ఒక రాజు పాలించిన ప్రాంతమేదో స్పష్టంగా చెప్పలేం. ఒక సంఘటన ఏ శతాబ్దంలో ఎక్కడ జరిగిందో కచ్చితంగా తేల్చలేం. రాజవంశాలూ.. కోట ముట్టడుల వివరాలు, తారీకులు, కైఫీయ్యతులు.. ఇలా ఏదీ తడిమినా సిసలైన చరిత్ర కనిపించదు. మరి అలాంటప్పుడు రచయితలను చారిత్రక కథారచన వైపు మళ్లించి, మెరుగైన కథలను అందించగలమా! కచ్చితంగా అది ఆచరణ సాధ్యమమేనంటూ రచయిత, పరిశోధకులు సాయి పాపినేని 2022 మార్చి 5, 6 తేదీల్లో హైదరాబాద్లో ‘కాలయంత్రం’ పేరుతో చారిత్రక కథా కార్యశాలను నిర్వహించారు.
ప్రముఖ స్థపతి, పరిశోధకులు ఈమని శివనాగిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. తొలిరోజు కార్యక్రమాల్లో భాగంగా శాసనాల్లో కూడా కథలున్నాయని, సునిశిత పరిశీలన, చారిత్రక అవగాహనతో కలం కదిలిస్తే తెరమరుగైన గాథలను వెలికితీయడం ఏ మాత్రం కష్టం కాదంటూ కథా దర్బారుకు తెరలేపారు. శాసనభాష అర్థం కావడం లేదంటే దానికి కారణం అందులోని పురాతన లిపి చిహ్నాలపై అవగాహన లేకపోవడమే. మనసు పెడితే శాసనాలను కూడా చదవొచ్చు. వాటిలో మానవ సహజ హృదయ స్పందనలను తడమవచ్చు. కాలగతిలో చెదిరిపోయిన సంఘటనలకు కథారూపమివ్వొచ్చంటూ.. ఆయన మార్గదర్శనం చేశారు.
రచయిత్రి పద్మ.. అమ్మ తల్లుల పూజ క్రతువులు, ఆటవిక దశనుంచి ఆధునికం వరకూ బహురూపాలు పొందిన తీరుని విశ్లేషించారు. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ మతాలను శక్తి ఆరాధన ఎలా ప్రభావితం చేసిందో సింధూ కాలం నాటి రాతి ముద్రల మీదున్న చిహ్నాల ఆధారంగా విశ్లేషించారు.
సాహితీ విమర్శకులు వాడ్రేవు చిన వీరభద్రుడు మాట్లాడుతూ.. చరిత్ర ఒక అనుభవాన్ని కలిగించినప్పుడు అది హిస్టారికల్ ఫిక్షన్ ఔవుతుందన్నారు. ఆత్మకథాత్మకంగా, లేఖల ఆధారంగా, దృష్టాంతాల మాదిరిగా, ప్రహేళికల నేపథ్యంగా చరిత్ర రచన సాగాలని రచయితలకు సూచించారు.
‘మానవ సమూహం-సమాజం-కుటుంబం’ అనే అంశంపై సాయి పాపినేని మాట్లాడుతూ.. వేల ఏండ్ల కిందటే మానవుడు తన కథ చెప్పుకోవడం మొదలుపెట్టాడని, బిడ్డల పెంపకం, సంరక్షణలో స్త్రీ కీలక పాత్ర పోషించిందని, నాయకత్వ పగ్గాలందుకుని సంపదపై గుత్తాధిపత్యం నెరపే స్థాయికి ఎదిగిన స్త్రీ కొత్తరాతి యుగంలో ప్రాముఖ్యం కోల్పోయిన విధాన్ని వివరించారు. మధ్యయుగంలో కుటుంబ విలువలకు పట్టంకడుతూ రామాయణం ప్రధాన వాహికగా, రాముడు ఆదర్శ భావాలకు ప్రతీకగా పితృసామ్య వ్వవస్థలో కుటుంబం కీలకభూమిక పోషించిందన్నారు.
‘నాకు నచ్చిన చారిత్రక కథ’ అంశంపై మూడు చారిత్రక రచనలపై యువ రచయతలు వారి పఠనానుభవాలను పంచుకున్నారు. ఊహ పరవస్తు లోకేశ్వర్- ‘సలాం హైదరాబాదు’; అవినేని భాస్కర్- తమిళ్ ప్రభ రాసిన ‘చింతాతఱి పేట’, ప్రసాద్ సూరి- అమితావ్ ఘోష్ ‘సీ ఆఫ్ పాపిస్’ లపై ముచ్చటించారు. ‘చారిత్రక కథ రాయడంలో రచయితల ఇబ్బందులు’ అనే అంశంపై సాగిన బృంద చర్చల ద్వారా రచయితలు కొన్ని ప్రతిపాదనలూ, సూచనలు చేశారు. ‘చారిత్రక కాల్పనిక రచన అనుభవాలు’ శీర్షికలో కథా రచయిత ఉణుదుర్తి సుధాకర్తో మహ్మద్ ఖదీర్బాబు ‘యారాడకొండ’ నవలా నేపథ్యం ఆధారంగా ముచ్చటించారు. తెలుగువారి వాణిజ్యంలో ఉత్థాన పతనాలను గురించి ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ.. రోమ్తో సాగించిన వర్తక వాణిజ్యాల వల్ల శాతవాహన సామ్రాజ్యం పరిపుష్టమైందన్నారు. కాకతీయ రెడ్డి రాజుల కాలంలో నౌకా వాణిజ్యం విస్తరించిందని, ఇది తెలుగువారి వాణిజ్యాభివృద్ధిలో స్వర్ణయుగమన్నారు.
కార్యశాల నిర్వాహకులు సాయి పాపినేని మాట్లాడుతూ.. ఇప్పుడు చారిత్రక కాల్పనిక సాహిత్యం ఎక్కువగా వస్తున్నది. దీన్ని సాహిత్య విశ్లేషకులు హిస్టారికల్ ఫిక్షన్ యుగం అంటున్నారు. ఈ సమయంలో తెలుగులో చారిత్రక కథలు రావాల్సి ఉందన్నారు. కార్యశాలలో పాల్గొన్నవారంతా.. ‘చెప్తాం చెప్తాం మేము.. మా చరిత్ర చెప్తాం మేం. మన చరిత్ర మనమే చెప్పాలి.. అంటూ ప్రతినబూనటం మన చారిత్రక కథా సాహిత్యానికి రాబోయే మంచిరోజులకు నిదర్శనం.
– సాహితీ సుధ, 94940 44429