రాయలసైన్యం ముందు షితాబుఖాను నిలబడలేక ఓటమిపాలయ్యాడు. షితాబుఖాను యుద్ధనైపుణ్యానికి రాయలు ముగ్ధుడై.. కప్పము కట్టడి చేసి వదిలిపెట్టాడు. ఆ తర్వాత రాయలు గజపతులతో యుద్ధాల్లో మునిగిపోయా డు. అద్దంకి గంగాధరుడు రచించిన ‘తపతీ సంవరణోపాఖ్యానం’ అనే కావ్యంలో షితాబుఖాను ఉదంతం ఉన్నది.
ఇబ్రహీం కుతుబ్ షా క్రీ.శ.1550-80 వరకు గోలకొండను పాలించాడు. ఇబ్రహీం షా చిత్తాబుఖాను (షితాబుఖాను)తో తలపడి అతడిని ఓడించి గోదావరి నదిని దాటి పారిపోయేటట్లు చేశాడని ఆ కావ్యంలో ఉన్నది. ఇది 1550- 51లో జరిగి ఉంటుంది. షితాబుఖాను అంతిమకాలంలో కొండపల్లి దుర్గంలో తలదాచుకున్నాడని చరిత్రకారులు అంటారు. దాం తో షితాబుఖాను పాలన అంతం అయ్యింది. క్రీ.శ.1504-1550 మధ్య కాలంలో షితాబుఖాను ఏకశిలా నగరాన్ని వైభవంగా పాలించాడు.
ఇప్పుడు తెలుగు సాహిత్య వికాసాన్ని చెప్పుకొంటున్న సమయంలో కవుల కావ్యపీఠికలలో వర్ణించబడిన చక్కని సంస్కృత శాసనాన్ని వేయించిన ఓరుగల్లుకు వైభవాన్ని సమకూర్చిన షితాబుఖాను గూర్చి తెలుసుకోవటం సమంజసం. షితాబుఖాను లాగానే నిమ్నవర్గం నుంచి వచ్చి శౌర్యసాహసాలు గుణాలుగా కలిగి చిన్నపాటి సైన్యాన్ని పోగు చేసుకొని విజయాలను సాధించిన వీరుడు తెలంగాణ ప్రాంతంలో సర్వాయి పాపన్న కనిపిస్తాడు. అతడు అసఫ్జాహీల కాలంలో మెరుపు దాడులతో భువనగిరి దుర్గాన్ని వశపర్చుకొని ఆ ప్రాంతాన్ని పాలించాడు.
తెలంగాణలో నిమ్నవర్గాల నుంచి వచ్చి పోరాటాలు చేసిన శూరులు చాలామందే కనిపిస్తారు. సర్వాయి పాపన్న గురించి జానపదులు పాట లు రాసుకొని పాడారు. ‘సీతడు’ అయిన షితాబుఖాను శాసనాల్లో, కవుల కావ్యాల్లో గొప్పగా కీర్తింపబడటం గమనార్హం.
చరిగొండ ధర్మన ‘చిత్రభారతం’ అనే కావ్యాన్ని రచించి షితాబుఖాను మంత్రి అయిన ఎనుముపల్లి పెద్దామాత్యునికి అంకితంగా ఇచ్చాడు. ఈ కావ్యంలో ఎనిమిది ఆశ్వాసాలున్నాయి. ‘చిత్రభారత’ కథను ‘బ్రహ్మాండ పురాణం’ నుంచి తీసుకున్నానని కవి అన్నాడు. కవి కావ్యం కథ అధికారికంగా ఉండాలనే ఉద్దేశంతో కథను ‘బ్రహ్మాండ పురాణం నుంచి తీసుకొన్నా ను’ అని అన్నాడు కావచ్చు. ఏ పురాణంలోనూ ఈ కథ లేదు. ఇది కల్పిత కథ. శ్రీకృష్ణదేవరాయల కాలంలోని మారయగారి మల్లన ‘రాజశేఖర చరిత్ర’ కథ, పింగళి సూరన ‘కళాపూర్ణ కథలు’ కూడా కల్పితమైనవే.
కల్పిత కథలను కావ్యంలో ఇతివృత్తంగా తీసుకున్న మొట్టమొదటి కవి చరిగొండ ధర్మన అని చెప్పాలి. ‘రాజశేఖర చరిత్ర’, ‘కళాపూర్ణోదయా’ల కన్నా ‘చిత్రభారతం’ పూర్వ రచన. ఈ కావ్యంలో నాయిక లేకున్నా ప్రబంధాలకు ఉచితమైన వర్ణనలున్నాయి. కాబట్టి ఇది తెలంగాణ నుంచి వచ్చిన మొట్టమొదటి ప్రబంధం అని చెప్పాలి.
‘చిత్రభారతం’లో కృష్ణార్జునుల మధ్య యుద్ధం జరిగినట్లుగా కవి వర్ణించాడు. చిత్రభారతం అని పేరుకు తగ్గట్టుగానే ఈ కథ చిత్రంగా ఉన్నది. మహాభారతంలో ఎక్కడా కృష్ణార్జునుల మధ్య యుద్ధం జరిగినట్లు లేదు. కృష్ణార్జునులు బావ, బావమరుదులు. పైగా మంచి స్నేహితులు. వాళ్లిద్దరి మధ్య చతుర్ధన రాజు వల్ల యుద్ధం సంభవించినట్లుగా కవి వర్ణించాడు. మహాభారత యుద్ధం వలెనే వాళ్లిద్దరి మధ్య యుద్ధం కూడా 18 రోజులు జరిగినట్లుగా కవి వీర రసస్ఫోరకంగా రచించాడు. చిత్ర కవిత్వంలో తనకున్న ప్రావీణ్యాన్ని చూపించాడు. ఆ తర్వాత ‘చిత్రభారతం’ కథను తీసుకొని నాదెండ్ల గోప మంత్రి (1522) ‘కృష్ణార్జున సంవాదం’గా రచించాడు. ఆయన చతుర్ధన రాజు స్థానంలో గయున్ని ప్రవేశపెట్టాడు. ఆధునిక కాలంలో చిలకమర్తి ఈ కథను తీసుకొని ‘గయోపాఖ్యానం’ అనే నాటకాన్ని రూపొందించాడు. ఈ నాట కం చాలాసార్లు ప్రదర్శన కెక్కింది.
ముదిగంటి
సుజాతారెడ్డి
99634 31606