నిన్ననే ఒక చిట్టి కథ చదివిన. అబద్ధం, నిజం.. దగ్గరి మిత్రులు. ఎప్పుడూ ఒకరి వెంటే మరొకరు ఉండేవారు. ‘ఈ బావిలో నీళ్లు చాలా బాగున్నాయి.కలిసి స్నానం చేద్దామా?’ అడిగింది నిజాన్ని అబద్ధం! ఇద్దరూ బట్టలు తీసి గట్టున పెట్టి, కలిసి బావి లోపలికి దిగారు. స్నానం చేశారు. అబద్ధం ఏదో కొంపలు మునిగినట్టు, హడావుడిగా స్నానం ముగించింది. హఠాత్తుగా బావి నుంచి బయటకు వచ్చి, అక్కడనే ఉన్న ‘నిజం’ బట్టలు వేసుకొని పరుగు తీసింది అబద్ధం!
‘నిజం’కు బాగా కోపం వచ్చింది. మెల్లెగా మెట్లెక్కి బావి బయటకు వచ్చింది. కానీ అక్కడ తన బట్టలు కనిపించలేదు. దాంతో అట్లే నగ్నంగానే బజార్లోకి వచ్చింది. నగ్నంగా వస్తున్న నిజాన్ని చూసిన జనం అసహ్యించుకున్నారు. కోప్పడ్డారు. మొహం తిప్పుకున్నారు. ‘నిజం’ చాలా బాధపడింది. ఆ అవమానాన్ని తట్టుకోలేని నిజం, మళ్లీ బావిలోకి దిగిపోయి, అందులోనే ఉండిపోయింది!!
అటు అబద్ధమేమో.. నిజం బట్టలేసుకుని, బొట్టు పెట్టుకుని, పౌడరద్దుకుని, తన్ను తాను సింగారించుకొని, పాదయాత్రల పేరుతో ఊరూరూ తిరుగుతున్నది. జనం కూడా తిలకాలు దిద్దుతూ, హారతులిస్తూ, అబద్ధం విదిలించే పదో పరకో అందుకుంటూ అదే తమ మహద్భాగ్యమని అల్ప సంతోషం అనుభవిస్తున్నారు! నిజం బట్టల్లో ఉన్న అబద్ధం నిజం కాదని, నిజం నగ్నంగా మన పెరట్లోని బావిలోనే ఉందనే ‘నగ్న సత్యాన్ని’ తెలుసుకునే అవకాశం ఉంటుందా?ఆ ఆసక్తి ఈ ప్రజలకు ఎప్పుడైనా కలుగుతుందా? నగ్న సత్యాన్ని బావిలోంచి తీసే, చూసే వివేకవంతమైన సాహసాన్ని ఈ సమాజం చేస్తుందా?
ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు అబద్ధం అనేక వేషాల్లో ఊరేగుతున్నది. ఓదార్పు (కోరే) యాత్రై ఒకామె, పాదయాత్రై ఒకాయన, దళిత యాత్రై ఇంకొకాయన, మత యాత్రై మరొక పాలాయన, కుల యాత్రై పొరుగు కులపాయన నిలువెత్తు అబద్ధాలై నిత్యం తిరుగుతున్నారు. అప్పుడప్పుడు వచ్చిపోయే అబద్ధపు విగ్రహాలకు ఎలాగూ నిగ్రహం లేదు. కండ్లముందు కనిపించే నిజాన్ని కూడా అబద్ధం చేయగల మాయా మశ్చీంద్రులంతా మనుషుల వేషాల్లో తిరుగుతున్నారు. వారి వెంట నడిస్తే, క్వార్టర్ సీసా నుంచి కారే సారా.. పొలంలో పారే నీళ్లను అబద్ధం చేయగలదు. కలియుగ శకునులు కట్టే గాంధారి గంతలు 24 గంటల విద్యుత్తు వెలుగును అబద్ధం చేయగలవు.
