మాటలకు చేతలకు పొంతన ఉండాలంటారు పెద్దలు. కానీ, కేంద్రంలోని బీజేపీ పాలకులు ఈ రెండింటి మధ్య ఏనాడూ సమతూకాన్ని పాటించే హుందాతనాన్ని ప్రదర్శించలేదు. కేంద్ర హోంమంత్రి అమిత్షా హిందీ భాష ప్రాధాన్యాన్ని గురించి మాట్లాడినప్పుడల్లా విమర్శలు వ్యక్తమయ్యేది అందుకనే. వివిధ రాష్ర్టాల ప్రజలు ఇంగ్లిష్ బదులుగా హిందీలో మాట్లాడుకోవాలని గత ఏప్రిల్లో సూచించిన అమిత్షా.. దానిపై వ్యతిరేకత వచ్చేసరికి ఈసారి కాస్త తగ్గారు. హిందీ దివస్ సందర్భంగా బుధవారం ఆయన ప్రసంగిస్తూ దేశంలోని ప్రాంతీయ భాషలకు హిందీ స్నేహితురాలే కానీ పోటీదారు కాదని, ఈ భాషలన్నీ పరస్పర సహకారంతో అభివృద్ధి చెందాలని హితవు పలికారు. ఓవైపు, విపక్షాలపైకి ఈడీ, సీబీఐలను పంపుతూ దేశంలో ఏక పార్టీ వ్యవస్థ ఏర్పాటు కోసం అడుగులు వేస్తున్న బీజేపీకి చెందిన అగ్రనేత ‘పరస్పర సహకారం’ అని మాట్లాడుతుంటే ఎవరైనా ఎలా నమ్మగలరు?
హిందీ అంటేనే భగ్గుమనే తమిళనాడు ఈసారీ గట్టిగానే స్పందించింది. మనదేశం ఇండియాగానే కొనసాగుతుంది తప్ప హిందియాగా కాదని, తమిళంతోపాటు 22 షెడ్యూల్డ్ భాషలనూ అధికార భాషలుగా ప్రకటించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నిజంగానే మోదీ సర్కారుకు దేశంలోని భాషలను అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ది ఉంటే ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. కానీ, ఈ ఎనిమిదేండ్ల కాలంలో అటువంటి దానికి రుజువులు లేవు. హిందీకి, సంస్కృతానికి ఆర్థికంగా, హార్థికంగా కేంద్రప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలలో ఏ కొద్దిమొత్తం కూడా ఇతర భాషలకు ఇవ్వటం లేదు. అంతేకాదు, నూతన విద్యా విధానం ద్వారా దేశంలోని హిందీయేతర ప్రాంతాల్లోని విద్యార్థులపైన కూడా హిందీని రుద్దటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది.
ఒకే దేశం-ఒకే పన్ను వంటి ఆకర్షణీయ నినాదంతో మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీ విధానం రాష్ర్టాల ఆర్థిక వనరులను దెబ్బ తీసింది. ఇప్పుడు జాతీయ భాష అంటూ హిందీని తీసుకొచ్చే ప్రయత్నాలూ.. దేశంలోని అపారమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని, దానిని వ్యక్తీకరించే విభిన్న భాషలనూ దెబ్బకొట్టే కుట్రగానే విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి సామాజికంగా, సాంస్కృతికంగా ఉత్తరాదికీ, దక్షిణాదికి గణనీయమైన తేడాలున్నాయి. ఈ నేపథ్యంలోనే రాజ్యాంగ రూపకర్తలు ఈ భిన్నత్వాన్ని గౌరవించే విధంగా పలు స్థానిక భాషలకు గుర్తింపునిచ్చారు. ప్రభుత్వ అధికారభాషలుగా ఇంగ్లిష్ను, హిందీని గుర్తించారు. భారతదేశం అంటేనే రాష్ర్టాల సమాఖ్య కాబట్టి, ఆ అర్థంలోనే భాష విధానాన్ని కూడా రూపొందించారు. కానీ, మోదీ హయాంలో ఇతర వ్యవస్థల్లోకి జరిగినట్లుగానే ఈ విషయంలోనూ ప్రభుత్వ చొరబాటు పెరిగింది. దీనిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.