అమెరికాలోని యూనివర్సిటీ క్యాంపస్లు విద్యార్థుల నిరసనలతో దద్దరిల్లుతున్నాయి. పాలస్తీనా అనుకూల నినాదాలు మార్మోగుతున్నాయి. గాజా యుద్ధం పేరిట పాలస్తీనీయులను ఊచకోత కోస్తున్న ఇజ్రాయెల్పై ఆంక్షలు విధించాలని, ఇజ్రాయెల్తో అమెరికా కంపెనీలు వ్యాపారాలు మానుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రెండు వారాల క్రితం ఏప్రిల్ 17న కొలంబియా యూనివర్సిటీలో మొదలైన ఆందోళన దావానలంలా 20కిపైగా యూనివర్సిటీలకు పాకింది. ఆ తర్వాత సరిహద్దులు దాటి ఐరోపా, పశ్చిమాసియా దేశాలకూ విస్తరించింది. విద్యార్థులు చేపట్టిన బైఠాయింపులతో క్యాంపస్లు ఉద్రిక్తంగా మారాయి. దీంతో పోలీసు, పారామిలిటరీ బలగాలు బలప్రయోగంతో బైఠాయింపు శిబిరాలను ఖాళీ చేయించారు. ఈ ఉదంతంపై అమెరికాలో పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. యూదు, ఇస్లామిక్ సమర్థకుల మధ్య గాజా ఓ పెద్ద సమస్యగా మారింది. రెండు శిబిరాలకూ తమతమ బలమైన వాదనలున్నాయి.
అమెరికా, ఐరోపా దేశాల్లో గాజా అనుకూల విద్యార్థి ఉద్యమాలు ఆయా సమాజాల్లో చిక్కు సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. స్థానిక జనాభిప్రాయంలో ఇది నిట్టనిలువు చీలికలు తెస్తుండటం చర్చనీయాంశమవుతున్నది. ప్రస్తుత పరిస్థితికి నిన్నటిదాకా సంపన్న దేశాలు అనుసరించిన ఉదారవాద శరణార్థి విధానాలు కారణమనే విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. శ్రామిక శక్తి అవసరం, మానవతావాద సహాయం పేరిట ఇబ్బడిముబ్బడిగా శరణార్థులను అనుమతించడం వల్ల సమాజ రూపురేఖలు మారుతున్నాయి. ఖండాంతరాలు దాటిన మతాభినివేశం రాజకీయాలపై ప్రభావం చూపుతున్నది. ఇది అంతిమంగా తీవ్ర జాతీయవాదానికి దారితీయడం మనం చూస్తున్నాం. డోనాల్డ్ ట్రంప్ వంటి మితవాద నాయకులు ఈ ప్రభంజనం ఆసరాగానే ప్రజాదరణ పొందుతుండటాన్ని మనం చూస్తున్నాం. అటు ఐరోపాలోని జర్మనీ సహా అనేక దేశాల్లో రాజకీయాలు శరణార్థుల సమస్య చుట్టే తిరుగుతున్నాయి.
గాజా సమస్య ఇలా సమాజాల్లో చీలిక అంశంగా మారడమే కాకుండా మహాయుద్ధానికి మలుపు తిప్పే ట్రిగ్గర్లా మారనుందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గాజా పాలస్తీనీయన్ల తరఫున ఇరాన్ పరోక్ష యుద్ధం జరుపుతున్నది. హెజ్బొల్లా, హౌతీల సాయంతో ఇజ్రాయెల్ను వేధించే పనులను బాహాటంగానే నిర్వహిస్తున్నది. ఇటీవలే ఇజ్రాయెల్తో ఇరాన్ ప్రత్యక్ష ఘర్షణకు దిగడం, ఇజ్రాయెల్ ప్రతిదాడికి పాల్పడటం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచింది. అదృష్టవశాత్తూ ఆ ఘర్షణ నామమాత్రపు క్షిపణులు, డ్రోన్ల దాడులకు పరిమితం కావడంతో ప్రపంచం ఊపిరి పీల్చుకుంది. ఇజ్రాయెల్ తరఫున ఇరాన్పై అమెరికా దాడికి తెగిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని రష్యా హెచ్చరించడం ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. అటు ఉక్రెయిన్ యుద్ధంలో అణ్వాయుధాల మోహరింపునకు రష్యా సిద్ధమైంది. మరోవైపు ఉత్తరకొరియా సుదూర లక్ష్య క్షిపణులను ఎక్కుపెట్టేందుకు సమాయత్తమవుతున్నది. ఈ నేపథ్యంలో మందుపాతరపై వచ్చిపడే నిప్పురవ్వగా గాజా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాల్లో అంతర్గత భద్రతా సమస్యగా పరిణమిస్తున్న గాజా సమస్య కట్టడికి ప్రపంచ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.