గాంధీ నామ్ జప్నా, జుమ్లా సర్కార్ అప్నా!!
రేపు మహాత్మా గాంధీ వర్ధంతి.భారతీయులే కాదు, ప్రపంచమంతా ఆ మహానుభావుడికి నివాళులర్పిస్తున్నది. ప్రపంచంలోని అగ్రశ్రేణి మహానాయకులలో మహాత్మా గాంధీ ఒకరు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ మొదలుకొని నెల్సన్ మండేలా, మయన్మార్లో సూకీ వరకు అనేక మందికి గాంధీ బోధనలే ఉద్యమ పంథాలయ్యాయి. గాంధీ జయంతిని అహింసా దినోత్సవంగా ఐక్య రాజ్యసమితి ప్రకటించి సంఘర్షణల ప్రపంచానికి గొప్ప శాంతి సందేశాన్ని అందించింది.
సిద్ధాంతరీత్యా మహాత్మా గాంధీని వ్యతిరేకించే బీజేపీ పాలకులు ఇప్పుడు ఆయనను నెత్తిన పెట్టుకుంటున్నారు. కానీ ఈ అభిమానం నిజమైనదేనా? బీజేపీ గాంధీని తెరమీదికి తేవడం వెనుక ప్రధానంగా రెండు వాదనలు వినిపిస్తున్నాయి. 1. ప్రపంచవ్యాప్తంగా మహాత్మా గాంధీకి ఉన్న ‘గ్లామర్’ను వాడుకోవడం. 2.గాంధీని ప్రముఖంగా చూపించడం ద్వారా ఆయన వారసత్వాన్ని కాంగ్రెస్ నుంచి గుంజుకొని నెహ్రూ కుటుంబాన్ని అప్రాధాన్యం చేయడం. ఈ నేపథ్యంలో మహాత్మా గాంధీ బోధించినది, ఆచరించినదేమిటి, బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనురిస్తున్నదేమిటి? ఒక తులనాత్మక అధ్యయనం.
గాంధీ నామాన్ని జపించడం,
గాంధీ బొమ్మను ప్రదర్శించడం గాంధేయత అవుతుందా?
లేక గాంధీ సిద్ధాంతాలను అనుసరించి ఆచరించడమా?
గాంధీ అంగీ లేకుండా గోచీ మాత్రమే పెట్టుకుంటారు..మోదీ ఆడంబరమైన డ్రెస్సులు ధరిస్తారు. ఒక సూట్ విలువ పది లక్షల రూపాయలుంటుందని అంచనా. ఆయన కళ్లద్దాల విలువ లక్షా నలభై వేలు. బీజేపీ నాయకులు నరేంద్ర మోదీ వస్త్రధారణ నుంచి స్ఫూర్తి పొందారు. బీజేపీ నాయకులకు వస్త్ర ధారణపై శ్రద్ధ ఎక్కువ. యువతను ఆకట్టుకునేందుకు ట్రెండీ ఔట్ఫిట్స్ వేసుకోవాలని ఢిల్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు కార్యకర్తలకు సూచించారు!
గాంధీ దృష్టిలో రామరాజ్యం అంటే ప్రజల మాటకు గౌరవం ఇవ్వడం. నైతికత ప్రాతిపదికగా పాలించడం.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు ఏమనుకుంటున్నారనే విషయం పట్టదు. పెద్ద నోట్ల రద్దు కావచ్చు, హటాత్తుగా విధించిన లాక్డౌన్ కాలంలో కాలినడక ప్రయాణాలు కావచ్చు. వ్యవసాయ చట్టాలు కావచ్చు, సమాఖ్య స్ఫూర్తి కావచ్చు. రామ రాజ్యం అంటే రాముడి పేరున రాజకీయం చేసి రాజ్యాన్ని సొంతం చేసుకోవడం అని ఆ పార్టీ తలంపు.
మహాత్మా గాంధీ అహింసావాది. బీజేపీ అధికారానికి వచ్చిన తరువాత అల్పసంఖ్యాక, బలహీనవర్గాలపై అనేక దాడులు జరిగాయి. 2010-17 వరకు వెల్లడైన వివరాల ప్రకా రం- మూక దాడులలో 87 మంది మరణించారు, 124 మంది తీవ్రంగా గాయపడ్డారు. 97% మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగినవే.