మాటలు విరజిమ్మే మత విద్వేషపు మబ్బులు హైదరాబాద్ ఆకాశ హర్మ్యాలను అబద్ధం చేయగలవు. పక్కవాడి మీది అసూయ నీ రైతుబంధు ఆనందాన్ని అబద్ధం చేయగలదు. కేంద్రం కొనని పంట, నీ దిగుబడి లాభాన్ని అబద్ధం చేయగలదు. మాయతో పెట్టే మారుపేరు నువ్వు నిత్యం తాగే నీళ్లను అబద్ధం చేయగలదు. వాళ్ల అబద్ధాల శ్రమ నీ అభివృద్ధి-పరిశ్రమను అబద్ధం చేయగలదు. పచ్చగా పరుచుకున్న తెలంగాణను పంచరంగుల సెల్ఫోన్ తెర అబద్ధం చేయగలదు. ఒకరోజు నీ చేతికందే గులాబీ నోటు, ఇప్పుడు నువ్వు ఆస్వాదిస్తున్న గులాబీల అత్తరును అబద్ధం చేయగలదు.
దేశమంతా ఒక్కటని చెప్పేవాళ్లే ప్రాంతం పేరు లేదని పార్టీని అబద్ధం చేసేయగలరు. చెప్పులు మోసిన చేతులే పచ్చిబట్టల ప్రమాణాలు చేసినప్పుడు, విలువలు కచ్చితంగా దేవతా వస్ర్తాలే! న్యాయవ్యవస్థ ఊరటకు ఊపిరిగా, సీబీఐ క్లీన్చిట్కు పర్యాయపదంగా, జాతీయ ప్రభుత్వం విజాతీయ వివక్షకు సమానార్థకంగా, పరిపాలన లాభనష్టాల వ్యాపారానికి మారుపేరుగా, దర్యాప్తు సంస్థలు ‘అనధికారిక ఎన్నికల పన్ను’లు విధించే విభాగాలుగా, ప్రభుత్వ సేవలు ఖజానాను పెంచే మార్గంగా మాత్రమే మారినప్పుడు అబద్ధమే నిజంగా ఊరేగడంలో అసంగతం ఏముంటుంది? ఆరోపణలకు జవాబివ్వవలసినవాడు, ఆరోపణలకే సవాల్ విసరడంలో వింతేముంటుంది?
ఇటువంటి అబద్ధాల నడుమ, నువ్వు నివద్దిగా నిలబడి ఉంటావా? ఉండగలవా? అన్నదే ఇప్పుడున్న ప్రశ్న. ఎందుకంటే అబద్ధాలెన్ని ఎంత ఎగిరినా, ఎక్కడెక్కడ తిరిగినా నిజం నిలకడగా ఉండనే ఉన్నది.. నగ్నంగా! దేశమంతా అబద్ధాల హోరులో ఆగమాగమవుతుంటే, అతడు మాత్రం నిజం నీడలో నిశ్చలంగా ఉన్నాడు. నిగ్గదీసి కొన్ని ప్రశ్నలూ వేస్తున్నాడు. ‘శేషం మౌనేన పూరయేత్’ అని వారు అజ్ఞానాన్ని, అసమర్థతను మౌనంలో దాచి, అబద్ధాలను మాత్రమే అస్ర్తాలుగా గుప్పుతున్నా సరే, అతడు బావిలో పడ్డ నిజాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
తన ప్రశ్నలకు వారు జవాబులు చెప్తారని కాదు అతడి లక్ష్యం. ప్రశ్నలతో మరిన్ని ప్రశ్నల్ని, ఆ ప్రశ్నల గుంపుతో ప్రశ్నా సమూహాన్ని, ఆ ప్రశ్నా సమూహంతో ప్రశ్నా సహస్రాన్ని, ఆ ప్రశ్నా సహస్రంతో ప్రశ్నా భారతాన్ని, ప్రజ్ఞా భారతాన్ని ఉత్పత్తి చేయడం. ‘తెలంగాణకు ఎందుకింత అన్యాయం?’ అన్న ఒక్క ప్రశ్నే కదా.. మూడు కోట్ల ప్రశ్నల్ని తయారుచేసి, ఆధిపత్యాన్ని ముప్పుతిప్పలు పెట్టి కిందికి దించింది! మూడుకోట్లు కాదు; ఇప్పుడు 130 కోట్ల ప్రశ్నలు కావాలి! ఎందుకంటే ప్రశ్నను చూస్తే అబద్ధానికెప్పుడూ భయమే!
