‘తనకు హీరో వర్షిప్ ఇచ్చిన సృష్టికర్త ఎక్కడ?’ అంటూ సినీ గీతం కన్నీటి పాట పాడుతున్నది. మూడు గంటల సినిమా కొండను మూడు చరణాల అద్దంలో పలికించిన కలం కలగా మారినందుకు కళాలోకం కలవరపడుతున్నది.
కన్నీటి పొరలతో వెండితెర గుండె బరువెక్కింది. పాటంటే ఎద చప్పుడు, పాటంటే మేధోమథనం, పాటంటే కథాగమనం, పాటంటే అక్షరయాత్ర, పాటంటే శాబ్దిక పాత్ర, పాటంటే ఎక్కుపెట్టిన ప్రశ్న? పాటంటే పటిష్ఠమైన సమాధానం.. సిరివెన్నెలకు పాటంటే ప్రపంచం, పాటంటేనే ప్రాణం… పార్థివదేహం దూరమైనా ఆ పాటల హార్దిక భావాలు ఎప్పుడూ మనతోనే వుంటాయి
కనిపించే పాటలో దేహం అక్షరం, వినిపించే పాటలో స్వరం అక్షరం, సిరివెన్నెల సీతారామశాస్త్రి పాట అక్షరం, నశ్వరం. ‘గంగావతరణం’లోని రసగంగ ‘కళాతపస్వి’ని ఆకర్షించింది. ఆ అభిమానమే ఈ కలం తపస్విని సినీ గీతరచయితగా ఆహ్వానించింది. సీతారామశాస్త్రి తొలి అడుగే మధుర గీతామృతపు మడుగయింది.
వందలాది సినిమాలకు వందే సీతారామం అనదగిన పాటలందించి, సినీ గీత గమనానికి కొత్త వేగం కూర్చిన వారి సాహిత్య యాగం గూర్చి పుస్తకాలు రాయొచ్చు. సినీ ప్రేమికులకు, భాషాభిమానులకు, సాహిత్య పిపాసులకు, సహృదయ స్పందనాశీలురకు పీహెచ్డీ చేయదగిన భావ గాంభీర్యాన్ని, భాషా మాధు ర్యాన్ని, సరస స్పందనని, సరళ సౌందర్యాన్ని ప్రతిధ్వనించిన పాటలు ఎన్నో.
‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న మాటను ప్రామాణికంగా తీసుకుంటే సిరివెన్నెల గీతాల్లోని ఎన్ని వాక్యాలకో కావ్య గౌరవం అలవోకగా వచ్చి వాలుతుంది. అల్పాక్షరాలలో అనల్పార్థాన్ని అర్థవంతంగా అందించటం చేయి తిరిగిన కలాలకే సాధ్యం. సంస్కృత సమాస భూయిష్టమైన శిష్ట వాఙ్మయపు ఛాయల్నీ, సరళ సుందరమైన సామాన్యుల యిష్టపు మాటల్ని అంతే సమర్థంగా పాటలుగా మలిచారు సిరివెన్నెల.
బాటనీ పాఠానికి, మ్యాటినీ ఆటకీ మధ్య పోటీ పెట్టి కుర్రాళ్ళను ఆడించినా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి – ఎన్నడూ కోలుపోవద్దురా ఓరిమి అంటూ నైరాశ్యాన్ని ఓడించినా-సరసాలతో జవరాలిని ఊరించినా, అమ్మ ప్రేమతో శిశువును లాలించినా ఆ కలానికే చెల్లింది.
మనిషి అంతరాంతరాల్లో జరిగే ఘర్షణ, పొంగే ఆవేశం, కుంగదీసే ఆవేదన, వూహలలో స్వర్గాలు నిలిపే ఆనందభావన… ఇలా పలు రీతుల భావోద్వేగాలను భాషగా మలచి ఆయా చలనచిత్రాల సన్నివేశాలను పండించిన పాటలు ఎన్నో… పదునైన పద ప్రయోగాలతో, వాడియైన వాక్యాలతో ప్రేక్షకుల మనోఫలకాలపై ముద్రపడేలా ఉద్దీపనం గావించిన పాత్రలెన్నో.
దేశభక్తినీ, దైవశక్తినీ, గురువుల పట్ల అనురక్తినీ నింపుకొన్న గుండె గనుక సిరివెన్నెల సాహిత్యంలో సంస్కారం ప్రతిబింబిస్తుంది.
ఒక్క సిరివెన్నెల సినిమా పాటలకు పరిమితమై ఆలోచించినా సీతారామశాస్త్రి భావప్రకటనా శక్తినీ, భాషానురక్తినీ ఆస్వాదించవచ్చు. ‘నా ఉచ్ఛాసం కవనం-నా నిశ్వాసం గానం’ అంటూ ప్రతి కవి గాయకుడూ తన లక్ష్యవాక్యంగా గుర్తుంచుకునే పాట ‘విధాత తలపున ప్రభవించినదీ అనాది జీవనగానం’. ప్రణవనాదపు పరమార్థాన్ని పారవశ్యాన్ని పదపదంలో అందించిన ఈ పాట ఎందరికి చక్కని ఉచ్చారణ నేర్పిందో.
‘ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన.. జాగృత విహంగతతులే వినీల గగనపు వేదికపైన’ అంటూ బాలు, సుశీలలు పరవశించి పాడుతుంటే విన్నప్పుడల్లా వారితో జతకలిపిన గొంతులెన్నో. ఈ గాలి, ఈ నేల, ఈ ఊరు, సెలయేరు అనే పాట వింటున్న ప్రతివారిని వారి వూరికి తీసుకెళ్తుంది.
