‘యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః’
ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో, గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేది మన సనాతన భారతీయ ధర్మం. కానీ ఈ సనాతన భారతీయ ధర్మానికి విఘాతం కలిగిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది.
విశ్వ యవనికపై త్రివర్ణ పతాకం ఎగురవేసి దేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చిన వినేశ్ ఫొగట్, సాక్షి మాలిక్ తదితర మహిళా రెజ్లర్ల పట్ల మోదీ ప్రభుత్వం ప్రవర్తిస్తున్న తీరు సామాజిక నేరం. జరిగిన తప్పును సరిదిద్దకపోగా తప్పుచేసిన వారిని మోదీ ప్రభుత్వం సమర్థిస్తూ మరింత పాపానికి ఒడిగడుతున్నది. నాడు ఒలింపిక్స్లోనూ, ఇతర అంతర్జాతీయ స్పోర్ట్స్ ఈవెంట్స్లోనూ పతకాలు సాధించి దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేసిన మహిళా రెజ్లర్లు.. నేడు రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్సింగ్ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, తాము ఆ దుర్మార్గుడి బారినపడ్డామని కన్నీళ్లు పెట్టుకుంటే వారి కన్నీళ్లు తుడవకపోగా కనీసం వారికి జరిగిన అన్యాయాన్ని వినే పరిస్థితిలో కూడా ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వం లేకపోవడం దురదృష్టకరం.
బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ యూపీ నుంచి బీజే పీ ఎంపీ. ఆరుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. తండ్రి స్థానంలో ఉండాల్సిన పెద్దమనిషి కీచకుడిలా మారి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని మహిళా రెజర్లు నడివీధిలో కన్నీళ్లు పెట్టుకుంటే.. కనీసం ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు ముందుకురాలేదు.
బ్రిజ్ భూషణ్ ఏడెనిమిది నియోజకవర్గాలను ప్రభావితం చేసే నాయకుడని, ఆయనపై చర్యలు తీసుకోలేమని చెప్పారు. ఆఖరికి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేసే పరిస్థితి లేదు. అసలు నేరపూరిత స్వభావం ఉన్న బ్రిజ్ భూషణ్ను రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ ఎలా చేశారు? లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన తర్వాత ఇంకా ఆ పదవిలో ఎలా కొనసాగిస్తున్నారు? సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు అరెస్టు చేయడం లేదు? మోదీ చెప్తే తాను రాజీనామా చేస్తానని బ్రిజ్ భూషణ్ నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కానీ మోదీ నోరు విప్పడం లేదు? అసలు ఈ విషయంలో మోదీ ఎందుకు మాట్లాడటం లేదు? ఆయనకు ఉన్న ఇబ్బంది ఏమిటి? ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లాలా?
కరువు ఉపశమన ప్యాకేజీ, రుణమాఫీ చేయాలని కోరుతూ గతంలో కొన్నిరోజుల పా టు తమిళనాడు రైతులు చచ్చిపోయిన పాములను నోట్లో పెట్టుకొని, కపాలాలు మెడలో వేసుకొని, తమ మలమూత్రాలను తామే భుజించి నిరసన తెలిపితే మోదీ ప్రభుత్వం కనీసం స్పం దించలేదు. నల్ల రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడిన రైతుల ఆవేదనను అర్థం చేసుకోకపోగా నిరసన తెలిపినవారిపై కార్లు ఎక్కించి చం పించింది. దాదాపు ఏడు వందల మంది రైతులను పొట్టన పెట్టుకొని పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. కతువా, ఉన్నావ్లలో జరిగిన రేప్ ఉదంతాలు దేశాన్ని అతలాకుతలం చేసినప్పటికీ, మోదీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా దున్నపోతు మీద నీళ్లు పడ్డట్టు వ్యవహరించింది. దేశంలోని అనేక సమస్యలను చూసీచూడనట్టుగా వ్యవహరిస్తు న్న మోదీ.. ఇప్పుడు దేశానికి తలమానికంగా నిలిచిన మహిళల విషయంలో కూడా అదే ధోర ణి కనబరుస్తుండటం సిగ్గుచేటు.
తమకు అన్యాయం జరిగిందని చెప్తున్నవారు ఏ అనామకులో కాదు, దేశ ప్రతిష్ఠను ఖండాంతరాల్లో చాటిన రెజ్లర్లు. వాళ్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో సామాన్యులు, అభాగ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఒలింపియన్లు అయిన రెజ్లర్లు రోజులు తరబడి నిరసన కొనసాగిస్తున్నా.. ప్రధాని స్పందించకపోవడం ఆయన అహంకారానికి పరాకాష్ఠ. నిరసన తెలుపుతున్న రెజ్లర్లు పదవులు కావాలని కోరడం లేదు, ఉద్యోగాలు అడగటం లేదు. భారత సమాజంలో సాధారణంగా తమపై లైంగిక వేధింపు జరిగిందని మహిళలు చెప్పుకోలేరు. అలాంటిది, ధైర్యంతో ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని గురించి బహిరంగంగా చెప్తే… ఆ అన్యాయానికి కారణమైన బ్రిజ్ భూషణ్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? బీజేపీ నాయకులు లైంగికంగా వేధించినా తప్పులేదా? వారికి చట్టం వర్తించదా? బీజేపీ నాయకులకు దేశంలో ప్రత్యేకమైన చట్టాలున్నాయా?
