శాంతి, ఐక్యతల సందేశమైన మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీగా జరుపుకొంటారు. మిలాద్ అంటే జననం, నబీ అంటే ప్రవక్త. అరబ్బీ భాషలో ఈద్-ఏ- మిలాద్ ఉన్ నబి అంటే ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ జన్మదిన సందర్భంగా జరుపుకొనే పండుగ అని అర్థం.
ముస్లిం సోదరులు అత్యంత భక్త్తీశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకొంటారు. ఈ రోజున మసీదుల్ని అందంగా అలంకరిస్తారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మసీదుల్లో మహమ్మద్ ప్రవక్త ప్రాశస్త్యాన్ని, జీవిత చరిత్ర, జీవనశైలి గురించి వివరిస్తారు. మత ప్రవక్త మహమ్మద్ను స్మరించుకుని ఆయన చూపిన బాటలోనే నడిచేందుకు ప్రతి ముస్లిం సంకల్పం తీసుకుంటారు. ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో తులతూగాలని ప్రార్థిస్తారు.
ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లింల కోసం కాదని సర్వ కోటి జీవరాశులకు ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని ఖురాన్లో తెలిపారు. విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏదీ తెలియజేయరు. తాను అల్లాహ్ ద్వారా ఏది వినేవారో దాన్నే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేక దైవ గ్రంథాల్లో వివరించారు. మరో సాక్ష్యం ఏమిటంటే మహమ్మద్ ప్రవక్త అక్షరాస్యత తెలియని వారు. ఇది అల్లాహ్ మహిమ. పవిత్ర ఖురాన్ను దైవవాణి రూపంలో ప్రవక్తను అవతరింపజేసి తన శక్తిని సర్వ మానవాళికి తెలియజేశారు. అందుకే విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళి జీవనశైలికి హితోపదేశాలు అయ్యాయి.
అల్లాహ్కు అత్యంత ప్రీతి పాత్రులైన మహమ్మద్ ముస్తాఫా సలై అలాసల్లంకు క్రీస్తు శకం 571లో మక్కాలో మహమ్మద్ ప్రవక్త జన్మించారు. ఇస్లాం క్యాలెండర్లోని మూడో నెల రబీవుల్ అవ్వల్లో ప్రవక్త జన్మించారు. ఏకోపాసన, మానవులంతా ఒక్కటేనని తారతమ్యాలు లేవని అంతా అల్లాహ్ దా సులేనని ప్రబోధించారు. శాంతి, సహజీవనం, దానం, దైవభీతితో మెలగాలని బోధించారు. ప్రపంచమంతటా ఆయన పుట్టిన రోజును పండుగలా చేసుకుంటారు.
ఇస్లాం సంప్రదాయం ప్రకారం పుట్టిన రోజు, పెండ్లి రోజులను వేడుకలుగా జరుపుకోకూడదు. కానీ భారతదేశంలో మాత్రం ప్రవక్త పుట్టిన రోజున ఆయనను స్మరించుకుంటూ ప్రార్థనలు నిర్వహిస్తారు. దేశంలోని ముస్లింలు తమ పండుగలను ఇస్లాం క్యాలెండర్ను అనుసరించే జరుపుకొంటారు. అయితే, ప్రత్యేక పండుగలతోపాటు దర్గాలలోని మతపెద్దల పుట్టినరోజు లేదా వారి వర్ధంతిని ఘనం గా జరుపుకొనే ఆచారం ఉన్నది. ఈ రోజున ముస్లింలు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించి, మత ప్రవక్త మహమ్మద్ను స్మరించుకుని ఆయన చూపిన మార్గంలో నడుస్తామని సంకల్పం తీసుకుంటారు.
మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా రాత్రి ళ్లు ఆధ్యాత్మిక సభలు, ప్రవక్త కీర్తనలు నిర్వహిస్తారు. వేకువజామున అంటే ఫజర్ నమాజ్ తర్వాత అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ముస్లింలతో పాటు హిందువులు కూడా ఎంతో పవిత్రంగా అ న్నదానాలు నిర్వహించడం ప్రత్యేకత. ఇది మత సామరస్యానికి నిదర్శనం. భారత దేశం ఐకమత్యానికి ఆదర్శం అనడం అతిశయోక్తి కాదు. మరోవైపు గంగా జమునా తెహజీబ్ తెలంగాణలో వెల్లివిరుస్తున్నది. ఈ సారి గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబీ ఒకేరోజు రావటంతో మిలాద్ ర్యాలీ ని ముస్లిం మత పెద్దలు వాయిదా వేసుకున్నారు. ఇదీ మత సామరస్యమంటే..
(నేడు మిలాద్ ఉన్ నబీ)