గాంధీ దృష్టిలో హిందుత్వ సహనాన్ని బోధించేది. వైష్ణవ జనతో అనే గీతం గాంధీకి ఇష్టం. ఇతరుల బాధను తన బాధగా భావించేవారు నిజమైన భక్తులని ఆ గీతం పేర్కొంటుంది. ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనే గీతంలో ‘ఈశ్వర్ అల్లా తేరే నామ్, సబ్ కో సమ్మతి దే భగవాన్’ అనే మాటలను గాంధీజీయే చేర్పించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్వేష రాజకీయాలు పేట్రేగిపోతున్నాయి. అల్పసంఖ్యాకవర్గాలపై దాడులు సాగుతున్నాయి. వాట్సాప్ గ్రూపుల ద్వారా ఉన్మాద ప్రచారం సాగుతున్నది. 2014-19 వరకు నాయకుల విద్వేష ప్రసంగాలు 500% పెరిగాయని వెల్లడైంది.
సత్యమే దైవం అన్నారు గాంధీ. ఎన్నికలప్పుడు ప్రతి ఒక్కరి ఖాతాలో పదిహేను లక్షలు వేస్తామని మోదీ ప్రకటించారు. ఆ తరువాత అడిగితే ‘జుమ్లా’ అని తేలిగ్గా తీసిపారేశారు. అమిత్ షా కూడా మోదీ మాటలు జుమ్లా అన్నారు. విదేశాలలో నల్లధనం తెచ్చి జనానికి పంచుతామని, నిరుద్యోగాన్ని రూపుమాపుతామని, జీవన ప్రమాణాలు పెంచుతామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, అవినీతిని రూపుమాపుతామని, ధరలు తగ్గిస్తామని బీజేపీ ఎన్నికల ముందు చెప్పినవన్నీ ‘జుమ్లా’లే!
రైతులు పేదరికం నుంచి విముక్తి పొందడమే నిజమైన స్వాతంత్య్రం అని చెప్పారు. రైతులు కళ్ళు తెరిచిన నాడు, తన దుస్థితికి తన దురదృష్టం కారణం కాదని తెలుసుకున్న నాడు, రాజ్యాంగ రాజ్యాంగేతర మార్గాల మధ్య రేఖ చెదిరిపోతుందని గాంధీ హెచ్చరించారు.
గాంధీజీ ఏమని హెచ్చరించారో ఇప్పుడు అదే జరుగుతున్నది. నల్ల చట్టాలను రద్దు చేసే వరకు రైతులు వీరోచితంగా ఉద్యమం సాగించారు. పలు రాష్ర్టాలలో రైతు ఉద్యమాలు సాగుతున్నాయి. పంజాబ్ వచ్చిన ప్రధానిని నిలదీశారు. వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది.
గ్రామాలు అభివృద్ధికి పట్టుకొమ్మలుగా ఉండాలని గాంధీజీ వాంఛించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు గ్రామీణులజీవితాలను దిగజారుస్తున్నాయి. ఏడున్నర కోట్ల మంది అదనంగా దారిద్య్ర రేఖ దిగువకు జారిపోయారు. గ్రామీణ ప్రాంతంలో పదిహేను శాతం పేదరికం పెరిగినట్టు స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2021 నివేదిక వెల్లడించింది. పెద్ద నోట్ల రద్దు వంటి నిర్ణయాల వల్ల పెద్దగా దెబ్బతిన్నది గ్రామీణ ప్రజలే.
గాంధీ సూత్రాల ప్రాతిపదికగా సబర్మతి ఆశ్రమం ఏర్పాటైంది. గాంధీ ఆశ్రమాన్ని వేలాది మంది సందర్శిస్తుంటారు. సబర్మతి ఆశ్రమాన్ని రియల్ ఎస్టేట్ దృక్కోణంతో వ్యాపారమయం చేయాలని బీజేపీ సర్కార్ తలపెట్టింది. 54 ఎకరాలలో ‘గాంధీ ఆశ్రమ్ మెమోరియల్ అండ్ ప్రిసింక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్’ పేర 12 వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్టును చేపట్టింది. గాంధీ ఆశ్రమాన్ని ఒక మారుమూల ప్రాంతంగా మార్చి మిగతా ఎకరాల కొద్ది స్థలంలో కొత్త రకం మ్యూజియంలు, ఆంఫీ థియేటర్, వీఐపీ లాంజ్లు, దుకాణాలు, ఫుడ్కోర్టులు మొదలైనవి తలపెట్టింది. ఈ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు చేపట్టడం గాంధీని మరోసారి హత్య చేయడమేనని గాంధేయవాదులు బాధపడుతున్నారు.
