అంతవంత ఇమే దేహా నిత్యస్తోక్తాః శరీరిణః
అనాశినోప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత॥ (భగవద్గీత 2-18)
మహా భారత యుద్ధ ప్రారంభంలోనే కురుక్షేత్ర రణభూమిలో పాండవ మధ్యముడు హఠాత్తుగా నిర్వేద భావనకు గురయ్యాడు. అప్పుడు సాక్షాత్తూ నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణభగవానుడు పూనుకొని అర్జునుడికి కర్తవ్య నిష్ఠను గుర్తుచేసి, అతని ఆలోచనా ధారలోని లోపాన్ని సరిదిద్దవలసి వచ్చింది. అయితే ఇది కేవలం అర్జునుడి వరకే పరిమితం కాకుండా యావత్ ప్రపంచానికి కర్తవ్య బోధ చేసినట్లుగా ఉంది. బలహీన మనస్కులై కర్తవ్య విముఖులుగా మారే ప్రతి మానవునికి ఇటువంటి జ్ఞానబోధ అవసరమే. అర్జునుడికి ఉన్న భ్రాంతిని పటాపంచలు చేస్తూ స్వామి ‘అర్జునా! ఎప్పుడైనా శరీరధారి అయిన జీవునిలోని జీవుడు మాత్రమే నిత్యుడు కాని, శరీరం మాత్రం శిథిలమవుతుంది, అది అనిత్యం. అంటే దేహి మాత్రమే నిత్యం అంతేకానీ, దేహం కాదు. పైగా ఈ శరీరంలోని జీవుడు ఏ ప్రమాణాలకూ చిక్కడు. కానీ, శరీరాలు తప్పక అంతరించేవే కాబట్టి, నీవు యుద్ధం చేయి’ అంటూ హితబోధ చేశాడు.
లోకంలో ‘సత్’, ‘అసత్’ అని భావించే రెండిటిలో దేహంలోని జీవుడే ‘సత్’- నాశనం లేనిది, దేహం మాత్రం ‘అసత్’ అది ఎప్పుడైనా నాశనమయ్యేదే. దాన్ని అర్థం చేసుకునే దాన్నే జ్ఞానం అంటాం. అది బుద్ధి వల్ల సాధించాలి. సరైన మార్గంలో ఆలోచిస్తే ఈ సదసద్వివేక జ్ఞానం లభ్యమవుతుంది. దానివల్ల మనిషిలోని భ్రమలు తొలగిపోతాయి. కర్తవ్యపాలనలో ఎటువంటి తొట్రుపాటుకు, నిర్వేదానికి తావు ఉండదు.
దేహమనేది ఉన్నప్పుడు అందులో దేహి తప్పకుండా ఉంటాడు. ఇది సృష్టిధర్మం. ఇండ్లలో మనుషులు నివసించినట్లే, దేహంలో దేహి కూడా నివసిస్తుంది. ‘దేహి’ నిత్యం, దేహం అనిత్యం అనే విషయంలో సరైన జ్ఞానాన్ని సాధిస్తే అర్జునుడి వలె ఎవ్వరూ నిర్వేదానికి లోనుకారు. దేహానికి దేహి ముఖ్యం కాబట్టి అంతరించిపోయే దేహం మీద భ్రమలు పనికిరావన్న విచక్షణ కలిగించాలని సంకల్పించాడు శ్రీకృష్ణుడు.
మరో కోణం నుంచి గమనిస్తే కర్తవ్య నిర్వహణ పేరిట భగవంతుడు వివరించిన విషయాలను లోతుగా ఆలోచిస్తే, ఏ విధంగానైనా నశించిపోయే శరీరాలపై బాంధవ్యం పేరుతోనో, మరో ఆలోచనతోనో మమకారాన్ని పెంచుకొని తాను నిర్వహించాల్సిన బాధ్యత నుంచి, తన కర్తవ్య నిర్వహణ నుంచి మనిషి దూరం కారాదన్నది భగవంతుడి అభిమతం.
యుద్ధంలో ఒకవేళ తన అస్త్ర శస్ర్తాలతో భీష్మ ద్రోణాదులు మరణిస్తే అది తన వల్లనే అనుకున్న అర్జునుడి మనోభావన కారణంగా అతనిలో కర్తవ్య విముఖత, విధి నిర్వహణపై అనాసక్తత చోటుచేసుకుంది. అందుకు వారిలోని జీవునికి అంటే ఆత్మకు మరణం లేదని, వాళ్ల శరీరాలు మాత్రమే పడిపోతాయని పలు ప్రమాణాలతో బోధించాడు శ్రీకృష్ణుడు. అర్జునుడనే కాదు ప్రపంచంలోని ప్రతి మనిషి ఆలోచన కూడా ఇంచుమించు ఇదే రీతిలో సాగుతుంటుంది. ప్రతిదానికీ తానే కారణమన్న భ్రమలో అతని ఆలోచనలు సాగుతాయి. అందువల్ల ఒక్కోసారి తీవ్ర నిర్వేదానికి లోనై మనిషి కర్తవ్య విముఖుడవుతుంటాడు. అందుకే కృష్ణభగవానుడు అర్జునుడు కేవలం నిమిత్త మాత్రుడని వారి మరణాలు అంటే కేవలం అనిత్యమైన వారి దేహాలు రాలిపోతాయి తప్ప, వారిలోని జీవుడికి నాశనం లేదని స్పష్టంగా బోధించాడు.
ఇక్కడొక ధర్మసూక్ష్మం ఉంది. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడి ప్రేరణతో యుద్ధ సన్నద్ధుడై రాలేదు. మొదట తనకు తానే సిద్ధపడి వచ్చాడు. యుద్ధక్షేత్రానికి వచ్చిన తర్వాత అతనిని నిర్వేదం, నిస్పృహ ఆవరించాయి. వాటిని నివారించే క్రమంలో శ్రీకృష్ణుడు దేహి, దేహ తతాలను బోధించి అర్జునుడిని యుద్ధానికి సుముఖుడిని చేశాడు. ఇదే భగవంతుడి లీల.
-గన్నమరాజు
గిరిజా మనోహరబాబు 99490 15448