ప్రశ్నించడం తెలంగాణ నైజం. ఒకరకంగా చెప్పాలంటే ప్రశ్నలోంచే తెలంగాణ పుట్టిందేమో! తెలంగాణ చిత్రపటం ప్రశ్నల సమాహారంలా నిగ్గడించి ఉంటుంది! ఆ ప్రశ్నార్థక చిహ్నానికి కింద బిందువులా అతడుంటాడు. దేశమంతా ఒక మాయలో, మత్తులో గమ్మత్తుగా కూరుకుపోయి ఉన్నప్పుడు తెలంగాణ ప్రశ్నించడం మొదలుపెట్టింది. రాజకీయంలో మాటలు మారి, అబద్ధాల ఆట మొదలైనప్పుడు.. బావిలో పడ్డ నిజంలాంటి దేశం సంగతేమిటని తెలంగాణ ప్రశ్నించింది.
ఇది దేశమంత అబద్ధానికి, తెలంగాణంత నిజానికి మధ్య జరుగుతున్న పోరాటం. ఎలాగైనా గెలవాలన్న అబద్ధం పట్టుదల ఒకవైపు. నిజాన్ని గెలిపించాలన్న పంతం ఒకవైపు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యమైన వ్యూహం ఒకవైపు. ప్రజల గెలుపే పరమార్థమైన వ్యూహం మరోవైపు. ఆడంబరాల అబద్ధానికి, నిజమైన ప్రేమకు మధ్య జరుగుతున్న సంఘర్షణలో నిలిచింది ఇప్పుడు ఈ దేశమైనా, రాష్ట్రమైనా! ఇప్పుడు మనం చూడాల్సింది.. ఏం చెప్పారన్నది కాదు; ఏం చేసారన్నది!
కొన్ని గంటల్లో కొత్త సంవత్సరం! గతం క్రితమై, అబద్ధమై… భవిష్యత్తు వర్తమానమై, కర్తవ్యమానమయ్యే సమయం! ఇది ఎన్నికల ఏడాది. మరొక యుద్ధం వాకిట మనం. రాజకీయంలో ఆట మారింది. అందువల్ల ఆలోచనా మారాలి. అబద్ధం జోరు గా, నిజం నింపాదిగా కళ్ల ముందుకొచ్చి కనబడే సందర్భమిది. అందరూ పైసకో, పదవికో, ప్రలోభానికో పడిపోయే వాళ్లే ఉం డరు. మనపైన, మనిషిపైన పట్టెడంత, పుట్టెడంత ప్రేమ నింపుకొన్నవాళ్లూ వెంట ఉంటరు. అందరూ మన నుంచి పొందేవాళ్లే ఉండరు. మనకు నిజంగా మేలు చేయాలనుకునే వాళ్లూ ఉంట రు.
చెవులు రిక్కించుకొని ఉంటే ఈ కాలంలో చెప్పేవాళ్లు తక్కు వా! చేసిందేమిటో చూడాలి కదా! చేతిలో కొర్రాయి లేకున్నా, చిచ్చు దట్టించే వాళ్లు కోకొల్లలు. మన మనసును మన చేతితోనే అల్లకల్లోలం చేస్తరు. మన మనిషిని మనకు కాకుండా చేస్తరు. అందరూ అమ్ముకునే వాళ్లే ఉండరు. నమ్ముకోవాల్సిన వాళ్లూ ఉంటరు! మనల్ని మనలుగా ప్రేమించే మనవాళ్లూ, మన కోసం తపనపడే వాళ్లూ ఉంటరు! రంగురంగుల అబద్ధాన్ని నమ్మాల్నో, మూలకున్న నిజం గురించి ముచ్చటించుకోవాలో.. మనదే నిర్ణయం. ఎవడు మనవాడో, ఎవడు పరాయివాడో తేల్చుకోవడంలోనే ఉన్నది విషయమంతా! పదేపదే పడుతూ కూడా లేవడానికి, పట్టు చేజారినా తట్టుకోవడానికి, కిందపడ్డా పైకి రావడానికి ఇది జారుడు బండ కాదు. జాతి జీవితం!
