దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరిట ఎన్నో కార్యకమాలు నిర్వహిస్తున్నారు. కానీ మౌలికమైన ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగపరంగా పౌరులకు లభించిన హక్కులను కాపాడటం, పేదరిక నిర్మూలన వంటి బాధ్యతలతో పాటు మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల అమలుపై ఇప్పటికీ రాజకీయ పార్టీలు మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నాయి.
అయితే ఎమ్మెల్సీ కవిత వంటి మహిళా నేతల పోరాటం వల్ల ఈ బిల్లు ఆమోదంపై కొత్త ఆశలు చిగురించాయి. ఈ బిల్లు ఆమోదానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించి పరిపాలనలో, దేశాభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉన్నది.
కేంద్ర పభుత్వం ఈ నెల 18 నుంచి 22 వరకు నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో జమిలి ఎన్నికలు, యూసీసీ, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందులో మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టమైతే మహిళా సాధికారత దిశగా అడుగులు పడే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత మహిళలకు సమానహక్కులు ఉండాలనే ఉద్దేశంతో మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి సంస్థ ద్వారా వివిధ చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆమె పోరాడుతున్నారు. ఇటీవలే ఈ విషయమై ఆమె అన్ని రాజకీయ పార్టీలకు లేఖ కూడా రాశారు. ఈ లేఖకు చాలా రాజకీయ పార్టీలు సానుకూలంగా స్పందించడం ఆహ్వానించదగిన పరిణామం. ఉప రాష్ట్రపతి ధన్కర్ కూడా మహిళలు చట్టసభల్లో రిజర్వేషన్లు పొందే రోజు ఎంతో దూరంలో లేదని వెల్లడించడంతో ఈ బిల్లు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఆమోదం పొందవచ్చనే అంచనాలు, ఆశలు పెరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు టికెట్ల కేటాయింపులో మహిళలకు 10 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయటంలేదని, దీనిపై జాతీయ స్థాయిలో పోరాడాలని ఇటీవల కవిత ఢిల్లీలో దీక్ష నిర్వహించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. కవితతో పాటు కొందరు మహిళా నేతల పోరాటం వల్ల ఈ బిల్లుపై మరోసారి చర్చ మొదలై కార్యాచరణ ముందుకు పడింది.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును దేవేగౌడ నేతృత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం 1996లో తొలిసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈ బిల్లును 1998, 1999లో మరోసారి రాజ్యాంగ సవరణల కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టినా అవి ఆమోదం పొందలేదు. ఆ తర్వాత యూపీఏ ప్రభుత్వం 2008లో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను రొటేషన్ ప్రకారం మూడు దఫాలుగా అన్ని స్థానాలకు వర్తించే విధంగా 15 సంవత్సరాల కాల పరిమితితో 108వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. జయంతి నటరాజన్ నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ 2009లో ప్రజాస్వామ్య మనుగడలో మహిళల పాత్ర ఉండాలంటే ఈ రిజర్వేషన్లు కావాలని తెలిపింది. 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీ, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా స్థానిక సంస్థల పరిపాలనలో మహిళలకు అవకాశం రావడమేకాక వారు సమర్థంగా రాణిస్తున్నారని పేర్కొంది. బలహీన వర్గాలకు రిజర్వేషన్లు, రాజ్యసభ, శాసన మండళ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించాలని ఆ కమిటీ నివేదించింది. ఏ నియోజకవర్గాలు మహిళలకు కేటాయించాలనేది ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలని సిఫారసు చేసింది. అయితే కొన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు 20 శాతం కచ్చితంగా మహిళలకు కేటాయించే విధంగా, అలాగే ఓబీసీ మహిళలు, మైనారిటీలకు అందులో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని సూచించాయి. 2019 సార్వత్రిక ఎన్నికల ముందు మోదీ ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పటికీ ఆమోదం పొందలేదు. అప్పటి నుంచి ఎన్నో చిక్కుముడులు ఈ బిల్లు చుట్టూ అల్లుకున్నాయి.
