అసాధ్యాలను సుసాధ్యాలు చేయగల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ రంగంలో దశాబ్దాల వివక్షకు తెర దించుతూ, భర్తీలు-పదోన్నతుల విషయంలోనూ స్థానికతకే పట్టం గట్టడంతో యువతలో హర్షాతిరేకం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలకు సంబంధించి శాసనసభలో సీఎం కేసీఆర్ చేసిన వివరణాత్మక ప్రకటన నిరుద్యోగుల్లో అవధులు లేని ఆనందాన్ని నింపింది.
తెలంగాణలో ఉద్యోగ నియామకాల్లో దశాబ్దాలుగా చోటుచేసుకున్న అసమానతలు అంతమై సమన్యాయం దక్కనున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో జరిగిన అన్యాయంపై ఆగ్రహమే తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమాలకు ఊపిరి పోసింది. దానిపై సంపూర్ణ అవగాహన ఉన్న ఉద్యమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అసమానతలు ఉండరాదని, జోనల్ వ్యవస్థ నిబంధనల మార్పు కోసం తీవ్ర కృషి చేసి సఫలీకృతులయ్యారు.
ముల్కీ నిబంధనలు, ఆరు సూత్రాల పథకం, పెద్ద మనుష్యుల ఒప్పందం, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 ఉత్తర్వులు, గిర్గ్లానీ నివేదిక తెలంగాణ వాసులకు జరిగిన అన్యాయాన్ని దూరం చేయలేకపోయాయి. నిజాం పాలనలో ఉత్తరాది వారికే ఉద్యోగాలు అధికంగా దక్కేవి. దాంతో ఉవ్వెత్తున లేచిన ఉద్యమం కారణంగా మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1919లో ప్రవేశ పెట్టిన ముల్కీ నిబంధనల ప్రకారం తెలంగాణలోని ఉద్యోగాలన్నీ స్థానికులకే చెందాలి. దీని ప్రకారం తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగం పొందటానికి నివాస నిబంధన 12 ఏండ్లు ఉండాలని నిర్ణయించారు. 1973 సెప్టెంబర్ 28న జారీ అయిన ‘ఆరు సూత్రాల పథకం’లో భాగంగా 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) వెలువడ్డాయి. ఫలితంగా రాష్ర్టాన్ని 1, 2, 3 జోన్లు (కోస్తాంధ్ర, రాయలసీమ), 5, 6 జోన్లు (తెలంగాణ)గా విభజించారు. ఈ ఉత్తర్వులోని పేరా 14 ప్రకారం కొన్నింటిని స్థానిక రిజర్వేషన్ల పరిధి నుంచి తప్పించారు. హైదరాబాద్లో మినహాయించిన ఆఫీసులకు కాకుండా, మిగిలిన అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో లోకల్ రిజర్వేషన్ పాటించాలని పేరా 20 సూచించింది.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయి కేడర్లలో 80 శాతం, జోనల్ స్థాయిలో 60 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వు అయ్యాయి. రిజర్వు అయినవి పోగా మిగిలిన వాటిని ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయాలి. వాటిని స్థానికేతరులకు రిజర్వు చేయరాదని ఉత్తర్వులు స్పష్టంగా పేర్కొన్నాయి. కానీ జోనల్ విధానాన్ని సైతం తుంగలో తొక్కారు. ఎన్టీఆర్ హయాంలో నియమించిన జయభారత్ రెడ్డి, కమలనాథన్, ఉమాపతిలతో ఏర్పర్చిన త్రిసభ్య కమిటీ- 1975 నుంచి 1984 మధ్య కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలను పరిశీలించి సమర్పించిన 36 పేజీల నివేదికలో… జోన్ల రిజర్వేషన్లకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన 1, 2, 3 జోన్లకు చెందినవారు 58,986 మంది తెలంగాణలోని 5. 6 జోన్లలో నియమింపబడినట్లు తెలిపింది. దాంతో ఎన్టీఆర్ 1985 డిసెంబర్ 30న 610 జీవో జారీ చేశారు. చేసిన తప్పులను దిద్దుకునే క్రమంలో 1986 మార్చి 30కల్లా తెలంగాణలో ఉన్న ఆంధ్ర ఉద్యోగులందరినీ ఎవరి జోన్లకు వారిని పంపుతామని ఎన్టీఆర్ ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత చంద్రబాబు హయాంలో గిర్గ్లానీ కమిషన్ కూడా తన నివేదికలో రాష్ట్రపతి ఉత్తర్వులు 126 పద్ధతుల్లో ఉల్లంఘన జరిగాయని తెలిపింది. గిర్గ్లానీ నివేదిక ప్రకారం- సగం మంది స్థానికేతరులున్నారని స్పష్టమైంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి, పలు అంశాలపై చర్చించి, 7 జోన్లు, 2 మల్టీ జోన్లను, 31 జిల్లాలను కలిపి ఖరారు చేశారు. మొత్తం వ్యవహారాన్ని అమలులోకి తెచ్చేందుకు సీఎం స్వయంగా పర్యవేక్షించారు. ప్రధానిని ఒప్పించిన ఫలితంగా కేంద్రప్రభుత్వ ఆమోదం లభించింది.
దీంతో స్థానికులకు 95 శాతం, ఓపెన్ కోటాలో 5 శాతం ఉద్యోగాల నియామకాలు, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పద్ధతుల్లో, రాష్ట్రస్థాయిలో పదోన్నతులు జరుపడానికి మార్గం సుగమం అయింది. ఆర్టికల్ 371-డి ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేయడం కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేసీఆర్ స్వయంగా అనేకసార్లు ప్రధానిని, రాష్ట్రపతిని కలిశారు. ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల ఫలితంగా రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ సాధ్యమైంది. దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ శాతం పెరగటమే కాకుండా, రిజర్వేషన్ పరిధిలోకి వచ్చే పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. స్థానిక అభ్యర్థులు తమ స్వంత జిల్లా జోన్, మల్టీ జోన్లలో 95 శాతం రిజర్వేషన్ సౌకర్యాన్ని కలిగి ఉండటమే గాక ఇతర జిల్లాలు, జోన్లు, మల్టీ జోన్లలో 5 శాతం ఓపెన్ కోటా ఉద్యోగాలకు కూడా పోటీ పడవచ్చు. దశాబ్దాల వలస పాలకుల వివక్ష వల్ల జరిగిన నష్టాన్ని కేసీఆర్ దూరం చేశారు. సాగునీరు విషయంలో అద్భుత ప్రగతి సాధించిన కేసీఆర్, ఉద్యోగ రంగంలో నూ విప్లవాత్మక మార్పులతో నూతన శకానికి నాంది పలికారు.
ఈ వివక్ష, అన్యాయాలపై తెలంగాణ తిరగబడింది. స్వరాష్ర్టాన్ని సాధించుకున్నది. రాష్ట్ర ఏర్పాటు జరిగాక ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నేతలు పలు అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. తెలంగాణలోని జిల్లా, జోనల్, రాష్ట్ర కేడర్ల 3 లక్షల పోస్టుల వివరాలను పేర్కొన్నారు. జూనియర్ అసిస్టెంట్, ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు జిల్లా స్థాయిలో, గజిటెడ్ హెచ్ఎంలు, ఎంఈఓలు జోనల్, ఉప విద్యాధికారులు బహుళ జోన్, ఆపైన రాష్ట్ర స్థాయిలో ఉండాలని సూచించారు.
– రామకిష్టయ్య సంగనభట్ల
94405 95494