కరోనా వచ్చి ప్రపంచమంతా కుదేలైతే, తెలంగాణ ప్రపంచానికి టీకాలిచ్చింది, పైకాలిచ్చింది, పరమాన్నమూ పెట్టింది. కొత్త ఏడాది ప్రపంచమంతా మాంద్యమంటున్నరు. దేశం లో ఆర్థిక బుద్ధిమాంద్యం రాజ్యమేలుతున్నది. రేపటి సంక్షోభానికి నిన్ననే పరిష్కారం చూపించిన తెలంగాణ కావాలా? నేటి సమస్యకు రేపటికీ జవాబు ఆలోచించలేని నమూనా కావాలా? ఆలోచించుకోవాలి. తన కాళ్లమీద తాను నిలదొక్కుకున్న తెలంగాణ, దరిద్రపు దేబిరింపులు ఇంకెంతకాలమని దేశ సేవకు బయల్దేరింది. జెండా ఎత్తాలా? జై కొట్టాలా? ఆలోచించుకోవాలి. మన కోసం తపించే వాడి వెంట నిలవాలా? నీరసించాలా? ఆలోచించుకోవాలి. చర్చ దేనిమీద సాగాలి.. దేశ దుర్గతి మీదనా? దీపికా పడుకోన్ వేసుకున్న బికినీ రంగు మీదనా? ఆలోచించుకోవాలి. దేవుడికి పెట్టే పండు ఎట్లున్నదో చూడాలా? ఆ పండును అమ్మినవాడు ఎవడో చూడాలా? ఆలోచించాలి. వాడని కత్తులు ప్రమాదమా? కత్తుల్లాంటి మాటలా? ఆలోచించుకోవాలి. కాలం చెప్పే కథలను గుర్తు చేసుకోవాలా? లేదా? ఆలోచించుకోవాలి.
అనగనగా ఒక రాజ్యం. రాజుగారు చాలా మంచివాడు. ప్రతి రోజూ తన రాజ్యం గుండా వెళ్లే పేద బాటసారులకు ప్రత్యేక సత్రం కట్టించి మధ్యాహ్న భోజనం వండించి పెట్టేవాడు. ఆ రోజు కూడా వంట సిద్ధమైంది. అదే సమయంలో ఆకాశంలో ఎగురుతున్న ఒక గద్ద, తన కాళ్ళతో పట్టుకుపోతున్న పాము నోటి నుంచి విషం, చుక్కలుగా రాలి, వడ్డించడానికి సిద్ధంగా ఉన్న అన్నంలో పడింది. ఎవరూ గమనించలేదు. ఆ అన్నాన్ని ఒక బాటసారి తిన్నాడు. చనిపోయాడు. వార్త రాజుగారికి చేరింది. ఆయన చాలా దుఃఖించాడు. మేలు చెయ్యబోతే ఇలా కీడు జరిగిందే అని చింతించాడు.
ఇప్పుడు బాటసారి చనిపోవడానికి కారణం ఎవరు?
రాజా? వంటవాడా? పామా? గద్దా? వడ్డించిన వ్యక్తా?
రాజు చేసేది ధర్మ కార్యం; అతని తప్పులేదు.
గద్దకు పాము ఆహారం; దాని తప్పు లేదు.
పాముది మరణ బాధ; దాని తప్పులేదు.
వడ్డించే వాడికి విషయం తెల్వదు, తన పని తాను చేస్తున్నడు; అతని తప్పూ లేదు.