అందరూ అభివృద్ధి చెందాలనేది గాంధీజీ సర్వోదయ సిద్ధాంతం. కడగొట్టు వ్యక్తికి కూడా సంక్షేమం అందాలని గాంధీ భావించారు.
బీజేపీ విధానాలు కడగొట్టు వ్యక్తి సంక్షేమం కాదుగదా, సమాజంలోని తొంభై శాతం మందికి నెత్తికొట్టే విధంగా ఉన్నాయి. ధనిక పేద వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ అసమానత నివేదిక (2022) ప్రకారం- జనాభాలోని పై పది శాతం మంది దగ్గర 57 శాతం ఆదాయం పోగుపడుతున్నది. అట్టడుగు ఉన్న యాభై శాతం ప్రజలకు 13 శాతం ఆదాయమే దక్కుతున్నది.
గాంధీ ఆర్థిక విధానంలో ‘గ్రామ స్వరాజ్యం’లో చేనేత, చేతి వృత్తులు, గ్రామీణ పరిశ్రమలు ప్రధానమైనవి. కేంద్ర ప్రభుత్వం చేనేత రంగానికి నిధుల కేటాయింపును తగ్గిస్తూ ఉన్నది. 2020లో చేనేత, చేతి వృత్తుల బోర్డులను రద్దు చేసింది. ఈ ఉత్పత్తులపై జీఎస్టీ కూడా విధిస్తున్నది, పెంచాలని చూస్తుంది.
గాంధీజీ సహకారోద్యమం పట్ల ఆయన మక్కువ చూపించారు. పాల ఉత్పత్తి దారులు సహకార సంస్థగా ఏర్పడితే ఒనగూడే ప్రయోజనాల గురించి ఆయన వివరించారు. సహకార రంగం రాష్ర్టాల పరిధిలోనిది.అయినా సరే, కేంద్ర ప్రభుత్వం సహకార మంత్రిత్వ శాఖను కొత్తగా ఏర్పాటు చేసి రాష్ర్టాల పరిధిలోకి చొచ్చుకుపోతున్నది. ఇప్పటికే అనేక వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. సహకార వ్యవస్థలను చేజిక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు వస్తున్నాయి.
గాంధీజీ వికేంద్రీకరణను కోరుకున్నారు. గ్రామ స్థాయిలో పరిపాలన ఉండాలని కాంక్షించారు. వికేంద్రీకరణ అనేది కేంద్ర ప్రభుత్వ నిఘంటువులోనే ఉన్నట్టు లేదు. రాష్ర్టాల హక్కులను వరుసగా హరిస్తున్నది. విద్య, వ్యవసాయం, సహకారం, నీటి వనరులు , అఖిల భారత సర్వీసులు మొదలైన అనేక అంశాలలో రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కబళిస్తున్నది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది.
–సహ్య
భారతీయ సంస్కృతి అంటే అది మిశ్రమ సంస్కృతి అనేది గాంధీ అభిప్రాయం. ఆర్యులు స్థానికులా, వలస వచ్చారా అనేది కాదు, ఎవరైనా సరే, ఇప్పుడు ప్రత్యేకమైన స్వచ్ఛమైన ఆర్యసంస్కృతి అంటూ లేదని గాంధీ వివరించారు. భిన్న సంస్కృతులు గల పూర్వీకులు స్వచ్ఛందంగా కలిసిపోవడం వల్ల ఇప్పటి తరం ఏర్పడిందనేది గాంధీ అభిప్రాయం. గిరిగీసుకుని ఉండే సంస్కృతి ఏదీ నిలువలేదని, సంకుచితత్వాన్ని విడనాడాలని అన్నారు. సంకుచితత్వం స్వీయ విధ్వంసానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఉదారత వల్ల మిశ్రమ సంస్కృతి ఏర్పడి నిలిచి ఉంటుందని వివరించారు.
హిందీ, హిందుత్వ అంటూ సమాజమంతా ఏకశిలా స్వరూపంగా భావించే బీజేపీ తత్వం గాంధీ బోధనలకు పూర్తి విరుద్ధం. మనం ఎనభై శాతం, వారు ఇరువై శాతం అనే భావనే గాంధీ సూత్రాలకు విరుద్ధం. భిన్న సంస్కృతుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగుతున్నది.