మహిళా రిజర్వేషన్ల బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే లోక్సభ, అన్ని రాష్ర్టాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ చేయబడతాయి. దేశ రాజకీయాల్లో ఈ నిర్ణయం పెను సంచలనంగా మారి పలువురి నేతల తలరాతలు మార్చనున్నది. 2008లో నియోజకవర్గాల పునర్విభజన అధికార పార్టీలకు ఎలా మేలు చేకూర్చిందో.. ఆ విధంగానే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందితే కేంద్రం, రాష్ర్టాల్లోని అధికార పార్టీల సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలపై కార్యకర్తలు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తగ్గి అధికార పార్టీలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉన్నది. మహిళా రిజర్వేషన్లను 33 శాతం కన్నా తక్కువ శాతానికి నిర్ణయించడాన్ని తాము ఒప్పుకోమని బీజేపీ, కాంగ్రెస్ చెప్తున్నాయి. అయితే కేంద్రంలోని పాలక, ప్రతిపక్ష కూటముల్లోని కొన్ని పార్టీలు మహిళలకు మూడో వంతు సీట్లను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయే పక్షాలు, కాంగ్రెస్ లాంటి పార్టీల మద్దతుతో మహిళా రిజర్వేషన్ల బిల్లు సులువుగా ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మహిళా రిజర్వేషన్ల వల్ల పురుష అభ్యర్థుల తిరుగుబాట్లు, సహాయ నిరాకరణతో ఎన్డీయే పక్షాలు కొన్ని స్థానాల్లో ఓటమి పాలయ్యే అవకాశం ఉన్నది.
ప్రస్తుతం లోక్సభ మొత్తం సభ్యుల్లో 10 శాతం, రాష్ర్టాల శాసనసభల్లోని సభ్యుల్లో 7 నుంచి 8 శాతం మాత్రమే మహిళలున్నారు. రువాండా, క్యూబా, బొలీవియా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం 50 నుంచి 63 శాతం ఉండగా, బ్రిటన్లో 32 శాతం, అమెరికాలో 23 శాతంగా ఉన్నది. అయితే అమెరికాలో సెనేట్, రాజకీయ పార్టీల్లో మహిళా రిజర్వేషన్లు లేవు. బ్రిటన్, స్వీడన్, అర్జెంటీనా, నార్వే, ఫ్రాన్స్ దేశాల్లో రాజకీయ పార్టీలు విధిగా మహిళలకు సీట్లు కేటాయించాలని చట్టబద్ధం చేశారు. మన దేశంలో రాజకీయ పార్టీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఆశించిన ఫలితాలు రాకపోగా నేతలు తమ ప్రత్యర్థుల స్థానాలను మహిళలకు ఇచ్చే ప్రతిపాదనలు తేవడం ద్వారా చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాలన్న లక్ష్యాలను నీరుగార్చే అవకాశం ఎక్కువగా ఉన్నది! ఈ నేపథ్యంలో చట్టసభల్లోనే నేరుగా 33 లేదా 25 శాతం సీట్లను మహిళలకు రిజర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో 33 శాతం, జనరల్ స్థానాల్లోనూ 33 శాతం రిజర్వేషన్లను మహిళలకు కల్పించాలి. ప్రధానంగా 15 సంవత్సరాలు అంటే మూడు దఫాలు మాత్రమే రిజర్వేషన్లు కేటాయించాలని నిర్దేశించడం సరైనది కాదు. కనీసం ఒకేసారి 6 దఫాల పాటు లేదా ఆ తర్వాత అయినా పొడిగించే అంశాన్ని పరిశీలించాలి. రిజర్వేషన్ల అమలు రొటేషన్ అని పేర్కొన్నారు కానీ అది లాటరీ పద్ధతి లేదా ఇతర మార్గాల ద్వారా కాకుండా మహిళా జనాభా నిష్పత్తిని బట్టి వారికి స్థానాలు రిజర్వ్ చేయాలి.