‘భానుమండల తేజమీ పానుగల్లు’ అంటూ కొనియాడిన పానుగల్లు నల్లగొండ పట్టణ సమీపంలో ఉన్నది. పూర్వకాలంలో కందూరుచోడులు, విష్ణుకుండినులు, కాకతీయుల పరిపాలనలో పానుగల్లు ముఖ్య పట్టణంగా వెలుగొందింది. ఇక్కడి ఛాయా సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయాలు నిర్మాణపరంగా, వాస్తుపరమైన సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబడిన అద్భుతమైన కట్టడాలు.
ఈ ఆలయాలకు ఆ కాలంలో అనేక దానధర్మాలు చేయబడినవి. అట్లా ఉన్న దాన శాసనాల్లో సారంగపాణిదేవుడు వేయించిన శాసనం ఇది. శాసనకాలం శక సంవత్సరం 1189= క్రీ.శ.1267 ప్రభవనామ సంవత్సర అధిక జ్యేష్ట బహుళ అమావాస్య. కాకతీయ రుద్రమదేవి కాలంలో వేయించిన ఈ శాసనశిల ఛాయా సోమేశ్వరాలయ ఆవరణలో ఉన్నది.
ఈశాసనం విఘ్నేశ్వర, వరాహ ప్రార్థనలతో మొదలై చతుర్థ కులజులైన కాకతీయ రెండవ ప్రోల, మహాదేవుడు, గణపతిదేవ మహారాజు, రుద్రమదేవిల వర్ణనతో కొనసాగింది. తర్వాత శాసనకర్త అయిన సారంగపాణి వంశక్రమము చెప్పబడింది. యాదవ వంశంలో భిల్లమదేవుడు, అతని కుమారుడు జైతుగి, అతని కుమారుడు సింఘనదేవుడు ఉన్నారు. సింఘనదేవుడు తనుదసమాదేవి దంపతులకు జన్మించినవాడు సారంగపాణి.
యాదవ వంశానికి చెందిన సారంగపాణి పానుగల్లు ఛాయా సోమనాథ దేవుని అంగరంగ భోగాలకు 12 నివర్తనాల భూమిని దానం చేసి ఈ శాసనం వేయించినాడు. పానుగంటి అధిపతి అయిన సారంగపాణి ఛాయా సోమనాథుని అంగరంగ భోగాలకు తంమ సముద్రం వెనుక ఆరు మఱుతుర్లు, ఉదయ సముద్రం కింద ఆరు మఱుతుర్లు మొత్తం 12 మఱుతుర్లు నీరు నేల రెండు కాలాల్లో పండేవిధంగా ఆచంద్రార్క స్థాయిగా ధారాపూర్వకంగా ఇచ్చినాడు. ఈ శాసనంలో కరణం డిండిమరాజు తన వెలిపొలములోన కాట్రేని వనంలో దక్షిణాన ముప్పందుము (30 తూములు) భూమిని సోమనాథ దేవుని దీపానికి ధారాపూర్వకంగా సమర్పించాడు.
శాసనంలో రుద్రదేవ మహారాజులు
(రుద్రమదేవి) ‘మహా మండలేశ్వర, పరమ మాహేశ్వర, పతిహిత చరిత వినయ విభూషణ, శ్రీ అనుమకొండ పురవరాధీశ్వర, చలమర్తి గండ మూఱురాయ జగదాళ నామాది సమస్త ప్రశస్తి సహితం శ్రీ స్వయంభూదేవు దివ్యశ్రీ పాద పద్మారాధకులైన శ్రీమన్మహామండలేశ్వర కాకతియ్య మనుమ రుద్రదేవ మహారాజులు’ అని రుద్రమదేవి పేర్కొనబడింది.
అదేవిధంగా శాసనకర్త అయిన సారంగపాణి ‘మహారాజాధిరాజ, రాజ పరమేశ్వర, పరమ భట్టారక, ద్వారవతీ పురవరాధీశ్వర, విష్ణు వంశోద్భవ, యాదవ కుల కమల కలిక, వికాస భాస్కర, అప్రతిమల్ల’.. అంటూ కీర్తించబడినాడు. శాసనంలో దాన విషయం చాలా తక్కువగానే ఉంది. కానీ శాసనకర్త గురించి, అతడి రాజులైన కాకతీయుల గురించి చాలా విస్తృతంగా వర్ణించబడినది.