వైద్యో నారాయణో హరిః అనే స్థితి నుంచి వైద్యులు- రోగుల బంధువులకు మధ్య గొడవలు పడే పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు నాడిపట్టి సకల వ్యాధులను నిర్ధారణ చేయడమే కాదు, రోగుల యోగక్షేమాలు, వారి కుటుంబ స్థితిగతులు వైద్యులు అడిగి తెలుసుకునేవారు. రోగులు వైద్యుడిని ఆత్మబంధువులా భావించి, తమ పొలాల్లో పండిన వాటిని ప్రేమగా ఇచ్చేవారు. వైద్యులు కూడా వాళ్ల నుంచి డబ్బులు పెద్దగా ఆశించేవారు కాదు.
ఒకప్పటి ఈ మానవతానుబంధం కనుమరుగై, డబ్బే ప్రపంచమై పోయిన తర్వాత అన్ని సంబంధాలూ మాసిపోయాయి. వైద్యం ఖరీదైపోయింది. వ్యాధి నిర్ధారణకు బోలెడన్ని పరీక్షలు, వాటి కోసం కోట్ల రూపాయల విలువ చేసే పరికరాలు దిగాయి. చికిత్స పద్ధతులు కూడా గణనీయంగా మారాయి. రోజుకో కొత్త వ్యాధి పుట్టుకొస్తున్న ఈ ఆధునిక యుగంలో వాటికి చికిత్స చేయడానికి కార్పొరేట్ ఆసుపత్రులే దిక్కవుతున్నాయి.
135 కోట్లకు పైగా జనాభా ఉన్న మన దేశంలో వైద్యు లు మాత్రం 18 లక్షల మందే. దీంతో ఒక్కో వైద్యుడు రోజుకు కనీసం 70-80మంది రోగులను ఓపీలో చూడా ల్సి వస్తున్నది. శస్త్రచికిత్సలు చేసే నిపుణులైతే, ఒక్కొక్కరు రోజుకు మూడు, నాలుగేసి ఆపరేషన్లు చేస్తున్నారు. ఈ ఒత్తిడిలో వైద్యులు రోగులకు వెచ్చించే సమయం తగ్గిపోతున్నది. వచ్చినవారు చెప్పేది వినే పరిస్థితి లేక, వారి సమస్యను బట్టి పరీక్షలు రాయడం, వాటి ఫలితాలను బట్టి మందులు రాసివ్వడం, అవసరమైతే శస్త్రచికిత్సలకు పంపడం- ఇదీ నడుస్తున్న చరిత్ర. రోగితో, వాళ్ల బంధువులతో పది నిమిషాలు మాట్లాడేంత తీరిక, ఓపిక వైద్యులకు ఉండటం లేదు. దీంతో రోగులకు- వైద్యులకు మధ్య సత్సంబంధాలు ఉండటం లేదు.
వైద్యంలో ఏదీ నూటికి నూరుశాతం కచ్చితత్వంతో ఉండదు. వివిధ కారణాల వల్ల కొన్ని సందర్భాల్లో చికిత్స వల్ల ఫలితం ఉండకపోవచ్చు. రోగి పరిస్థితి అప్పటికే బాగా విషమించి ఉండొచ్చు. అలాంటప్పుడు రోగి మరణిస్తే, వారి బంధువులు ఆవేశానికి లోనవుతున్నారు. అనేక సందర్భాల్లో చాలా చోట్ల వైద్యుల మీద దాడిచేసిన ఉదంతాలు చూస్తూనే ఉన్నాం. డాక్టర్ చేసిన చికిత్స వాళ్లకు నచ్చకపోతే వెంటనే గూగుల్ రివ్యూల దగ్గర నుంచి సామాజిక మాధ్యమాల్లో పోస్టింగుల వరకు పెట్టేస్తున్నారు. కన్నుమూసి తెరిచేలోపు ఇది దావానలంలా వ్యాపించి ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోతున్నది. అప్పుడు వైద్యులు, ఆసుపత్రుల వైపు నుంచి నష్టనివారణ చర్యలు మొదలుపెట్టినా ప్రయోజనం ఉండట్లేదు.
ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం రోగులతో, వారి కుటుంబాలతో డాక్టరు సత్సంబంధాలు కలిగి ఉండటం. ఇది అనుకుంటే వచ్చేది కాదు. వ్యవస్థాగతంగా వైద్య విధానంలో మౌలికమైన మార్పులు రావాల్సి ఉన్నది. ఆశించిన మేర చికిత్సా ఫలితాలు పొందాలంటే దవాఖా నల్లో మౌలిక వసతులు, వనరులు ఉండాలి. అవి లేనిచోట రోగికి సరియైన న్యాయం జరుగుతుందని ఆశించలేం. ఈ పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని వాటిలో డాక్టర్లు తమ విజయాలతోపాటు విఫలమైన కేసులలో తమవైపు నుంచి ఎలాంటి కృషి జరిగిందో చెప్పడం ఈ రోజుల్లో చాలా అవసరం. దానికంటే ముందు రోగులు, వారి బంధువులతో సత్సంబంధాలు నెరపడం కూడా ముఖ్యమే. అదే జరిగితే రోగులు, వారి బంధువులు కూడా కొంత అర్థం చేసుకునే అవకాశముంటుంది. మాట్లాడితే ముత్యాలు రాలిపోతాయన్నట్లుగా ఉండటం ఎక్కడైనా పనికొస్తుందేమో గానీ, వైద్యరంగంలో మాత్రం కాదు. ఈ విషయాన్ని వైద్యులు గుర్తించాలి. చికిత్సా విధానం కన్నా వైద్యుడు రోగితో మాట్లాడే, వ్యవహరించే తీరుతోనే సగం రోగం నయం అవుతుందన్నది అందరూ గ్రహించాల్సిన సత్యం.
టేక్మాల్ శ్రీకర్ రెడ్డి
(వ్యాసకర్త: కో-ఫౌండర్, హైదరాబాద్ హెల్త్ కేర్; నేషనల్ కౌన్సిల్ మెంబర్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా)