ప్రధాని మోదీ హయాంలో మితిమీరిపోతున్న ప్రైవేటీకరణ చివరికి తపాలాశాఖను కూడా తాకింది. ఎంత దూరమైనా ఒకే ధరకు ఉత్తరాన్ని చేరవేయడంలో మన తపాలా శాఖకు సాటి మరే ప్రైవేటు సంస్థ రాదు. హిమాలయ సానువులైనా, అండమాన్ నికోబార్ దీవులైనా లాభనష్టాలతో నిమిత్తం లేకుండా సేవలు అందించే సంస్థ తపాలా శాఖ. సమర్థతకు, నమ్మకానికి పెట్టింది పేరు. తపాలా శాఖ అంటే అదొక గ్రామీణ పేదల బ్యాంకు! ప్రభుత్వ పథకాల అమలులో కీలక పాత్రను కూడా పోషిస్తున్నది. భారీ ఎత్తున ఉద్యోగాలను కల్పిస్తున్నది. అమెరికా వంటి పెట్టుబడిదారీ స్వర్గధామంలోనే తపాలా శాఖను సమర్థవంతంగా నిర్వహించే ప్రైవేటు సంస్థ లేదంటున్నారు. ఇక మన దేశం సంగతేమిటి? లాభనష్టాల ప్రకారం నడిచే ప్రైవేటు సంస్థలు గ్రామీణ పేదలను పట్టించుకుంటాయా?
సందర్భాన్ని బట్టి జాతీయం చేయడం లేదా ప్రైవేటీకరించడంలో తప్పు లేదు. కానీ ప్రపంచీకరణ తరువాత ప్రతి రంగాన్ని ప్రైవేటీకరించడమనే జాఢ్యం ముదిరింది. అయినా కొంత ముందు వెనుకలు ఆలోచించే పరిస్థితి కూడా ఉండేది. కానీ ప్రధాని మోదీ పాలన మొదలైన తరువాత ప్రతి రంగాన్ని ప్రైవేటుకు అందులోనూ సన్నిహిత వ్యాపారులకు కట్టబెట్టడమే పనిగా పెట్టుకున్నారు. దేశ భద్రతతో ముడిపడి ఉన్న ఆయుధ ఉత్పత్తి కేంద్రాలనూ ప్రైవేటుకు అప్పగించడం శ్రేయస్కరమా? విదేశాలలో బీమా సంస్థలు మూతబడితే జీవితమంతా చీమలా కూడబెట్టుకున్న డబ్బు కోల్పోవడం వంటి బాధలు మన దేశంలో ఇంకా అనుభవంలోకి రాలేదు. పాలసీదారులకు ఏ ఇబ్బంది లేకుండా సేవలు అందించే ప్రపంచంలోనే గొప్ప బీమా సంస్థగా పేరొందిన ఎల్ఐసీనీ మోదీ ప్రభుత్వం అప్పనంగా ప్రైవేటుపరం చేసింది.
20వ శతాబ్దపు ప్రపంచం ఓవైపు పెట్టుబడిదారీ వ్యవస్థ విషపడగల కింద బతికింది. మరోవైపు కమ్యూనిస్టు ఏకపార్టీ ఛత్రఛాయల్లో బిక్కుబిక్కుమన్నది. ఈ రెండు అనుభవాల తరువాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థలు ప్రజల ఆకాంక్షల మేరకు, చారిత్రక పరిణామంలో భాగంగా ఏర్పడ్డాయి. యూరప్లోని అభివృద్ధి చెందిన దేశాలలో కూడా పలు రంగాలు ప్రభుత్వ సంస్థలుగా ప్రజలకు అపరిమిత సేవలు అందించాయి. కానీ ఇటీవలి కాలంలో కార్పొరేట్ శక్తుల పెత్తనం రావడం వల్ల అసహజమైన, బలవంతపు ప్రైవేటీకరణ మొదలైంది. అయినప్పటికీ రైల్వే, విద్యుత్ వంటి మౌలిక వసతులు ప్రభుత్వ రంగంలో ఉంటేనే సమర్థత, సంక్షేమం లభిస్తుందని అనుభవంలో తెలిసొచ్చింది. ప్రైవేటీకరణ విధానాలపై మళ్ళీ అనుమానాలు మొదలవుతున్నాయి. ఈ దశలో భారత్ వంటి వర్ధమాన దేశాలలో కీలక విభాగాలను కార్పొరేట్ సంస్థలకు దత్తం చేయడమైనా, విదేశీసంస్థలకు తలుపులు తెరువడమైనా అభిలషణీయం కాదు. మోదీ ప్రభుత్వం ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకోకుండా ఆర్థికవేత్తలతో, రాజకీయవేత్తలతో చర్చించాలి. ప్రజాభిప్రాయాన్ని గౌరవించడం ప్రభుత్వ కనీస బాధ్యత.