ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైన నేపథ్యంలో బెట్టింగ్ దందా చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఈ బెట్టింగ్ దందాలో యువత చిక్కుకోవడం అత్యంత ఆందోళనకరమైన విషయం. ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ యువత మాయదారి బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకుపోయి అమూల్యమైన డబ్బును, కాలాన్ని వృథా చేసుకుంటుండటం అత్యంత విషాదం.
విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల నడవడికపై పర్యవేక్షణ కొరవడుతుండటమే దీనికి ప్రధాన కారణం, సెల్ఫోన్లు వారికి అప్పజెప్పి చోద్యం చూస్తుండటంతోనే యువత చెలరేగిపోతున్నది. ఆ సెల్ఫోన్లను ఉపయోగిస్తూ బెట్టింగ్ అనే ఈ అనాగరిక క్రీడకు అజ్యం పోస్తూ దాసోహమవుతున్నది. యువత పెడదారిన పయనిస్తూ తల్లిదండ్రుల ఆశలపై నీళ్లు చల్లుతుండటం బాధాకరమైన విషయం. విద్యార్థులు క్రికెట్ మ్యాచ్లు ఆడటం, టీవీల్లో క్రికెట్ చూడటంలో ఏ మాత్రం తప్పు లేదు. కానీ, ఇలా ఏది మంచో, ఏది చెడో కూడా తెలుసుకోలేని ఈ పసి వయస్సులో ‘బెట్టింగ్’ అనే మాయదారి జూదంలో చిక్కుకోవడం, అందులో నుంచి బయట పడలేకపోవడం చూస్తుంటే బాధేస్తున్నది. ఒక్కోసారి ఆ అనాగరిక పోకడ మూలంగా లక్షలాది రూపాయలు పోగొట్టుకొని ఆత్మహత్యలు సైతం చేసుకుంటుండటం అత్యంత విషాదం. అయితే ఉన్నత చదువులు చదువుకొని రేపటి దేశాభివృద్ధిలో కీలకపాత్ర వహించాల్సిన యువత ఇలా బెట్టింగ్ లాంటి విష క్రీడల్లో పాలుపంచుకోవడం అమానవీయం.
ఏదేమైనా యువత, వారి తల్లిదండ్రులు ఇప్పటికైనా మేల్కోవాలి. తమ పిల్లలు సన్మార్గంలో నడిచేలా చర్యలు తీసుకోవాలి. వారి మానాన వారిని విచ్చలవిడిగా వదిలివేయకుండా, బాధ్యతతో వ్యవహరించాలి. వారిని ఓ కంట కనిపెడుతూ వారి ఉన్నత, ఉజ్వల భవిష్యత్కు బంగారు బాట వేయాలి. ఈ గురుతర బాధ్యత ప్రతి విద్యార్థుల తల్లిదండ్రులపై ఉన్నది. ఈ బెట్టింగ్ అనే ఈ విష మాయాజాలాన్ని పెంచి పోషిస్తున్నవారిపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ అనాగరిక క్రీడను కూకటి వేళ్లతో సహా పెకిలించేందుకు ప్రభుత్వం నడుం బిగించాలి. అప్పుడే ఈ సమాజానికి ఎంతో మేలు జరుగుతుంది. అలాగే బెట్టింగ్ అనే ఈ విష క్రీడ నేటి యువత పాలిట పెను శాపంగా మారకముందే బాధ్యత గల ప్రతి పౌరుడు సత్వరమే మేల్కోవాలి. సమూలంగా నిర్మూలించేందుకు తమ వంతు బాధ్యతగా వ్యవహరించాలి. అప్పుడే యువత భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది.
-సభావట్ కళ్యాణ్
90143 22572