వీరిలో ఎవరూ కావాలని ఆ బాటసారిని చంపలేదు. మరి ఈ పాపాన్ని ఎవరి ఖాతాలో జమచెయ్యాలి? శిక్ష ఎవరికి? ఇదే విషయాన్ని చిత్రగుప్తుడు, యమధర్మరాజును అడిగాడు.
యమధర్మరాజుకూ ఏం చెప్పాలో అర్థం కాలేదు.
‘అట్లా ఉంచు. తర్వాత బాగా ఆలోచించి చెప్తా!’అన్నాడు.
కొన్ని రోజుల తర్వాత బాటసారులు కొందరు, ‘రాజుగారు బాటసారులకు అన్నదానం చేసే సత్రం ఎక్కడో చెప్పా’లని ఒకాయనను అడ్రస్ అడిగారు.
అతను వారికి దారిచూపుతూ, ‘బాబూ ! జాగ్రత్త. మా రాజుగారికి బాటసారులు అంటే పడదు. కొద్ది రోజుల క్రితమే ఒకాయనను విషం పెట్టి చంపేశాడు. మీ రోజులు బాగున్నాయో లేదో చూసుకొని జాగ్రత్తగా వెళ్లండి’ అన్నాడాయన కాషాయ కండువా సవరించుకుంటూ!
పైనున్న యమధర్మరాజు దీన్ని విన్నాడు. చిత్రగుప్తా ! మొత్తం పాపమంతా ఇతని ఖాతాలో వెయ్యి అన్నాడు. ప్రజల సంక్షేమం కోసం సదుద్దేశంతో చేసే ధర్మకార్యాలు, అభివృద్ధి పనులు, సంక్షేమంలో కూడా రంధ్రాన్వేషణ చేస్తూ, నిందలను ఆపాదిస్తూ, వ్యక్తులను విమర్శించే వారికే ఆ పాపకర్మ ఫలం దక్కుతుందని యమధర్మరాజు తన తీర్పు చెప్పాడు. తెలంగాణలో ఏం జరుగుతున్నదో, యమధర్మరాజు తీర్పు ఎవరికి వర్తిస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా?
కొత్త సంవత్సరం మనందరికీ
ఒక ప్రశ్న వేస్తున్నది.
మనం అబద్ధం వైపా? నిజం వైపా?
రేపు మనం ఇవ్వబోయే జవాబును
నేటి డైరీలో రాసుకుందాం!
విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్!!
అబద్ధం జోరుగా, నిజం నింపాదిగా కళ్ల ముందుకొచ్చి కనబడే సందర్భమిది. అందరూ పైసకో, పదవికో, ప్రలోభానికో పడిపోయే వాళ్లే ఉండరు. మనపైన, మనిషిపైన పట్టెడంత, పుట్టెడంత ప్రేమ నింపుకొన్నవాళ్లూ వెంట ఉంటరు. అందరూ మన నుంచి పొందేవాళ్లే ఉండరు. మనకు నిజంగా మేలు చేయాలనుకునే వాళ్లూ ఉంటరు. చెవులు రిక్కించుకొని ఉంటే ఈ కాలంలో చెప్పేవాళ్లు తక్కువా! చేసిందేమిటో చూడాలి కదా! చేతిలో కొర్రాయి లేకున్నా, చిచ్చు దట్టించే వాళ్లు కోకొల్లలు. మన మనసును మన చేతితోనే అల్లకల్లోలం చేస్తరు. మన మనిషిని మనకు కాకుండా చేస్తరు. అందరూ అమ్ముకునే వాళ్లే ఉండరు. నమ్ముకోవాల్సిన వాళ్లూ ఉంటరు! మనల్ని మనలుగా ప్రేమించే మనవాళ్లూ, మన కోసం తపనపడే వాళ్లూ ఉంటరు! మనం చూడాల్సింది.. ఏం చెప్పారన్నది కాదు; ఏం చేసారన్నది!
– తిగుళ్ల కృష్ణమూర్తి