‘చూడు చూడు నల్లగొండ గుండె మీద ఫ్లోరైడు బండ… బొక్కలొంకర పోయిన బ్రతుకుల మా నల్లగొండ’ అంటూ ఫ్లోరైడ్ రక్కసికి బలైన జీవితాలను ఉమ్మడి రాష్ట్రంలో చూశాం. నాడు ప్రధానిగా ఉన్న బీజేపీ అగ్రనేత వాజ్పేయి కూడా ఈ సమస్యను చూసి పరిష్కరించలేకపోయారు. కానీ కేసీఆర్ మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీటిని అందించి ఫ్లోరైడ్ బాధల నుంచి విముక్తి కల్పించారు.
ఇలాంటి చరిత్ర కలిగిన నల్గొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గంలో ఉప ఎన్నికకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కారణమయ్యారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం ఆయన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని రాజగోపాల్రెడ్డి చెబుతున్నారు. కానీ గతంలో ఆయన అన్న మాటలను పరిశీలిస్తే ఆయన విశ్వసనీయత ఏమిటో తెలుస్తుంది. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని,అభివృద్ధి సాధ్యమైందని గతంలో ఆయనే స్వయంగా మెచ్చుకున్నారు. ఇంకో సందర్భంలో ‘బీజేపీ తెలంగాణకు ప్రమాదకరం.ఆ పార్టీని ప్రజలు నమ్మడం లేదు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఆరు నెలల తర్వాత తాను విమర్శించిన పార్టీలోనే చేరి ఉప ఎన్నికల బరిలో దిగారు. తాను మెచ్చుకున్న కేసీఆర్ చేసి న అభివృద్ధి పనులనే విమర్శిస్తున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి చాలాకాలం నుంచి ప్రజాప్రతినిధిగా ఉంటున్నారు. కానీ జిల్లాలోని ఫ్లోరైడ్ సమస్య పరిష్కారానికి ఎలాంటి ప్రయత్నం చేయలేకపోయారు. కానీ ప్రజాప్రతినిధిగా ఉన్న కాలంలో తన వ్యాపారాలను మాత్రం బాగా అభివృద్ధి చేసుకున్నారు. ఇలాంటి రాజకీయ నాయకులకు బీజేపీ గాలం వేస్తున్నది. వారితో రాజీనామా చేయించి ఉపఎన్నికల ద్వారా రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తున్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టడాన్ని జీర్ణించుకోలేని బీజేపీ ఆయనను తెలంగాణకే పరిమితం చేయాలని కుట్ర పన్నుతోంది. అందులో భాగంగా మునుగోడు ఉప ఎన్నికను ప్రజలపైన రుద్దింది. ఈ నేపథ్యంలో అప్రజాస్వామిక పాలనతో రాష్ర్టాల హక్కులను హరిస్తున్న బీజేపీ వికృత క్రీడలను అడ్డుకునేందుకు కేసీఆర్ సమాయత్తమయ్యారు. ఆయనకు మునుగోడు ప్రజలు మద్దతుగా నిలవాలి.
నాడు బీళ్లుగా ఉన్న భూముల్లో నేడు నీళ్లు పారించి పచ్చని పంటలకు కారణమయ్యారు సీఎం కేసీఆర్. ‘మిషన్ భగీరథ’ అమలు చేసి దశాబ్దాల ఫ్లోరైడ్ రక్కసిని తరిమికొట్టారు. ఇటీవల కాలంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ వల్ల ఒక్క అంగ వైకల్యం కేసు కూడా నమోదు కాలేదంటే దానికి కేసీఆర్ చిత్తశుద్ధే కారణం. సాగునీటి సమస్యను పరిష్కరించి రైతుల ఆత్మహత్యల నివారణకూ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారు. ఈ విషయాన్ని మునుగోడు ప్రజలు గమనించాలి. విజ్ఞతతో ఓటేయాలి.
– తెలంగాణ విజయ్
94919 98702