కేంద్రం ఈ ఏడాది ఇద్దరు రాజకీయ ఉద్దండులకు సర్వోన్నత పౌరపురస్కారమైన భారతరత్న ప్రకటించింది. అందులో మొదటి వ్యక్తి బీహారీ సామాజికన్యాయ పథనిర్దేశకుడు కర్పూరీ ఠాకూర్ కాగా, రెండో వ్యక్తి హిందూత్వ రాజకీయాలను మలుపు తిప్పిన బీజేపీ దిగ్గజం లాల్కృష్ణ అద్వానీ. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ ప్రకటనలు వెలువడ్డాయన్నది తెలిసిన విషయమే. ఈ ఎంపికలు ప్రస్తుత దేశ నాయకత్వ ఆలోచనా ధోరణికి అద్దం పడుతున్నాయని చెప్పకతప్పదు. మందిర్, మండల్ అనే రెండు విభిన్న ధోరణులను సమతూకం చేయాలనే ఆలోచన వీటి వెనుక ఉందనేది వాస్తవం.
మరణానంతరం చాలాకాలం తర్వాత ఒకరిని ఎంపిక చేస్తే, మరొకరిని రాజకీయ జీవిత చరమాంకంలో ఎంపిక చేశారు. రాజకీయ సిద్ధాంతాల పరంగా ఇద్దరూ ఉత్తర, దక్షిణ ధ్రువాలు కావడం విశేషం. రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసి మండల్ రాజకీయాలకు బాటలు వేసిన వ్యక్తి కర్పూరీ ఠాకూర్. అట్టడుగువర్గాల నుంచి వచ్చిన నేత. భారతీయ సోషలిస్టు ఆలోచనా ధోరణికి ప్రతినిధి. అలాగే అయోధ్య రామమందిర డిమాండ్ ప్రబలంగా ముందుకు రావడంలో అద్వానీ నిర్వహించిన రథయాత్ర కీలక పాత్ర పోషించింది. ప్రధాని నరేంద్ర మోదీకంటే ముందరి కాలంలో హిందూత్వ రాజకీయాలకు ప్రతీకలా నిలిచిన నేత. ఆయన ప్రబలంగా ముందుకుతెచ్చిన అయోధ్య రామాలయ డిమాండ్ బీజేపీ రాజకీయ ఉత్థానానికి పునాదులు వేసింది. దీని పర్యవసానంగానే ఈరోజు ఆ పార్టీ జాతీయ రాజకీయాల్లో నిర్ణాయక పాత్ర పోషించే స్థితికి ఎదిగిందనేది నిర్వివాదాంశం. ఈ కోణంలో పరిశీలిస్తే అద్వానీ ఎంపిక పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.
బీజేపీ అభ్యున్నతికి ఎంతో తోడ్పాటు అందించిన అద్వానీకి సర్వోన్నత పదవులు ఎప్పుడూ దూరంగానే ఉండిపోయాయి. అటల్ బిహారీ వాజపేయి హయాంలో ఆయన ఉపప్రధానిగా సేవలందించారు. ఒకదశలో ప్రధాని అవుతారని అనుకున్నప్పటికీ ఆ పదవి ఆయనకు రకరకాల కారణాల వల్ల దక్కలేదనేది తెలిసిందే. మరోదశలో ఆయన పేరు రాష్ట్రపతి పదవికి బలంగా వినిపించినప్పటికీ అదీ జరగలేదు. విశ్రాంత జీవితం గడుపుతున్న ఆయన ఇటీవల అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి వృద్ధాప్యం, ఆరోగ్య సమస్యల కారణంగా హాజరు కాకపోవడం(కావొద్దనడం)పై కూడా చర్చోపచర్చలు జరిగాయి.
నూరో పుట్టినరోజుకు దగ్గరగా ఉన్న అద్వానీకి ప్రస్తుతం అవన్నీ అప్రస్తుత విషయాలే కావచ్చు. అయితే ఏనాడూ పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి సంకుచిత రాజకీయాల జోలికి ఆయన వెళ్లకపోవడం గమనార్హం. తన జీవితాన్ని బీజేపీ సిద్ధాంతాల సాధనకు, శ్రేయస్సుకు అంకితం చేసిన నేతకు ఆలస్యంగానైనా తగిన గుర్తింపు ఇవ్వాలనే కేంద్ర పెద్దల ఆలోచనే..బహుశా ఈ పురస్కారానికి ఆయనను ఎంపిక చేయడానికి దోహదం చేసి ఉండవచ్చు. ఎన్నికల వేళ అద్వానీ అనుయాయుల్ని, అభిమానుల్ని తనవైపు తిప్పుకోవాలనే మోదీ రాజకీయమూ ఇందులో దాగి ఉండవచ్చు.
ఇవన్నీ ఎలా ఉన్నా భారతరత్న అవార్డు రాజకీయ ప్రాధాన్యతలకు పరిమితం కావడమే కొంత విచారకరం. రాజకీయ నేతలకు ఈ అవార్డు ఇవ్వడం కొత్తకాదు. ప్రథమ ప్రధాని నెహ్రూ మొదలుకొని ఇందిరా, ఎంజీఆర్ వరకు ఎందరో రాజకీయ మహామహులు ఈ అవార్డు అందుకున్నవారిలో ఉన్నారు. కలాం, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతామంగేష్కర్ తదితర ప్రముఖులు గతంలో ఎంపికయ్యారు. ఇటీవలి కాలంలో సామాజిక, కళా, సాంస్కృతిక రంగాలకు ప్రాధాన్యం తగ్గిపోవడం ఆలోచించదగిన అంశం.