‘భారత మాతా కీ జై’ అంటూ భరతమాతపై రాజకీయాలు చేసే బీజేపీకి మహిళా రెజ్లర్లు భరతమాతల్లా కనిపించడం లేదా? వారికి మెడల్స్ వస్తే దేశ్ కీ బేటీ అని ట్వీట్ చేసి ప్రచారం కల్పించుకునే మోదీ.. వారు న్యాయం చేయమని అడిగినప్పుడు వాళ్లు ఈ దేశానికి చెందినవారే కాదనే రీతిలో ఎందుకు వ్యవహరిస్తున్నారు.
‘బేటీ బచావో బేటీ పడావో’ అంటారు.. కానీ వారు ప్రపంచ మల్లయుద్ధాన్ని గెలిచివస్తే.. ఇక్కడ పాలక బీజేపీ ఎంపీ నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కోవడం ఏమిటి? ‘బేటీ బచావో బేటీ పడావో’ అంటే ఇదేనా? కర్ణాటక ఎన్నికలపై ఉన్న సోయి కన్నీళ్లు కారుస్తున్న మహిళల పట్ల లేకపోవడం, వాళ్ల జీవితం ఛిద్రమవుతున్నా పట్టించుకోకపోవడం మోదీకే చెల్లింది. ఇలాంటివాళ్లు ‘బేటీ బచావో’ అంటే నమ్మాలా? తమకు న్యాయం చేయండని కోరుతున్న మహిళా రెజ్లర్లకు న్యాయం చేయకపోగా.. బీజేపీ వాట్సప్ యూనివర్సిటీల ద్వారా సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి పాల్పడుతూ, మహిళా రెజ్లర్ల ఫొటోలతో అసభ్య పోస్టులను ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సిగ్గుచేటు. బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రంలో గత ఐదేండ్లుగా 40 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని ఎన్సీఆర్బీ (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) నివేదిక ఇచ్చింది. మహిళలకు రక్షణ లేని గుజరాత్లో రాముడి పేరు మీద రాజకీయాలు చేస్తూ, రావణ రాజ్యం కొనసాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి.
గూండాలు, రౌడీలున్నారని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అక్రమమైన ఎన్కౌంటర్లు చేస్తున్నది. మరి ఆయనకు బ్రిజ్ భూషణ్ చేస్తున్న నేరాలు కనిపించడం లేదా? రామరాజ్యం అంటే ఇదేనా? రామరాజ్యం అని చెప్తున్న బీజేపీ బ్రిజ్ భూషణ్, కుల్దీప్సింగ్ సెనగర్ లాంటి క్రిమినల్, రేపిస్టులకు ఎంపీ సీట్లు ఎలా ఇస్తుంది? బిల్కిస్ బానో లాంటి మహిళలను రేప్ చేసిన వాళ్లకు బహిరంగంగా సత్కారాలు చేసే బీజేపీ వైఖరి హేయం.
కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తూతూ మంత్రంగా కమిటీని ఏర్పాటుచేసి, ఈ వ్యవహారాన్ని అణచివేయాలని ప్రయత్నించారు. ఎంపీ మేరీకోమ్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు జరిగిం ది. ఆరోపణపై కమిటీ విచారణ జరిపి కేంద్రాని కి నివేదిక అందజేసింది. ఆ నివేదిక ఇంకా బహిర్గతం కాలేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభు త్వం తప్పుచేసిన వారికి కొమ్ము కాసేవిధంగా వ్యవహరిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష కూడా వారికి అండగా ఉండకపోగా, మహిళా రెజ్లర్స్ చేస్తున్న నిరసన దీక్ష వల్ల, దేశ ప్రతిష్ఠ దిగజారుతుందని మాట్లాడటం బీజేపీ నీచ రాజకీయాలకు నిదర్శనం.
మహిళల పట్ల మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న దుర్మార్గమైన తీరును దేశమంతా ఖండించాలి. బీఆర్ఎస్ బాధిత మహిళలకు అండగా నిలిచింది. తెలంగాణ సీఎం కేసీఆర్, మం త్రి కేటీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ క్రీడాశా ఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ , ఎంపీ నామా నాగేశ్వర్రావు, వెంకటేష్ నేత, వద్దిరాజు రవి తదితరులు ఢిల్లీలో వారి దీక్షా శిబిరం వద్దకు వెళ్లి సం ఘీభావం తెలిపారు. రెజ్లర్ల పక్షాన బీఆర్ఎస్ ఎలుగెత్తి పోరాడుతున్నది. వారికి న్యాయం జరిగేవరకూ మోదీ చేస్తున్న తప్పిదాన్ని ఎత్తిచూపుతూనే ఉంటుంది.
(వ్యాసకర్త: బీఆర్ఎస్ నాయకులు)
-డాక్టర్ శ్రవణ్ దాసోజు
98850 39384