చప్పుడు అంబేద్కర్ అన్న విషయం అందరికీ తెలిసిందే. వాస్తవానికి ఆయన దేశ ప్రజలందరికీ మార్గ నిర్దేశకుడు. ఆయన భారత దేశానికే కాదు ప్రపంచానికే రత్నం లాంటి వారు. దళితుల హక్కుల కోసం అంబేద్కర్ పోరాటం చేయడానికి ముందు వరకూ దళితుల పరిస్థితి దయనీయంగా ఉండేది. వారు ఊరికి దూరంగా నివసించేవారు. అలాంటి వారు నేడు సమాజంలో మనుషులుగా గుర్తింపు పొందుతున్నారన్నా, ఆర్థిక స్వావలంబన సాధించారన్నా, రాజకీయాల్లో ఉనికి చాటుతున్నారన్నా వాటన్నింటికీ కర్త, కర్మ, క్రియ బాబాసాహెబ్ అంబేద్కరే.
1927లో అంటరాని కులాలకు సాంఘిక హక్కులు సాధించేందుకు అంబేద్కర్ ఉద్యమం మొదలుపెట్టారు. దళితులకు 1930లో రాజకీయ, ఆర్థిక హక్కులను కల్పించాలని ఉద్యమించారు. స్వేచ్ఛ, సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ఆయన చేసిన ఉద్యమాలు సత్ఫలితాలను ఇచ్చాయి. బ్రిటన్లో జరిగిన మూడు రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంటరాని కులాల వారికి మనుషులుగా జీవించే ప్రాథమిక హక్కు కావాలని వాదించి వాటిని సాధించిన పోరాట యోధుడు అంబేద్కర్. దళితులు మంచి నీటి చెరువుల్లో మిగతా కులాల వారితో సమానంగా తాగునీరు తాగేందుకు అర్హులేనని అంబేద్కర్ ఆనాడే తెలిపారు. ఇందుకోసం 1927లో మహద్ సత్యాగ్రహాన్ని నిర్వహించి విజయం సాధించారు. నిమ్న వర్గాలకు చదువు విలువను బోధించి వారు ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించారు.
పేదలు, ధనికులు అనే తేడా లేకుండా దేశ పౌరులందరికీ ఓటు హక్కు కల్పించిన సమతావాది అంబేద్కర్. భారత రాజ్యాంగ నిర్మాతగా, బడుగు, బలహీన వర్గాల బానిస బతుకుల ముక్తి ప్రదాతగా అంబేద్కర్ ఎప్పటికీ గుర్తుండి పోతారు. ఆయన దళిత పోరాటాలకే పరిమితం కాదు. ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు. జ్ఞాన సాగరుడు. చరిత్రకారుడు, న్యాయ కోవిదుడు, రాజనీతిజ్ఞుడు, విద్యావేత్త, ఆర్థిక వేత్త, మంచి వక్త. ప్రజాస్వామ్యం పట్ల ఆయనకు ఎనలేని విశ్వాసం ఉండేది. వీటన్నింటినీ మించి అంబేద్కర్ మానవతావాది. హిందూ కోడ్ బిల్లు విషయంలో మహిళల అభ్యున్నతి కోసం తాను చేసిన సవరణలను ప్రభుత్వం ఆమోదించకపోవడంతో అందుకు నిరసనగా కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన త్యాగశీలి అంబేద్కర్. ఇప్పటివరకు స్త్రీల సమస్యల పట్ల మంత్రి పదవికి రాజీనామా చేసిన వ్యక్తులు ఈ దేశంలో లేరు. భారత దేశానికి ప్రణాళికలు, పరిశ్రమల అవసరాన్ని గుర్తించి ఎన్నో విలువైన సూచనలు చేసిన దార్శనికుడు అంబేద్కర్. దేశ కార్మిక చట్టాల రూపకల్పనలో ఆయన పాత్ర ఎంతో కీలకం.
ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఆయన ఆధునిక భారతదేశ చరిత్ర మీద చెరిగిపోని ముద్ర వేశారు. అలాంటి మహనీయుని పేరు నూతన పార్లమెంట్ భవనానికి పెట్టి భారత దేశ ప్రతిష్ఠను పెంచాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. అమానవీయ పరిస్థితులు రాజ్యమేలుతున్న కాలంలో కూడా ఒక దళిత కుటుంబంలో జన్మించిన వ్యక్తి ఉన్నత చదువుల సాయంతో, స్వయంకృషితో పైకి ఎదగవచ్చని నిరూపించిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్.
ఆయన జీవించి ఉన్న కాలంలో దేశంలోని ఏ రాష్ట్రం ఆయన ప్రతిభను గుర్తించి గౌరవించలేదు. కానీ నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆయన ప్రతిభను గుర్తించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం 12 జనవరి 1953లో అంబేద్కర్కు గౌరవ డాక్టరేట్(డి.లిట్) ఇచ్చి గౌరవించింది. తర్వాత మళ్లీ దాదాపు 70 ఏండ్ల తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన పేరును రాష్ట్ర సచివాలయానికి పెడుతున్నట్లు ప్రకటించింది. అంబేద్కర్ను గౌరవించే విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శం, అనుసరణీయం.
– దాసరి లక్ష్మయ్య
99086 81727
(వ్యాసకర్త : ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు)