ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ నిర్మాణ అంశాన్ని స్పష్టంగా పొందుపర్చారు. ఏపీలో పోలవరానికి నాటి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలు ముంపునకు గురయ్యాయి. కాగా, ఖమ్మం జిల్లాకు ఊరడింపుగా బయ్యారం ఉక్కు పరిశ్రమను ఇస్తామని పునర్వ్యవస్థీకరణ చట్టంలో చేర్చింది. ఆ హామీని నేరవేర్చడంలో బీజేపీ నేతృత్వంలోని నేటి కేంద్రం విఫలమై బిక్కమొహం వేసింది.
పునర్వ్యవస్థీకరణ చట్టంలోని 13వ క్లాజులో ఖమ్మం జిల్లాలో 30 వేల కోట్లతో ప్రభుత్వ రంగ సంస్థ ‘సెయిల్’ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన ప్రక్రియను 6 నెలల్లో ప్రారంభిస్తామని కూడా అందులో పేర్కొన్నారు. అప్పటి నుంచి టాస్క్ఫోర్స్, విజిలెన్స్ కమిటీలను వేస్తూ, సర్వేలు చేస్తూ కాలయాపన చేస్తూ వచ్చారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై నిత్యం విషం చిమ్ముతూనే ఉన్నది. బయ్యారం ఉక్కు ప్లాంట్ ఏర్పాటు, నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభం ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి ఇప్పుడవి సాధ్యం కావని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రకటించడం విడ్డూరం. మోసపూరిత వాగ్దానాలు, అసమర్థ పాలనతో ప్రజలను నమ్మిస్తూ కేంద్రం దేశాన్ని అంధకారంలోకి నెట్టేస్తున్నది. ఇప్పటికైనా మోదీ సర్కార్ నిర్ణయం మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటాయి.
తెలంగాణ బీజేపీ నాయకులు రాష్ర్టానికి ఒక్క ప్రాజెక్టునైనా తెచ్చారా? ఐటీఆర్, రైల్వేకోచ్ ఫ్యాక్టరీ పోగొట్టారు. గిరిజన యూనివర్సిటీకి దిక్కు లేదు. పునర్విభజన చట్టంలోని అనేక సమస్యలను ఇంకా పరిష్కరించలేదు. మీరు ఇదే మాట అప్పుడే చెప్తే మేమన్నా ఫ్యాక్టరీ కట్టుకునేవాళ్లం. ఎనిమిదేండ్ల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఇప్పుడు ‘బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధ్యం కాదు’ అని చెప్పడం ఆయన చేతకానితనానికి పరాకాష్ట. తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వివక్షకు ఇది మరో ఉదాహరణ.
గత ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్నో బూటకపు మాటలు చెప్పారు. నమ్మశక్యం కాని వాగ్దానాలు చేసి జనాలను బురిడీ కొట్టించడం బీజేపీ నైజం. ఇప్పుడది నిజమైంది. నిజాం చక్కెర ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని వాగ్దానం చేసిన కేంద్రం, దానిని కూడా అటకెక్కించింది. వేలాది మంది రైతుల బతుకుల్లో నిప్పులు పోసింది. ఉక్కు ఫ్యాక్టరీ, నిజాం చక్కెర ఫ్యాక్టరీ వల్ల తమకు ఉపాధి దొరుకుతుందని ఎంతో మంది రైతులు, కార్మికులు సంబురపడ్డారు. వారి ఆశలను కేంద్ర ప్రభుత్వం అడియాసలు చేసింది. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు దక్కిన రాజ్యాంగబద్ధ హామీ అయిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ఇవ్వకుండా తెలంగాణను దారుణంగా వంచించింది.
బయ్యారంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు అన్ని వనరులున్నా తెలంగాణ ప్రజానీకానికి మళ్లీ నిరాశే మిగిలింది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో అపార ఇనుప ఖనిజం విస్తరించి ఉన్నది. ఖమ్మం జిల్లాలోని బయ్యారం, గార్ల, నేలకొండపల్లి మండలాల్లో ఇనుప ఖనిజం ఉంది. 56,690 హెక్టార్ల (1,41,691 ఎకరాలు)లో ఇనుప ఖనిజం నిక్షిప్తమై ఉన్నట్లు ‘సర్వే ఆఫ్ ఇండియా’ గతంలోనే గుర్తించింది. ఇక్కడి ఇనుప ఖనిజం విలువ సుమారు రూ.700 కోట్లు ఉంటుందని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా ఇనుప ఖనిజ నిల్వల్లో 12 శాతం బయ్యారంలోనే ఉన్నట్లు నిర్ధారించింది. గూడూరు, భీమదేవరపల్లి, బయ్యారం, గార్ల, నేలకొండపల్లిలో లభించే ఇనుప ఖనిజంలో బయ్యారానిదే అగ్రస్థానం.
మిగతా ప్రాంతాల్లో కంటే ఇక్కడే 80 శాతం ఎక్కువగా నిక్షిప్తమై ఉన్నది. బయ్యారంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటుచేస్తే నిరంతరాయంగా 30 ఏళ్లు కొనసాగే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇక్కడి ముడి ఖనిజం నాణ్యత లేకపోతే ఛత్తీస్గఢ్లోని బైలడిల్లా నుంచి తరలించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు స్పష్టం చేసింది. అయినప్పటికీ కేంద్రం వెనుకడుగు వేస్తున్నది. బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కావలసిన అన్ని వనరులున్నాయి. ఉక్కు కర్మాగారానికి నాలుగు టీఎంసీల నీరు అవసరం. సీతారామ ప్రాజెక్టులో భాగంగా బయ్యారం పెద్దచెరువును బ్యాలెన్స్ రిజర్వాయర్గా మార్చితే ఏడాదంతా రెండు టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది. పరిశ్రమకు అనువైన స్థలం కూడా ఉన్నది. బయ్యారం మండలం ధర్మాపురం రెవెన్యూ పరిధిలోని 452 సర్వే నంబర్లో 4 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అందులో కర్మాగారానికి 2200 ఎకరాలు మాత్రమే అవసరం. బయ్యారంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేస్తే రవాణా ఖర్చు చాలావరకు తగ్గుతుంది.
సౌత్ సెంట్రల్ రైల్వే మార్గం పక్కనే ‘గార్ల’ మండలంలో ఉన్నది. అయినా స్టీల్ప్లాంట్ ఏర్పాటుపై కేంద్రం వివక్ష చూపుతు న్నది. ఏడేండ్లుగా ప్రతిసారి బడ్జెట్లో మొండిచేయి చూపుతున్నది. ఏపీలోని విశాఖలో నీటి ఆధారంగా స్టీల్ప్లాంట్ ఏర్పాటుచేసింది. అక్కడ సహజ సిద్ధమైన అడవులు లేకపోయినా ప్లాం ట్ ఏర్పాటుకు సాహసం చేసింది. అన్ని వనరులున్న బయ్యారంలో ప్లాంట్ ఏర్పాటుచేస్తే అంతకు రెట్టింపు లాభాలు వచ్చే అవకాశమున్నది. ఇక్కడి ఖనిజం నాణ్యత 45 ప్లస్ అని నిపుణులే తేల్చినప్పటికీ కేంద్రం వెనుకడుగు వేయడంపై ఏజెన్సీ ప్రజలు ఆగ్రహిస్తున్నారు. నాడు వలస పాలకుల కుట్రలకు బయ్యారం బలైంది. నేడు కేంద్ర ప్రభుత్వ వివక్షకు గురవుతున్నది.
– పువ్వాడ అజయ్కుమార్
(వ్యాసకర్త: రాష్ట్ర రవాణాశాఖ మంత్రి)