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా? గానం పుట్టుక గాత్రం చూడాలా? లాంటి ప్రశ్నలు ఆలోచించేవారికి తాతిక అగాధాలు. బూడిదిచ్చేవాడినేమి అడిగేది అంటూ ఆదిభిక్షువునే అన్నీ అడిగిన పాట సిరివెన్నెల శివభక్తినీ, తాత్వికశక్తినీ ప్రతిబింబిస్తుంది.
ముద్దులొలికే పూలబాలలకు మూన్నాళ్ళ ఆయుష్షునీ, బండరాళ్ళకు చిరాయువునీ, తీయని పాటల కోయిలకు నల్లరంగునీ, కరకు మేఘాలకు మెరుపునీ.. సృష్టిలోని వైవిధ్యాన్ని చిత్రించిన ఈ పాట ఎందరినోట పలుకుతుందో. ఎదగటం వాంఛనీయం, అనివార్యం అయినా క్రమబద్ధమయిన నియంత్రణ అవసరమన్న జీవన భావాన్నీ, ఆ చిత్రంలోని కథానాయకి భావన జీవాన్ని పలికించిన పాట ‘తన వేళ్ళే సంకళ్ళు కదలలేని మొక్కలా’ అంటూ స్వర్ణకమలంలో మెరిసిందీ బంగారు కలం.
స్వాతికిరణంలోని సీతారామశాస్త్రి పాటలు వింటే చాలు సంక్షిప్త శబ్దచిత్రంలా సినిమా కనిపిస్తుంది. సిరివెన్నెల సినీ గీత సాహిత్యాన్ని అవలోకిస్తే సమాజ క్షేమం పట్ల, వ్యక్తిత్వ వికాసం పట్ల, మనుషుల మధ్య మమతల పట్ల, మంచితనం పంచడం పట్ల వారికి వున్న ప్రగాఢ కాంక్ష స్పష్టంగా గోచరిస్తుంది. ఎవరో ఒకరు మంచివైపు అడుగేస్తారు- అందరి మంచికి దారులు వేస్తారన్న ‘అంకురం’లోని ఆశాభావం; ‘నిగ్గదీసి అడుగు-అగ్గితోని కడుగు’ గాయం మానేందుకు అన్న గీతంలోని కచ్చిత త్వం; ‘తెల్లారింది లేవమంటూ’ స్వయంగా పాడిన మేలుకొలుపు పాట.. ఇలా శాస్త్రిగారి గీతాల్లో అభ్యుదయ నాదాలెన్నో- మానవతావాదాలెన్నెన్నో.
బతుకును బంతాటతో పోలుస్తూ ఓటమి పాలుచేసినా, గెలిచేవైపు నెట్టినా సమంగా స్వీకరించమన్న స్థితప్రజ్ఞతను ‘ధోని’లో స్వరధునిగా పారించారు. కడుపేదకైనా, కుబేరునికైనా అంతే ఆశనూ, భ్రమనూ కల్పించే ‘మనీ’ పాట మెనీ ఆలోచనల వూట. బతుకు చక్రానికి ప్రతీకగా సాగిన ‘చక్రం’ సినిమాలో తాత్విక పతాకస్థాయి గీతం ‘జగమంత కుటుంబం నాది-ఏకాకి జీవితం నాది’.
సద్గురు శివానందమూర్తి గారి పట్ల అవ్యాజానురక్తితో సీతారామశాస్త్రి గారు తన గుండెలో గురుభక్తి గుడి కట్టుకున్నారు. సనాతన సంప్రదాయపు విలువల సార్థకతనూ, సమకాలీన జీవన వికాస బాధ్యతనూ సమతూకం చేసిన సాహిత్యంగా ద్యోతకమవుతాయి సిరివెన్నెల గీతాలు.
‘ఆశ నీకు అస్త్రమవును శ్వాస నీకు శస్త్రమవును ఆశయమ్ము సారథవునురా నిరంతరం ప్రయత్నమున్నదా?నిరాశకే నిరాశ పుట్టదా? అంటూ ఆశాబీజాలను సినీ సాహిత్యకేదారంలో నాటిన నిరంతర కృషీవలుడు, గీత విరించిగా విరచించిన గీతాలలో, గళ విపంచిగా వినిపించిన పదాలలో సిరివెన్నెల సీతారామశాస్త్రి సదా చిరంజీవిగా ఉంటారు.
దేహముంది.. ప్రాణముంది – నెత్తురుంది సత్తువుంది
ఇంతకన్న సైన్యముండునా…
ఆశ నీకు అస్త్రమవును..
శ్వాస నీకు శస్త్రమగును
ఆశయమ్ము సారథవునురా…
నిరంతరం ప్రయత్నమున్నదా..
నిరాశకే నిరాశపుట్టదా..
ఆయువంటు ఉన్నవరకు..
చావుకూడ లెక్కలేక
శవముపై నీ గెలుపు చాటురా…
మనం పుట్టామని ఒకడు చెబితే విన్నాం. మన పుట్టుక మనం అనుభవించలేదు. మన చావు మనం అనుభవించం. చావనేదే లేదు. తెలియనిదాని గురించి భయమెందుకు. ఉన్నది జీవితం. చావనేది భ్రమ.
( మరణం గురించి సిరివెన్నెల)
మడిపల్లి దక్షిణామూర్తి
98662 77107